ద్వారకాతిరుమల: మండలంలోని రామన్నగూడెం పంచాయతీ కార్యాలయంలో తమ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.10 లక్షల నిధులను స్వాహా చేశారని పలువురు వార్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న వార్డు సభ్యుడు పాకలపాటి మాణిక్యాలరావు డీపీఓకి ఫిర్యాదు చేశారు. ఈనెల 15న పంచాయతీ బోర్డు సమావేశం నిర్వహించగా తాము పాత తీర్మానాలను పరిశీలించామని, అందులో తనతో పాటు మరికొందరి సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి వాటి ద్వారా పలు తీర్మానాలను ఆమోదించి నిధులు బొక్కేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి నాగరాజుతో పాటు మరో అధికారి పాత్ర ఉందని వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గ్రామానికి చెందిన కొత్తపల్లి రమేష్ అనే వ్యక్తి పంచాయతీలో రూ.20 లక్షల నిధులు దుర్వినియోగం జరిగాయని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అలాగే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు కొండపల్లి సహదేవుడు తనకు ఏడాది కాలానికి సంబంధించిన వేతనం సొమ్మును గత పంచాయతీ కార్యదర్శి నాగరాజు కాజేశాడని కలెక్టర్కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆయా అక్రమాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రామన్నగూడెంలో వార్డు సభ్యుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment