Accreditation
-
301 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 301 మంది జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ డా.ఎ.మల్లికార్జున తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు ప్రభుత్వ ఉత్తర్వుల్ని అనుసరించి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులతో పాటు అవసరమైన ధృవపత్రాల కాపీలను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అక్రిడిటేడ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోర్డినేటర్ డా.రాజేష్ని ఆదేశించామన్నారు. ప్రధాన పత్రికలు మినహా ఇతర పేపర్లలో విధులు నిర్వహిస్తున్న నిరుపేద రిపోర్టర్లకు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్కు అవసరమైన చలానా నగదుని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యుడు, సాక్షి బ్యూరో చీఫ్, కె.రాఘవేంద్రారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డా.మల్లికార్జున హెల్త్స్కీమ్ చలానాల్ని సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా చెల్లించేందుకు అంగీకరించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం ఆర్టీసీ పాస్ చెల్లుబాటు అయ్యేలా చూడాలని కమిటీ సభ్యులు కోరగా.. ఇప్పటికే దానికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎన్ఎస్ఆర్కే బాబూరావు, చిట్టిబాబు, అనురాధ, డి.రాణి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్, మోహనలక్ష్మి, ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, కన్వీనర్, మెంబర్ మణిరామ్ పాల్గొన్నారు. -
టాప్ అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్.. జీక్యూఐఐలో అయిదో ర్యాంకు
న్యూఢిల్లీ: నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి అత్యుత్తమ అక్రెడిటేషన్ వ్యవస్థలు ఉన్న టాప్ అయిదు దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. 184 దేశాల లిస్టులో అయిదో స్థానంలో నిల్చింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రా ఇండెక్స్ (జీక్యూఐఐ) 2021 ర్యాంకింగ్లు ఇటీవల విడుదలయ్యాయి. సూచీ ప్రకారం ప్రామాణీకరణలో భారత్ తొమ్మిదో స్థానంలో, మెట్రాలజీ విషయంలో 21వ ర్యాంకులోనూ ఉంది. ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, చైనా, ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ అయిదు అక్రెడిటింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్కు గుర్తింపు లభించడంపై భారతీయ నాణ్యతా మండలి (క్యూసీఐ) హర్షం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతపరమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాణాల అమలుకు తోడ్పడే సంస్థలను నియమించేందుకు జాతీయ అక్రెడిటేషన్ సంస్థ పాటించే ప్రక్రియను అక్రెడిటేషన్గా వ్యవహరిస్తారు. నిర్దిష్ట సంవత్సరం ఆఖరు వరకూ ఉన్న డేటాను ఆ తదుపరి సంవత్సరంలో సేకరించి, విశ్లేషించి, ఏడాది ఆఖరున ర్యాంకింగ్లు విడుదల చేస్తారు. డిసెంబర్ 2021 ఆఖరు వరకు గల డేటాను 2022లో ఆసాంతం సేకరించి, విశ్లేషించి, 2021 ర్యాంకింగ్లు ఇచ్చారు. స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలు మెసోపార్ట్నర్, అనలిటికర్ ఈ జీక్యూఐఐ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాయి. -
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న నర్సరీలు
మల్లెలు, జాజుల గుబాళింపుతో నర్సరీలు స్వాగతం పలుకుతాయి. లిల్లీ, గులాబీల అందాలు రా..రమ్మని ఆహ్వానిస్తాయి. కనకాంబరాలు కలరింగ్తో పడేస్తాయి. హెల్కోనియా హ్యాంగింగ్స్ అబ్బుర పరుస్తాయి. గ్లాడియోలస్ అందాలు బాగున్నారా అంటూ పలుకరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఆకర్షిస్తాయి. ఆర్కిడ్స్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడతాయి. అలహాబాద్ సఫేదీ, తైవాన్ జామ నర్సరీలు, కొబ్బరి నర్సరీలు రైతులకు దిగుబడుల లాభాలను పంచుతామంటూ ముందుకు వస్తాయి. సరిగ్గా దృష్టి సారిస్తే కడియం, కడియపు లంక మాదిరి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కూడా నర్సరీల జిల్లాగా రూపాంతరం చెందేందుకు మార్గాలు అనేకం ఉన్నాయి. తాడేపల్లిగూడెం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్న సమయంలోనే నర్సరీలు, ఫ్లోరీ కల్చర్, కొబ్బరి, జామ నర్సరీల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో కృషి జరిగింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్లిన పెరవలి మండలం కాకరపర్రు పువ్వుల పల్లెగా పరిఢవిల్లింది. మెట్ట ప్రాంతాల్లో కూడా నర్సరీల పెంపకం పెరిగింది. విధానపరమైన నిర్ణయాలతో జిల్లా వేరువేరు ప్రాంతాలుగా విడిపోకముందు నర్సరీల అభివృద్ధిపై ఉద్యాన శాఖ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నర్సరీల సమాచారం సేకరించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని నర్సరీల వివరాలను తీసుకుంది. నర్సరీలకు జిల్లా అనుకూలం తైవాన్, అలహాబాద్ సఫేది రకాలకు చెందిన జామ నర్సరీలు తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఉన్నాయి. జిల్లాలోని తణుకు మండలం రేలంగి గ్రామంలో నర్సరీలను వృద్ధి చేస్తున్నారు. పాలకొల్లు మండలం అడవిపాలెంలో కొబ్బరి నర్సరీలను రైతులు పెంచుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో ఈస్టుకోస్టు హైబ్రీడ్ కోకోనట్ సెంటర్లో కొబ్బరి నర్సరీలను పెంచుతున్నారు. ఇక్కడే హెల్కోనియా హ్యాంగింగ్స్ వంటి అలంకరణ పుష్పాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా థాయిలాండ్లోని నాంగ్నూచ్ గ్రామంలో ఏటా డిసెంబర్లో జరిగే కింగ్ షోకు వచ్చిన కొత్త విదేశీ రకాల మొక్కలను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు. బంతి తోటల పెంపకం ఇటీవల కాలంలో జిల్లాలో ఊపందుకుంది. గోదావరి పరీవాహకంలో లంక ప్రాంతాలు ఉండటంతో ఈ మొక్కల పెంపకానికి, ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే పలు రకాల ఆర్కిడ్స్ను ఫ్లోరల్ ఎసెన్సు ఫారమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కిడ్స్ ఫార్మ్ తణుకులో పెంచుతున్నారు. డి.1075, ఎం.ఎల్లో, డి.997, వి.స్పాటెడ్ ఎల్లో, డి.999 వంటి ఆర్కిడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్కిడ్స్తో పాటు అరుదైన పుష్ప రకాల పెంపకం విషయంలో రైతులకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అటవీ, క్లైమేట్ ఛేంజ్ డెక్కన్ రీజియన్ హైద్రాబాద్ వారు మార్గదర్శనం చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ కూడా నర్సరీల ప్రోత్సాహానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. నర్సరీలకు అక్రిడేషన్ జిల్లాలో ఏ రకం నర్సరీలను ఎక్కడెక్కడ రైతులు పెంచుతున్నారు.. ఏ ప్రామాణికాలు పాటిస్తున్నారనే విషయాలను అంచనా వేస్తూ, వాటికి చట్టబద్ధత కోసం ఉద్యాన శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో అక్రిడేషన్ కోసం సమాచారం సేకరించారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఉన్న నర్సరీల వివరాలు, విశిష్ట రక్షిత సాగు పద్ధతిలో పెంచుతున్న నర్సరీల వివరాలను తీసుకున్నారు. 2010లో నర్సరీ యాక్ట్కు అనుగుణంగా నర్సరీల పెంపకాన్ని గమనించడానికి వీలుగా సమాచారం తీసుకున్నారు. చట్టానికి లోబడి వచ్చిన నర్సరీల వివరాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. (క్లిక్: కొల్లేరుకు మహర్దశ.. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు) మేలైన మొక్కల కోసమే పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలకు అనువైన ప్రాంతం. పూల తోటలకు అనుకూలం. పండ్ల, కొబ్బరి, జామ నర్సరీలు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. నర్సరీలకు కేరాఫ్గా ఉన్న కడియం, కడియపు లంక మాదిరంత కాకున్నా, ఇక్కడ నర్సరీలను పెంచవచ్చు. నర్సరీల ద్వారా పెంచే మొక్కల్లో నాణ్యత పాటించడానికి వీలుగా రూపొందించిన నర్సరీ చట్టాన్ని అనుసరించి వాటికి అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచారం తీసుకున్నాం. దీనివల్ల నర్సరీలు పెంచే వారి బాధ్యత మరింత పెరిగి వినియోగదారులకు మంచి మొక్కలను అందించగలుగుతారు. – ఎ.దుర్గేష్ , జిల్లా ఉద్యాన అధికారి, పశ్చిమగోదావరి జిల్లా -
కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీకి యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నుంచి గురువారం ఉత్తర్వులు అందాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2008లో మచిలీపట్నం కేంద్రంగా ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 14 యూనివర్సిటీలు ఉన్నాయి. కృష్ణా తప్ప మిగతావన్నీ 12–బీ గుర్తింపు సొంతం చేసుకున్నాయి. ఇటీవల వరకు అద్దె భవనాల్లోనే (ఆంధ్ర జాతీయ కళాశాలలో) కొనసాగడం, వర్సిటీ అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 12–బీ గుర్తింపు దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పెత్తందారులు చేసిన రాజకీయ క్రీడతో వర్సిటీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో 12–బీ సాధనకు ఇదే సరైన సమయమని వర్సిటీ వైస్ చాన్స్లర్ కె.బి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రామిరెడ్డి తమ బృదానికి దిశానిర్దేశం చేశారు. దీంతో 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు సొంతమైంది. ఇకపై వర్సిటీ కార్యకలాపాలకు 80 శాతం నిధులు యూజీసీ నుంచి మంజూరవుతాయి. ఉన్నత విద్యకు ఊపిరి ► 2008–09లో అద్దె భవనాల్లో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం రుద్రవరం వద్ద 102 ఎకరాల సువిశాల ప్రదేశంలో సొంతభవనాల్లో నడుస్తోంది. ► వర్సిటీకి అనుబంధంగా యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు కలిపి164 కాలేజీల్లో ఏటా సుమారు 53 వేల మంది చదువుతున్నారు. ► వర్సిటీ క్యాంపస్లో ఆర్ట్స్అండ్ సైన్సు కోర్సులతో పాటు, ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ కోర్సులను సైతం అందిస్తున్నారు. 2011–12 విద్యా సంవత్సరం నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ అందుబాటులో ఉండగా, ఇటీవలనే వంద మంది విద్యార్థుల సామర్థ్యంతో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటైంది. ► వర్సిటీలో ఆరు డిపార్టుమెంట్లు, నూజివీడులో మూడు డిపార్టుమెంట్లు పనిచేస్తున్నాయి. పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రయోగాలకు అవకాశం 12–బీ గుర్తింపుతో విద్యార్థులతో పాటు, బోధనా సిబ్బందికీ మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగాలు చేయవచ్చు. ఇందుకయ్యే నిధులను యూజీసీ సమకూరుస్తుంది. ఈ గుర్తింపు సాధన కమిటీలో నేనూ కూడా ఓ సభ్యుడిని అయినందుకు ఆనందంగా ఉంది. కృష్ణా యూనివర్సిటీ ప్రయోగాలకు కేంద్రంగా నిలువనుంది. – డాక్టర్ డి.రామశేఖర్రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ నాక్ గుర్తింపుపై దృష్టి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే 12–బీ గుర్తింపు సాధ్యమైంది. ఈ గుర్తింపు సాధనలో ఉన్నత విద్యామండలి పెద్దల సహకారంతో ఎంతో ఉంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఎస్ఓ 9001–2015 సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాం. నా హయాంలో 12–బీ గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాక్ గుర్తింపుపై దృష్టిపెట్టాం. – కె.బి.చంద్రÔశేఖర్, వైస్ చాన్స్లర్ విద్యార్థుల అభివృద్ధే లక్ష్యం కృష్ణా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఎక్కువగా పేదవర్గాల విద్యార్థులు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయా లకు అనుగుణంగా విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. సొంత భవనాల్లో మౌలిక సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. వర్సిటీ మరింత అభివృద్ధికి యూజీసీ 12–బీ గుర్తింపు ఊతమిస్తుంది. – డాక్టర్ ఎం.రామిరెడ్డి, రిజిస్ట్రార్ -
TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పరిగెత్తించేందుకు కృషిచేస్తూనే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేగాక ట్విట్టర్లోనూ యాక్టివ్గా ఉంటూ ప్రయాణికులు, నెటిజన్ల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తూ.. పరిష్కార మార్గాలను చూపుతున్నారు. చదవండి: నూతన వధూవరులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సర్ప్రైజ్.. ఈ క్రమంలో తాజాగా జర్నలిస్టులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త అందించారు. జర్నలిస్ట్ బస్ పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు తెలంగాణ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే తమకు లభించాల్సిన తగ్గింపు (కన్సెషన్) పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో గుడ్న్యూస్ ఫర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ సూచనలు చేసిన ఇద్దరు నెటిజన్లకు ఆయన కృతజ్జతలు తెలియజేశారు. కాగా సజ్జనార్ నిర్ణయంపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సజ్జనార్కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. చదవండి: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ Good NEWS for our NEWS friends! Now, #journalists with valid bus pass from #TSRTC can avail of concession online also while booking tickets through our #TSRTC website. Thank You @iAbhinayD & @NVNAGARJUNA for your suggestion Patronage #TSRTC & #IchooseTSRTC #fridaymorning@V6News pic.twitter.com/7FEyzzBN99 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 12, 2021 అయితే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ కార్డుతో ఆర్టీసీ నుంచి బస్ పాస్ తీసుకుంటారు. ఈ పాస్ ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కన్సెషన్ పొందుతుంటారు. ఇప్పటి వరకు నేరుగా బస్ కండక్టర్ నుంచి మాత్రమే రాయితీ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే మాత్రం ఈ మినహాయింపులు వర్తించేవి కావు. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. -
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలు సవరించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వెన్ను శనివారం పేర్కొన్నారు. చదవండి: పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ -
పాత్రికేయులకు త్వరలో అక్రిడిటేషన్లు
సాక్షి, అమరావతి: అక్రిడిటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సరైందేనని న్యాయస్థానం తీర్పునివ్వడం పట్ల సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సంతోషం వ్యక్తం చేశారు. ఆ జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారమే పాత్రికేయులకు సోమవారం నుంచి అక్రిడిటేషన్లు జారీ చేస్తామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ బస్ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 20,610 మందికి అక్రిడిటేషన్లున్నాయని, తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆహ్వానించగా ఏకంగా 40,442 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జీవోలోని మార్గదర్శకాలను అనుసరించి వారిలో 32,314 మంది దరఖాస్తులు చేశారని చెప్పారు. వాటిలో ఇప్పటి వరకు 17,139 దరఖాస్తులను పరిశీలించి 6,490 మందికి అవసరమైన పత్రాలు సమర్పించాలని తెలిపామన్నారు. కేవలం 90 మంది దరఖాస్తులనే తిరస్కరించినట్టు చెప్పారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చేనాటికి 874 మంది దరఖాస్తులను ఆమోదించగా వారిలో 464 మందికి అక్రిడిటేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. కొత్త వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, దరఖాస్తు చేసుకున్నవారు వాటిలో మార్పులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. అక్రిడిటేషన్ల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని చెప్పారు. అక్రిడిటేషన్ల జారీ తర్వాత అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ప్రతిభ చాటుకుంటేనే అవకాశాలు.. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉన్నందునే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘చంద్రబాబు కొడుకు లోకేశ్కు సత్యం రామలింగరాజు వంటివారు అమెరికాలో సీటు ఇప్పించి చదివిస్తారు గానీ, సామాన్యుల పిల్లలు పరీక్షలు రాసి ప్రతిభ చాటుకుంటేనే కదా అవకాశాలు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ మంత్రులు వైఎస్సార్పై విమర్శలు చేస్తూ భావోద్వేగాలు రేకెత్తించేందుకు యత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఒక్క గ్లాసు నీటిని కూడా అదనంగా వాడుకోవడం లేదన్నారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు సబబే
సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించే వారికే అక్రిడిటేషన్లు ఇస్తున్నారంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది. తమకు మీడియా అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలని కోరే చట్టబద్ధమైన, రాజ్యాంగ పరమైన హక్కు పిటిషనర్కు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో.. అక్రిడిటేషన్ల జారీలో మరింత పారదర్శకత కోసమే వివిధ ప్రభుత్వాధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వివక్షకు తావు లేకుండా ఈ కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు స్థానం కల్పిస్తే వారి మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకపక్ష చర్యగా చెప్పలేమన్నారు. చట్టాలు చేసే విషయంలో ప్రభుత్వ యోగ్యతను పిటిషనర్ ప్రశ్నించలేరని తీర్పులో పేర్కొన్నారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్ ప్రక్రియను త్వరగా చేపడతామని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అక్రిడేషన్ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్), జాతీయ గుర్తింపు మండలి(ఎన్బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్ చెప్పారు. -
‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -
‘ఫేక్ న్యూస్’ ప్రకంపనలు
సాక్షి, బెంగళూరు: దేశంలో నకిలీ వార్తలు ప్రకంపనలు సష్టిస్తున్న నేపథ్యంలో వీటిని అరికట్టడం కోసం బాధ్యులైన జర్నలిస్టుల గుర్తింపు కార్డులు అంటే ఢిల్లీలోని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ జారీ చేసిన ‘అక్రిడిటేషన్ కార్డులు’ను రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ సర్కులర్ తీసుకొచ్చి, ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యంతో ఆ సర్కులర్ను చెత్తబుట్టలో పడేశారు. అసలు ఇంతకు ఎవరు నకిలీ న్యూస్ను సష్టిస్తున్నారు? ఎవరు వాటికి ప్రచారం కల్పిస్తున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేస్తున్న నకిలీ వార్తలు ఎలాంటివి? ఎవరి లక్ష్యంగా అవి ప్రచారం అవుతున్నాయి ? వారం క్రితమే (గత గురువారం) ‘పోస్ట్కార్డ్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహేశ్ విక్రమ్ హెగ్డేను నకిలీ వార్తల ప్రచురణ, ప్రచారం నేరారోపణల కింద బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ ‘రిలీజ్ మహేశ్ హెగ్డే’ హాష్ ట్యాగ్తో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మొదలుకొని సామాన్య బీజేపీ కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగించారు. మార్చి 18వ తేదీన ఓ జైన సన్యాసిని.. ముస్లిం యువకుడు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడని, సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ పోస్ట్కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. తన ఫేస్బుక్ పేజీలో కూడా పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఎల్లప్పుడు పోస్ట్కార్డ్ న్యూస్ తప్పుడు వార్తలపై ఓ కన్నేసి ఉంచే ఫ్యాక్ట్ ఫైండింగ్ వెబ్సైట్ ‘అల్టర్ న్యూస్’ జర్నలిస్టులు రంగంలోకి దిగి బెంగుళూరు పోలీసుల నుంచి వాస్తవాలను సేకరించారు. సదరు సన్యాసిపై ఎవరూ దాడి చేయలేదని, రోడ్డు దాటుతుండగా చిన్న ప్రమాదమై స్వల్ప గాయమైందని పోలీసులు చెప్పడంతోపాటు ఆ జైన సన్యాసి కూడా ధ్రువీకరించారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారుం చేస్తున్నారన్నది సులభంగానే అర్థం అవుతుంది. పోస్ట్కార్డ్ న్యూస్లో ఒక్కటి కాదు, పదులు కాదు, పాతిక సంఖ్యల్లో నకిలీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకనేమో వీటిని బీజేపీ, ఆరెస్సెస్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తున్నారు. మచ్చుకు పోస్ట్కార్డ్ న్యూస్లో మరికొన్ని నకిలీ వార్తలు 2016, ఆగస్టు నెలలో: సీనియర్ జర్నలిస్ట్ బార్కా దత్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ జకీర్ రషీద్ భట్ అలియాస్ జకీర్ మూసాతోని టూవీలర్పై వెనక తగులుకునేలా కూర్చొని వెళుతున్న దశ్యం అంటూ పోస్ట్కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. ట్విటర్లో పుట్టిన ఈ వార్తను పోస్ట్కార్డ్ ప్రచారం చేయగా, దాన్ని హిందూత్వ శక్తులు వైరల్ చేశాయి. అల్లర్లు కొనసాగుతున్న కశ్మీర్లో తాను న్యూస్ కవరేజ్కి వెళ్లినప్పుడు కారు చెడిపోయిందని, కర్ఫ్యూ కారణంగా తాను కారు మరమ్మతు చేయించుకోలేక ఓ టూ వీలర్ బాటసారిని లిఫ్ట్ అడిగి గమ్యస్థానానికి చేరుకున్నానంటూ బార్కా దత్ వివరణ ఇచ్చారు.టూవీలర్ నడుపుతున్న వ్యక్తికి టెర్రరిస్ట్ కమాండర్కు దగ్గరి పోలికలు ఉన్నాయని పోస్ట్కార్డ్ న్యూస్ వాదించింది. కనిపిస్తే కాల్చిచంపే ఉత్తర్వులు ఉన్నాయని తెలిసి, ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టు కమాండర్ కర్ఫ్యూ సమయంలో, విస్తృతంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్న సమయంలో టూ వీలర్పై ఎలా తిరుగుతాడని ‘అల్టర్ న్యూస్’ నిలదీసింది. 2017, మే నెల: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలోనే మరో పాకిస్తాన్గా మారిపోనుంది. ఆ పుణ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కట్టుకోవచ్చు. ఎందుకంటే, ముస్లింల కోసం ఆమె త్వరలోనే ప్రత్యేక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టబోతున్నారు. ముస్లింలను మంచి చేసుకోవడం కోసం ఆమె రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వార్తలో కూడా నిజం లేదని అల్టర్ న్యూస్ తేల్చింది. 2018, ఫిబ్రవరి 5: తమిళనాడులోని కొన్ని క్రైస్తవ బృందాలు మధురైలోని కలియార్ కోవిల్, శివగామి ఆలయాల్లోకి వెళ్లి ఆ ప్రాపర్టీ తమదని డిమాండ్ చేశాయని, క్రైస్తవ మిషనరీలు ఆ హిందూ దేవాలయాలను చర్చిలుగా మార్చేందుకు కుట్ర పన్నాయని పోస్ట్కార్డ్ న్యూస్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వార్తను ప్రచురించింది. ఇలాంటి నకిలీ వార్తలను పట్టుకునే మరో వెబ్సైట్ ‘బూమ్లివ్’ స్థానిక పోలీసు అధికారులతోని, స్థానిక జర్నలిస్టులతోని మాట్లాడి వాస్తవాలను బయట పెట్టింది. క్రైస్తవ బృందాలు ఆ ఆలయాల సమీపం నుంచి వెళ్లాయని, ఆలయాల లోపలికి ఎవరు వెళ్లలేదని, ప్రతి ఏట సంప్రదాయంగా జరిగే ఊరేగింపు అదని తేలింది. హిందుత్వ శక్తులు, ప్రధాని మోదీకి అనుకూలంగా ట్వీట్లు కూడా పెట్టే మహేశ్ విక్రమ్ హెగ్డే ఎలాంటి జర్నలిస్టో సులభంగానే గ్రహించవచ్చు. నకిలీ వార్తలను అరికట్టాలంటూ స్మృతి ఇరానీ మాట్లాడం అంటే ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉంది. అయితే జర్నలిస్టుల గుర్తింపు కార్డులు రద్దు చేయడం వల్ల నకిలీ వార్తలు ఆగుతాయా? గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారా? ఇంట్లో కూర్చున్న వారు, పోస్ట్కార్డ్ న్యూస్ లాంటి మీడియా ముసుగేసుకున్న వారు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా లాంటి వారే నకిలీ వార్తలను, ఫొటోలను ప్రచారం చేస్తుంటే ఇంకా ఎవరిని అరికడతాం. పశ్చిమ బెంగాల్లో ఏడాది క్రితం మత ఘర్షణలు జరిగినప్పుడు ‘బెంగాల్లో పట్టపగలు ఓ హిందూ మహిళను వివస్త్రను చేస్తున్న ముస్లిం యువకులు’ అన్న కాప్షన్తో మరాఠీ చిత్రంలోని ఓ సన్నివేశం ఫొటోతో సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేశారు. అభాసు పాలవుతామని నరేంద్ర మోదీనే ఇరానీ సర్కులర్ను రద్దు చేశారు. అయితే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే నకిలీ వార్తలు ఎక్కువయ్యాయన్న విషయాన్ని గ్రహించి వాటిని అరికట్టేందుకు సమగ్ర చట్టం తీసుకరావాలి. గతేడాదే జార్ఖండ్లో నకిలీ వార్తల కారణంగా రెండు వేర్వేరు సంఘటల్లో ఏడుగురు అమాయకులు మరణించారు. అపరిచితులు పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ ‘వాట్సాప్’లో తప్పుడు ప్రచారం జరగడంతో అమాయకులను అనుమానించి జనమే కొట్టి చంపారు. -
అక్రెడిటేషన్ రద్దు వద్దు
న్యూఢిల్లీ: నకిలీ వార్త రాస్తే జర్నలిస్టుల గుర్తింపు (అక్రెడిటేషన్) రద్దు చేస్తామన్న ప్రతిపాదన నుంచి కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద మార్గదర్శకాలపై అటు ప్రతిపక్షాలు, ఇటు జర్నలిస్టుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. వాటిని రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అక్రెడిటేషన్ రద్దుపై విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఆ మంత్రిత్వ శాఖకు సూచించింది. ప్రింట్ మీడియాకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), టెలివిజన్ మీడియాకు న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) నియంత్రణా వ్యవస్థలుగా ఉన్నాయని, ఆ సంస్థలే నకిలీ వార్తలా, కాదా అనే నిర్ధారణకు వస్తాయని ప్రధాని పేర్కొన్నట్లు పీఎంవో అధికారి తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదని ప్రధాని అభిప్రాయపడినట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో పీఎంవో సూచన మేరకు ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా తమ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి స్మృతీ ఇరానీ సమర్థిస్తూ ట్వీట్ చేసిన వెనువెంటనే ప్రధాని కార్యాలయం ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకోమని ఆదేశించడం విశేషం. ప్రధాని ఆదేశాల మేరకు... సమాచార ప్రసార శాఖ సోమవారం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. తొలిసారి నకిలీ వార్త రాసిన జర్నలిస్టుకు గుర్తింపును ఆరు నెలలపాటు, రెండో సారి అదే తప్పు చేస్తే సంవత్సరం పాటు, మూడో సారి కూడా తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తారు. అయితే ఈ నిబంధనలను ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మంగళ వారం ఉపసంహరించుకున్నారు. భగ్గుమన్న ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు నకిలీ వార్తలకు సంబంధించి సోమవారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వెలిబు చ్చాయి. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. పత్రికలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి అన్నారు. నకిలీ వార్తలపై ఫిర్యాదులుంటే ప్రెస్ కౌన్సిల్ చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నిరంకుశ ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎడిటర్స్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాంటి ఆదేశాల ద్వారా మీడియాపై పర్యవేక్షణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం తనపై వేసుకోవాలని భావిస్తోందని, ఇలాంటి వాటివల్ల జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడేలా పనికిరాని ఫిర్యాదు చేసేందుకు ద్వారాలు తెరిచినట్లవుతుందని ఎడిటర్స్ గిల్డ్ విమర్శించింది. ఫేక్ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ముప్పుగా పరిణమించిందని, వాటిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అందులో తప్పేమీ లేదని, అయితే స్వతంత్ర రాజ్యాంగ సంస్థ మాత్రమే వాటి ప్రామాణికతను నిర్ధారించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వివేకం కలిగిన ఎవరూ కూడా ఫేస్ న్యూస్ను సమర్ధించరని తెలిపింది. పత్రికా స్వేచ్ఛను హరించే నిర్ణయమిదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదు..
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రయాపడ్డారు. ఎవరైనా నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే అక్రిడేషన్ రద్దు చేస్తామనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తప్పుడు వార్తల విషయంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర సమాచార శాఖను ఆదేశించారు. పూర్తి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్ల కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. -
తప్పుడు వార్త రాస్తే.. గుర్తింపు రద్దు..
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విలేకరుల గుర్తింపునకు సంబంధించిన నియమావళిని సవరరించింది. నిబంధనల ప్రకారం.. నకిలీ వార్తలను ప్రచురించడం, ప్రసారం చేసినట్లు నిర్ధారణ అయితే సదరు జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తారు. తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు, రెండో సారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు, మూడోసారీ తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయనుంది ప్రభుత్వం. ఫేక్ న్యూస్పై వచ్చే ఫిర్యాదులను పీసీఐ, ఎన్బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాయని ప్రభుత్వం వివరించింది. -
ఇకపై జర్నలిస్టులకు ఆన్లైన్లో బస్పాస్లు
సాక్షి, హైదరాబాద్ : అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు టీఎస్ఆర్టీసీ బస్పాస్ల కోసం ఇకనుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని టీఎస్ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు పేర్కొన్నారు. బస్పాస్ల కోసం జర్నలిస్టులు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్ఎం కార్యాలయాలకు వెళ్లకుండా సమీపంలోని బస్పాస్ కౌంటర్ నుంచి పొందేలా వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. ప్రస్తుతం జర్నలిస్టుల బస్పాస్ల గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ఆర్టీసీ అమలు చేయనుంది. ఆన్లైన్లో బస్పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు ఫోన్లో టీఎస్ఆర్టీసీ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత జర్నలిస్టులు తమ సమీపంలోని బస్పాస్ కౌంటర్కు వెళ్లి మెసేజ్ను చూపిస్తే అక్కడ బస్పాస్ జారీ చేస్తారని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఐఐటీలు, ఐఐఎంలకు అక్రిడిటేషన్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, అక్రిడిటేషన్లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను యూజీసీ పర్యవేక్షణలో నడిచే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఒక్కటే చేపడుతున్నది. అయితే ప్రముఖ ప్రయివేట్ సంస్థలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అక్రిడిటేష్న్ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంల పాత్రను పెంచేందుకు త్వరలో ఎనిమిది ఐఐటీలు, ఐఐఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించగా, మరికొన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఫ్యాకల్టీ కొరతను చూపి అదనపు బాధ్యతలపై నిరాసక్తత వ్యక్తం చేశాయి. -
అక్రిడిటేషన్ లేకుండానే హెల్త్ కార్డులు
► విద్యార్హతలు లేకుండా అక్రిడిటేషన్ ► రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ► జోగిపేటలో జిల్లా జర్నలిస్టుల సమావేశం జోగిపేట(అందోలు): త్వరలో రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులు లేని జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. గురువారం జోగిపేటలోని శ్రీరామా ఫంక్షన్ హాలులో జరిగిన జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ గత నెల 22న జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన సీఎం మూడు రోజుల్లో జర్నలిస్టు సంఘాల నాయకులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారన్నారు. అక్రిడిటేషన్ కార్డులు లేకున్నా హెల్త్ కార్డులు, విద్యార్హతతో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసి కమిటీని కూడా వేశారన్నారు. రాష్ట్రంలో 430 మంది వరకు జర్నలిస్టులు చనిపోతే ఇప్పటి వరకు కేవలం 130 మందికి మాత్రమే ఆర్థికంగా సహకారం అందిందన్నారు. జిల్లా అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నాయకుడు కాల్వ మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. జర్నలిస్టుల ర్యాలీ: జోగిపేటలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా మీదుగా శ్రీ రామ ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫైజల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, జిల్లా నాయకులు దుర్గారెడ్డి , రవిచంద్ర, మన్మథరావు, పానుగంటి కృష్ణ, జగన్మోహన్రెడ్డి, సిద్దన్నపాటిల్, హైమద్, శివగౌడ్, మురళి, ఖయ్యూం, ఆరీఫ్, అందోలు తాలుకా ప్రెస్క్లబ్ అధ్యక్షుడు భూమయ్య, నాయకులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వండి
నవీన్ మిట్టల్కు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎలాంటి నిబంధనలు, అడ్డంకులు సృష్టించకుండా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. అక్రెడిటేషన్ల జారీకి డిగ్రీ సర్టిఫికెట్లతో ముడిపెట్టడం, చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ల జారీపై ఆంక్షలు విధించడం, అక్రెడిటేషన్లతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు జారీ కాకపోవడం పట్ల బుధవారం పలు జర్నలిస్టు యూనియన్లు సచివాలయంలో మంత్రిని కలసి ఫిర్యాదు చేశాయి. దీనికి స్పందించిన కేటీఆర్.. నవీన్ మిట్టల్తో మాట్లాడారు. డిగ్రీ విద్యార్హతతో సంబంధం లేకుండా జిల్లాల్లో చిన్న పత్రికలకు వెంటనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత జిల్లాల ప్రకారమే జర్నలిస్టులకు బస్పాస్లు జారీ చేయాలని మంత్రి మహేందర్రెడ్డిని కోరారు. కేటీఆర్ను కలసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పలు యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
'కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అక్రెడిటేషన్, హెల్త్కార్డులు ఇస్తారని అనుకున్న జర్నలిస్టులకు... అధికారుల తాత్సారం అయోమయాన్ని స్పష్టించిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూ జే) మండిపడింది. అక్రిడిటేషన్ కమిటీలో ఉత్సవ విగ్రహాలుగా ఉండలేమని కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. ఇకపై జరిగే సమావేశాలకు కూడా తమ యూనియన్ ప్రతినిధులు హాజరుకారని ప్రధాన కార్య దర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట కవిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. డిగ్రీ ఉంటేనే అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామనడం మంచి దికాదన్నారు. అదేవిధంగా ఉమ్మ డి రాష్ట్రంలో ఏసీ బస్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది కూడా ఇవ్వని పరిస్థితి ఏర్ప డిందన్నారు. తెలం గాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల అధికారుల వివక్ష కొనసాగుతున్నట్లు కనిపిస్తోందన్నా రు. అక్రెడిటేషన్తో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని జీవోలో ఉన్నా.... అది వారికి టిష్యూ పేపర్లా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి
- జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి - టీయూడబ్ల్యూజే, ఐజేయూ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నూతన జీవో 239ను తక్షణమే సవరించి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని టీయూ డబ్ల్యూజే, ఐజేయూ డిమాండ్ చేసింది. సోమవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవనంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు కె. శ్రీనివాస్రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరహత్ అలీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామచంద్ర మూర్తి కమిటీ సూచనలను, సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని కోరారు. చిన్న, మధ్యతరగతి పత్రికలకు తాము వ్యతిరేకం కాదని, పనిచేసే ప్రతి జర్నలిస్టు తరఫున తాము పోరాడతామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి జర్నలిస్టులందరికీ జిల్లా స్థాయి అక్రెడిటేషన్లు అందివ్వడం ద్వారా రైల్ పాసుల అంశంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. అక్రెడిటేషన్ల జారీకి విద్యార్హతలెందుకు? జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేసేందుకు విద్యార్హతలను పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తమ జేబులోనే ఉందని.. తాము చెప్పినట్లుగానే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటున్న కొన్ని వర్గాల నాయకులు జీవో 239 ద్వారా తలెత్తిన సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హెల్త్కార్డులను అక్రెడిటేషన్తో సంబంధం లేకుండానే జారీ చేసి, ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలన్నారు. రెండున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తుందని వాపోయారు. ఇకనైనా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే శీతాకాల సమావేశాల్లో జర్నలిస్టులమంతా కలసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. -
జర్నలిస్ట్లందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి
తెలంగాణ జేఏసీ సాక్షి, హైదరాబాద్: జీవో నంబర్ 239ను రద్దుచేసి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ప్రదీప్ చంద్రను కలసి వినతి సమర్పించారు. 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా నిలిచి ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితంలో మార్పు వస్తుందని ఆశపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస గుర్తింపు లేకుండా చూస్తుందని విమర్శించారు. జీవో నంబర్ 239ను రద్దుచేసి వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్తో ఈనెల 5న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘అక్రిడిటేషన్’కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు సమర్పించాలని వార్తా పత్రికల సంపాదకులు, న్యూస్ చానెళ్ల సీఈవో/మేనేజింగ్ డైరెక్టర్లకు తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. విలేకరులు, ఫొటోగ్రాఫర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 15న ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2016’ పేరుతో జీవో 239 జారీ చేసిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం అర్హులైన డెస్క్ జర్నలిస్టుల జాబితాను పంపించాలని ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా సంస్థలకు ఆయన లేఖ రాశారు. -
వరంగల్ లో జర్నలిస్టుల ధర్నా
జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే(ఐజేయు) ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి జర్నలిస్టుల ధర్నా లో పాల్గొన్నరు ఈ కార్యక్రమనికి టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా జాతీయ ,రాష్ట్ర నాయకులూ దాసరి కృష్ణారెడ్డి వెంకటరమణ కుమారస్వామీ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విలేఖరులు హాజరయ్యారు. జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ ,కట్ల శ్రీను బిజేపి జిల్లా అద్యక్షులు అశోక్ రెడ్డి టీడీపీ నాయకురాలు సీతక్క సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు శ్రీనివాసరావు వాసుదేవరెడ్డిలు సంఘీభావం తెలిపారు. జీవో 239 ను సవరించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
ఆందోళన వద్దు.. అందరికీ అక్రిడిటేషన్లు
ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ న్యూశాయంపేట : ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని, త్వరలో అందరికీ అందుతాయని రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమి చైర్మెన్గా రెండోసారి నియమితులైన సందర్భంగా ఆదివారం హన్మకొండ ప్రెసక్లబ్లో టీయూడబ్ల్యూజే(హెచ్–143) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పోరాటాల ఫలితంగానే అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇచ్చేలా జీవో జారీ అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది తమ సంఘ పోరాట ఫలితమేనని చెప్పారు. రూ.100 కోట్ల నిధిని సాధించి, ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల పెన్షన్ వచ్చేలా పోరాడుతానని అన్నారు. తన హయాంలో ప్రతిక్షణం జర్నలిస్టుల సంక్షేమానికే వెచ్చిస్తానన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. తెలంగాణ సిలబస్ ప్రవేశపెట్టి అకాడమి ద్వారా జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు ప్రెస్క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు క్రాంతి, పి.రవి, లెనిన్, కొండల్రావు, పి.శివకుమార్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా అద్యక్షుడు జి.వెంకట్ పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్తో టీయూడబ్ల్యూజే నేతల భేటీ
హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ సమాచారశాఖ కమిషనర్ను ఆదేశించారు. టీయూడబ్ల్యూజే నేతలు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ను కలిశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డుల జారీ, ఫ్లాట్ల కేటాయింపుపై నేతలు ప్రధానంగా చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. -
మీడియా సంస్థ ఐడీకార్డుతోనైనా సచివాలయంలోకి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : అక్రెడిటేషన్ కార్డు లేకపోయినా మీడియా సంస్థ గుర్తింపు కార్డు తో సెక్రటేరియట్లో ప్రవేశానికి అనుమతిస్తామని తెలంగాణ సచివాలయం భద్రతా విభాగం స్పష్టంచేసింది. అక్రెడిటేషన్ కార్డు లేదన్న కారణంతో సోమవారం సాక్షి జర్నలిస్టు భువనేశ్వరి సహా అనేక మంది పాత్రికేయులకు అనుమతి నిరాకరించింది. మంగళవారం సచివాలయంలో పాత్రికేయులు నిరసనకు దిగి భద్రతాసిబ్బంది వైఖరిని ఖండించారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్య భద్రతాధికారి జర్నలిస్టులు పనిచేసే సంస్థ గుర్తింపు కార్డు ఉన్నా లోపలికి అనుమతిస్తామని ప్రకటించారు. దీంతో జర్నలిస్టులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు. పాత నిబంధనలను పాటించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇకపై ఇలా జరగకుండా చూస్తామని ముఖ్య భద్రతాధికారి హామీ ఇచ్చారు. సంస్థ గుర్తింపు కార్డు చూపించినా సెక్రటేరియట్లోకి అనుమతించని సాక్షి జర్నలిస్టుకుక్షమాపణలు చెప్పారు. -
కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు తక్షణమే అందించాలని కోరుతూ.. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కరుణాకర్, శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీ చేపడుతామని హెచ్చరించారు. జర్నలిస్టుల ధర్నాకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించి ధర్నాలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
అక్రెడిటేషన్ల కమిటీని రద్దు చేయాలి
హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాత్రికేయులకు అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, కార్డుల జారీకి నేరుగా రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ల కమిటీ (ఎస్ఎల్ఏసీ)ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను, మార్గదర్శకాలను రూపొందించకుండానే అక్రెడిటేషన్ల జారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 197 జారీ చేసింది. ఈ కమిటీ ఇష్టానుసారం అక్రెడిటేషన్లను జారీ చేస్తోంది. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని పిటిషనర్ షేక్ ఖాసీం కోరారు. -
అక్రెడిటేషన్ల జారీలో జర్నలిస్టులకు అన్యాయం
ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతల ఆరోపణ * అక్రెడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీలో రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి కమిటీ రూపొందించిన అసలు నివేదికలోని కీలకాంశాలను మార్చేసి సీఎం కేసీఆర్కు తప్పుడు నివేదిక సమర్పించిందని ఆరోపించాయి. నివేదికను టైపింగ్ చేసే సమయంలో పలు అంశాలను తారుమారు చేశారని, అసలు నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్కార్డుల జారీ అంశంపై ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.విరాహత్ అలీ, హెచ్జేయూ అధ్యక్షుడు కె.కోటిరెడ్డి గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో అక్రెడిటేషన్ కమిటీ తీరును దుయ్యబట్టారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు, పాత జీవోలను కాదని అక్రెడిటేషన్ల కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు జారీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నా, అక్రెడిటేషన్ కమిటీ తీరుతో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ప్రకారం ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులతోపాటు ఆర్టిస్టులూ జర్నలిస్టులేనని, అందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేయాల్సి ఉండగా.. అక్రెడిటేషన్ కమిటీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. కమిటీ సిఫారసుల మేరకే అక్రెడిటేషన్లు: అల్లం రామచంద్రమూర్తి కమిటీ నివేదికను తూచ తప్పకుండా అనుసరిస్తూ అక్రెడిటేషన్ దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. డెస్క్, ఆర్టిస్టు, స్కానర్స్ లాంటి వారికి అక్రెడిటేషన్లు ఇవ్వడానికి కూడా కమిటీకి అభ్యంతరం లేదన్నారు. అక్రెడిటేషన్ల కమిటీపై టీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతల ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. పద్ధతి ప్రకారమే అక్రెడిటేషన్లు: క్రాంతి, పల్లె రవి జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేసే అక్రిడిటేషన్ల ప్రక్రియ నిబంధనల మేరకే జరుగుతున్నా... ఒక జర్నలిస్టు యూనియన్ తప్పుడు ప్రచారం చేస్తోందని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కమిటీపై అపోహలు సృష్టించి, బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లయితే.. ఆ ఆరోపణలు చేస్తున్న యూనియన్కు చెందిన ఇద్దరు సభ్యులు కూడా కమిటీలో ఉన్నారని, వారెందుకు అడ్డగించలేదని ప్రశ్నించారు. రామచంద్రమూర్తి కమిటీ సిఫారసుల మేరకే కార్డుల జారీ జరుగుతుందన్నారు. -
మూడు విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ 3 విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మ న్, రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మొద టి విడతలో ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు ఈ నెలాఖరులోగా అందిస్తామ న్నారు. రెండు, మూడో విడత కార్డులను త్వర లో ఇస్తామన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు అనుగుణంగా మూడో విడతలో డెస్క్ జర్నలిస్టులకు కార్డులు ఇస్తా మన్నారు. బుధవారం సమాచార, పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. -
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారికి వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యబీమా వర్తింపచేయాలని, జస్టిస్ గురుభక్ష్ నివేదిక ప్రకారం వేతన సవరణ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనే డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ అధికారులతో తన ఛాంబర్లో సమావేశమై జర్నలిస్టుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అక్రెడిటేషన్లకు సంబంధించి ఈ నెల 24న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన కమిటీ సమావేశమవుతుందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ల కమిటీలు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యబీమా కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కెవీ రమాణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌరసంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్చంద, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్మిశ్రా, రాష్ట్ర సమాచారశాఖ డెరైక్టర్ వి.సుభాష్ లతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
⇒ రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా.. అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ⇒ పాత్రికేయ వృత్తి శిక్షణ కోసం యూనివర్శిటీ ఏర్పాటు ⇒ టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో మహమూద్ అలీ, హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకప్రాత పోషించిన జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హెల్త్కార్డులు, కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాలను జర్నలిస్టు కుటుంబాలకు సైతం వర్తింపజేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు జర్నలిస్టులు ముఖ్యపాత్ర పోషిం చారని నీటిపారుదల మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. జర్నలిస్టులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండటం వల్లే కొంత ఆలస్యమవుతోందని చెప్పారు. ఆదివారం లళిత కళాతోరణంలో జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) ప్రథమ మహాసభలో మంత్రులిద్దరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై పలు హామీలిచ్చారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు రూ. 4 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత గృహాలు, పట్టణాల్లో ఒక అంతస్తు(జీ+1) పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. వృత్తిలో కొనసాగుతూనే నైపుణ్యాల పెంపుదల, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే జర్నలిస్టుల కోసం విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనే ఆలోచన ఉందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, సీపీఐఎల్పీ నేత రవీంద్రకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడమే ఉద్యోగ భద్రతకు అసలు పరిష్కారమని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్కార్డులు తదితర అంశాలపై తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వైద్య సదుపాయాలతో హెల్త్ కార్డులు, రాష్ట్ర, జిల్లా స్థాయి కేటగిరీలుగా అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని సిఫారసు చేశామన్నారు. జర్నలిస్టుల వేజ్ బోర్డు సిఫారసులు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ స భ్యులు అమర్నాథ్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగనూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నల్లి ధర్మారావు, టీఎన్జీవోల అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభకు తెలంగాణ జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వార్తలు రాసి హత్యకు గురైన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ పేరును సభాప్రాంగణానికి పెట్టారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, జర్నలిస్టుల సాక్షిగా ఈ సభలో టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు సంకెళ్లు వేస్తోందని, తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులు తమ హక్కుల కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచి అడుక్కోవాల్సి రావడం బాధాకరమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఆరోపించారు. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ చెర్మైన్ సోలిపేట రామలింగారెడ్డితో పాటు తెలంగాణ రచయితల ఫోరం అధ్యక్షులు నందిని సిధారెడ్డి తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. -
పోటీ చేయని రాజకీయ పార్టీలపై వేటు!
కోల్కతా: గత 5-10 ఏళ్లలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయని రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తెలిపారు. దేశంలో 1,600పైగా రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయని, వాటిలో 200 కన్నా తక్కువే ఎన్నికల్లో పాల్గొంటున్నాయన్నారు. శనివారం నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో ఎప్పుడూ పోటీ చేయని పార్టీల గుర్తింపును రద్దు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నా, అమలు చేయలేకపోయామని, ప్రజాప్రతినిధులపై ప్రజలు ఒత్తిడి చేస్తే అది సాధ్యపడుతుందన్నారు. బోగస్ పార్టీలు పార్టీలు ప్రభుత్వం నుంచి ఆదాయపు పన్ను మినహాయింపుతోపాటు పలు ఇతర రాయితీలు పొందుతున్నాయని తెలిపారు. భారత్ నంబర్ వన్: ఆధార్ నంబర్ను ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయడంద్వారా ప్రపంచంలో మొట్టమొదటి బయోమెట్రిక్ డాటాతో కూడిన ఓటరు జాబితా గల దేశంగా భారత్ రికార్డు సృష్టించనుందని బ్రహ్మ తెలిపారు. ప్రస్తుతం ఆధార్తో అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇది ఈ ఏడాదిలో పూర్తవుతుందని తెలిపారు. ఇది పూర్తయితే ఒక ఓటరు పేరు ఒక నియోజకవర్గంలో మాత్రమే ఉంటుందన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ పేర్లు సరిచేసుకోవాలని, ఒకటికంటే ఎక్కువ నియోజకర్గాల్లో ఓటరుగా పేరుంటే అది నేరమవుతుందని చెప్పారు. -
నకిలీ విలేకరుల అరెస్టు
ఖమ్మం రూరల్: టీవీ చానల్స్ విలేకరులమని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం డీఎస్పీ దక్షిణా మూర్తి విలేకరులతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. ఖమ్మంలోని సారథి నగర్ జూబ్లిపురాకు చెందిన బట్టా నాగరాజు, బుర్హన్పురానికి చెందిన సంతులూరి వంశీ కలిసి బుధవారం ఉదయం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద లారీలను ఆపుతూ డ్రైవర్ల వద్ద నుంచి డబ్బులను వసూలు చేశారు. మేం విలేకరులం.. మీ లారీల్లో దొంగ సరుకు వెళ్తోంది. ఆర్టీఓ కు సమాచారం అందిస్తామని బెదిరిస్తూ పలువురు డ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ వీరితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రూరల్ ఎస్సె లక్షీనారాయణ వీరిని గమనించి ఆరా తీయగా లారీ డ్రైవర్ విషయూన్ని తెలిపాడు. దీంతో వంశీ, నాగరాజులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్టేషన్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో వంశీకి ప్రభుత్వం నుంచి విలేకరులకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు ఉండగా, నాగరాజు ప్రారంభం కానున్న ఓ టీవీ చానల్ పేరిటి స్వయంగా గుర్తింపు కార్డును తయూరు చేసుకున్నాడు. డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ లేదా 100 నంబర్కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. ఎవరైనా విలేకరుల మని, లేదా పోలీసులమని చెప్పి వివరాలు అడిగితే గుర్తింపు కార్డులు చూపించాలని కోరాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో సీఐ ఆంనేయులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు మంచి రోజులు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి సంగారెడ్డి క్రైం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎ.విష్ణువర్దన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమీతో శనివారం జరిపిన సమావేశంలో జర్నలిస్టులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు సీఎం ఆమోదం తెలుపడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతినెల 3వ తేదీ లోగా రూ.5వేల భృతిని అందజేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపడమేనన్నారు. జర్నలిస్టులకు నియోజవకర్గ కేంద్రాల్లో 200 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పిన సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. జర్నలిస్టులందరికీ వారం రోజుల్లోగా హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని సీఎం చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలనుటీయూడబ్ల్యూజే సేకరిస్తుందని విష్ణువర్దన్రెడ్డి తెలిపారు. విధి విధానాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తాము జాబితాను వెంటనే అందజేస్తామన్నారు. కాగాముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జర్నలిస్టులు సంబరాలు జరుపుకోవాలని విష్ణువర్ధన్రెడ్డి కోరారు. -
హెల్త్కార్డులు అక్రిడేటెడ్ జర్నలిస్టులకే..
హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఉద్యోగుల తరహాలోనే నగదు రహిత వైద్యం అందిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయోజనాలను కేవలం అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకే పరిమితం చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మార్గదర్శకాలు జారీచేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ జారీచేసిన అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే అందించాలని నిర్ణయించింది. అక్రిడిటేషన్ గుర్తింపు కార్డులు ఉన్న ఎలక్ట్రానిక్, ప్రింట్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుర్తించిన జర్నలిస్టుల వివరాలు త్వరలోనే సమాచార పౌరసంబంధాల శాఖ జారీచేయడంతో పాటు పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా కూడా వ్యవహరిస్తుంది. హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని, అలాంటి వివరాలు సమాచార పౌరసంబంధాల శాఖలో ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జర్నలిస్టుకు ఒక్కసారి వైద్యానికి రూ.2 లక్షలు నిర్ణయించారు. జర్నలిస్టులతో పాటు భార్య, పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. జర్నలిస్టుకు ప్రీమియం రూ.2500 నిర్ణయించారు. అంతే ప్రీమియాన్ని ప్రభుత్వమూ చెల్లిస్తుందని పేర్కొన్నారు. -
డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
నల్లగొండ టుటౌన్: డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరుతూ అఖిలపక్ష జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో వివిధ పత్రికల సబ్ ఎడిటర్లు శుక్రవారం కలెక్టర్ టి.చిరంజీవులుకు వినతిపత్రం అందజేశారు. డెస్క్ లో పని చేసే జర్నలిస్టులందరినీ వర్కింగ్ జర్నలిస్టులుగా పరిగణించి అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా అక్రిడిటేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టు ప్రతి నిధికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు దూసరి కిరణ్గౌడ్, టీయూడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకల కృష్ణయ్య, వివిధ పత్రికల బ్యూరో ఇన్చార్జ్లు మారబోయిన మధుసూదన్, మేకల కళ్యాణ్ చక్రవర్తి, జూలకంటి రాజేందర్రెడ్డి, ఎడిషన్ ఇన్చార్జ్లు టి.జాన్రెడ్డి, నాగేశ్వర్రావు, నరేం దర్, శ్రీనివాస్రెడ్డి, నల్లగొండ ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్రెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, సబ్ ఎడిటర్లు పాల్గొన్నారు. -
‘ఆశ’...నిరాశ
నవాబుపేట: పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, అధికారులకు చేరవేసే ఆశ (అక్రెడిడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్) కార్యకర్తల వెతలు అన్నీఇన్నీ కావు. 2005లో స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త పేరుతో ప్రారంభమై 2007 నుంచి ఆశాలుగా మారారు. జాతీయ ఆరోగ్య గ్రామీణ పథకం ఫేజ్ 2 నిధులతో 2005లో వారు నియమితులయ్యారు. వికారాబాద్ డివిజన్లో ప్రస్తుతం 126 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పదో తరగతి వరకు చదివి ఆరోగ్యంపై అవగాహన కలిగిన మహిళలు ఆశ కార్యకర్తలుగా పని చేయవచ్చు. వీరు సబ్సెంటర్లు, పీఎచ్సీల పరిధిలోని ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటారు. విధులివీ.... గర్భం దాల్చిన నాటి నుంచి పురుడు పోసుకునేంత వరకు మహిళలకు వైద్య పరంగా సేవలందించేది ఆశాలే. గర్భిణుల పేర ్లనమోదు, పురిటి బిడ్డలకు పది నెలల వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, పిల్లల సంరక్షణ, మాతా శిశు మరణాలను నమోదు చేయడం, కాన్పులు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించడం వీరి ప్రధాన విధులు. అలాగే ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్లపై మహిళలకు, పురుషులకు అవగాహన కల్పించడం, జాతీయ పల్స్పోలియో వంటి కార్యక్రమాల నిర్వహణ, వైద్యశాలలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం వంటివి వీరు చేయాల్సి ఉంటుంది. ఆశాలకు వారి పరిధిలోని గ్రామాల్లో అందించే సేవల ఆధారంగా పారితోషికం ఉంటుంది.గర్భిణుల సంఖ్య నమోదుకు, మొదటి రెండు, మూడు తనిఖీలకు రూ. 60 చొప్పున.., తక్కువ బరువు ఉన్న పిల్లల గురించి తెలియజేసినందుకు రూ.75, మాతా శిశు మరణాలను తెలిపినందుకు రూ. 50 చొప్పున...ఇలా ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున ఆశలకు చెల్లించాలి. వీటన్నీంటికి ఎటువంటి టీఏ, డీఏలు ఇవ్వకపోవడం వల్ల వీరికి లభించే పారితోషికంలో మూడొంతులు చార్జీలకు ఖర్చు అవుతున్నాయి. కనీసం కూలీలకు లభించే వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని ఆశాలు ఆవేదన చెందుతున్నారు. నాసిరకం యూనిఫాంలు ఆశా కార్యకర్తలకు ఏడాదిలో రెండు సార్లు జనవరి, జులైలో యూనిఫాంలు పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిలో కూడా అధికారుల చేతివాటం వల్ల నాసిరకం యూనీఫాంలు ఆశాలకు అందుతున్నాయి. ఆరోగ్య కేంద్రంలో సమావేశాలకు హాజరైతే కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు. వేధిస్తున్న అధికారులు ఆశాలు చేసిన పనిని ఏఎన్ఎంలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం వైద్యాధికారి బిల్లును జిల్లా కార్యాలయానికి పంపుతున్నారు. దీంతో అధికారులు తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్నారని , వైద్య అధికారుల సామానులు మోసే సిబ్బందిగా వినియోగించుకుంటున్నారని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా కార్యాలయంలో మూడు నెలలకు అంతకుపైగా అయితేనే పారితోషికాలు విడుదల అవుతున్నాయి. ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ సరిపడా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. -
ఉన్నత విద్యకు ప్రమాణాల భరోసా!
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది.. ఎన్నో ఆలోచనలు, మరెన్నో లక్ష్యాలు వెరసి.. చక్కని భవిష్యత్కు ఆరంభంగా నిలిచే సమయం ముంగిట నిలిచింది.. పలు కోర్సులు.. వివిధ కాలేజీలు.. ఇలా విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు.. ఇటువంటి సందర్భంలో అందరూ దాదాపు కెరీర్ దృష్టికోణంలో ఆలోచిస్తుంటారు.. అయితే వాటన్నిటికంటే ముందు ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లకు సంబంధిత ఏజెన్సీల గుర్తింపు ఉందా? వాటిలో చేరడం ద్వారా చేసిన కోర్సులకు విలువ ఉంటుందా? అనే అంశాలను బేరీజు వేసుకోవాలి.. ఎందుకంటే చిన్నవిగా అనిపించే ఈ అంశాలే భవిష్యత్లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.. కాబట్టి ఈ దిశగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై విశ్లేషణ.. దేశంలో ఎన్నో కాలేజీలు, మరెన్నో కోర్సులు. వీటిని నిరంతరం పర్యవేక్షించడం, సంబంధిత ప్రమాణాలు పాటించేలా తనిఖీలు నిర్వహించడం వంటి వ్యవహారాల కోసం కొన్ని సంస్థలు పని చేస్తుంటాయి. ఇవి ఆయా కాలేజీలు, అవి ఆఫర్ చేసే కోర్సుల స్థితిగతులను వెల్లడించడానికి రికగ్నిషన్, అఫిలియేషన్, అక్రెడిటేషన్ వంటి పేర్లతో గుర్తింపునిస్తుంటాయి. తద్వారా వాటి స్థాయి ఏమిటో తెలుసుకోవచ్చు. దాంతో కోర్సు లేదా కాలేజీ ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయానికి రావచ్చు. అంతేకాకుండా ఉద్యోగం/ఉన్నత విద్య వంటి అంశాల్లో నిశ్చింతగా ముందుకు వెళ్లొచ్చు. లక్ష్యం ఒక్కటే: రికగ్నిషన్, అఫిలియేషన్, అక్రెడిటేషన్..పేర్లు వేర్వేరుగా ఉన్నా.. వాటి అంతిమ లక్ష్యం విద్యా ప్రమాణాలను పెంపొందించడమే. కనీస అర్హతలు కలిగిన విద్యా సంస్థలకు ఇచ్చే గుర్తింపుని ‘రికగ్నిషన్’ అంటారు. కళాశాల స్థాయి విద్యా సంస్థలు సాధారణంగా యూనివర్శిటీలకు అనుబంధంగా ఉంటాయి. దానినే ‘అఫిలియేషన్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కాలేజీలు. ఒక ఇన్స్టిట్యూట్ అందిస్తున్న విద్య నాణ్యతను అంచనావేయడానికి సంబంధిత ఏజెన్సీలు నిర్వహించే ప్రక్రియనే ‘అక్రెడిటేషన్’ అంటారు. కీలక అంశం: కాలేజీ ఎంపికలో అన్నింటికంటే ప్రధానమైన అంశం అక్రెడిటేషన్. విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన చదువును అందేలా చూడటమే అక్రెడిటేషన్ ప్రధాన ఉద్దేశం. అక్రెడిటేషన్ ఏజెన్సీలు నిర్దేశించిన ప్రమాణాల మేరకు సౌకర్యాలు ఉంటే సదరు కాలేజీకి అక్రెడిటేషన్ హోదాను ఇస్తాయి. ఇందుకోసం మౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ఉత్తీర్ణత శాతం, ప్లేస్మెంట్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. కాలేజీకి ఇచ్చే అక్రెడిటేషన్ను బట్టి ఆ ఇన్స్టిట్యూషన్ స్థాయిని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆ ఇన్స్టిట్యూట్లలోని సౌకర్యాలను తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలోని అక్రెడిటేషన్ ఏజెన్సీల వివరాలు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ): దేశంలో ఏ యూనివర్సిటీకైనా యూజీసీ గుర్తింపు తప్పనిసరి. యూనివర్సిటీ ఎడ్యుకేషన్కు సంబంధించి పర్యవేక్షణ, సమన్వయం, నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా చూసే ఉద్దేశంతో యూజీసీని స్థాపించారు. దేశంలో ఉన్నత విద్యలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యనందిస్తున్న అన్ని విద్యా సంస్థలు యూజీసీ పరిధిలోకే వస్తాయి. ఈ సంస్థలన్నీ టీచర్ల నియామకం, వారి విద్యార్హతలు, మౌలిక వసతులు, ప్రవేశ ప్రక్రియ.. ఇలా అన్ని విషయాలలో యూజీసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తదనుగుణంగా యూజీసీ విద్యా సంస్థలకు గుర్తింపునిస్తుంది. అంతేకాకుండా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడం, సమన్వయపరచడం, యూనివర్సిటీలలో బోధన, పరీక్షలు, పరిశోధనలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను నిర్ణయించడం, కాలేజ్, యూనివర్సిటీలకు నిధులను విడుదల చేయడం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కు సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి యూజీసీ ఇతర విధులు. గతంలో దూరవిద్యా విధానంలో కోర్సులను నిర్వహించే విద్యా సంస్థలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం తదితర అంశాలను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డెక్) పర్యవేక్షించేది. కానీ మారిన విధానం మేరకు డెక్ అధికారాలన్నీ యూజీసీకి సంక్రమించాయి. దీంతో దూర విద్యకు సంబంధించి విధివిధానాలను యూజీసీకి చెందిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డీఈబీ) పర్యవేక్షిస్తుంది. వివరాలకు: www.ugc.ac.in నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్): దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల పనితీరును మూల్యాంకనం చేసే ఉద్దేశంతో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్)ను యూజీసీ ఏర్పాటు చేసింది. అసెస్మెంట్, అక్రెడిటేషన్, రేటింగ్స్ మూడు రకాల వ్యవహారాలను నాక్ చేపడుతుంది. స్వీయ అధ్యయనం లేదా నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఒక ఇన్స్టిట్యూట్ పనితీరును అంచనా వేయడమే అసెస్మెంట్. ఒక ఇన్స్టిట్యూట్కు నాక్ ఇచ్చే సర్టిఫికేషన్నే అక్రెడిటేషన్గా చెప్పొచ్చు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ పద్ధతి (సీజీపీఏ) ఆధారంగా నాక్ విద్యా సంస్థలకు నాలుగు రకాల గ్రేడులను మంజూరు చేస్తుంది. గతంలో అసెస్మెంట్, అక్రెడిటేషన్ ప్రక్రియలు ఆయా ఇన్స్టిట్యూట్లు స్వచ్ఛందంగా నిర్వహించుకునేవి. కానీ ప్రస్తుతం కాలేజీలు, యూనివర్సిటీలు యూజీసీ నిధులకు అర్హత కావాలంటే అక్రెడిటేషన్ స్టేటస్ పొందడం తప్పనిసరిగా మారింది. వివరాలకు: ఠీఠీఠీ.్చ్చఛి.జౌఠి.జీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ): నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ)ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఏర్పాటు చేసింది. దేశంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, టౌన్ ప్లానింగ్, మేనేజ్మెంట్కు సంబంధించి డిప్లొమా నుంచి పీజీ స్థాయి వరకు ఇన్స్టిట్యూట్ల గుణాత్మక పోటీతత్వాన్ని మదింపు చేయడానికి ఎన్బీఏను స్థాపించారు. ఇన్స్టిట్యూట్కు సంబంధించిన మౌలిక వసతులు, భౌతిక వనరులు, మానవ వనరులు, లైబ్రరీ రీసోర్సెస్, కంప్యూటేషనల్ రీసోర్సెస్, స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వంటి అంశాలను ఎన్బీఏ మదింపు చేస్తుంది. ఎన్బీఏ కాలేజీ మొత్తానికి అక్రెడిటేషన్ ఇవ్వదు. ప్రోగ్రామ్ స్థాయిలోనే అక్రెడిటేషన్ ఇస్తుంది. ఎన్బీఏ అక్రెడిటేషన్ ప్రక్రియ నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఉంటుంది. ఎన్బీఏ 1000 పాయింట్ల స్కేల్ విధానం ఆధారంగా అక్రెడిటేషన్ ఇస్తుంది. దేశంలో టెక్నికల్ కోర్సులను నిర్వహిస్తున్న ప్రతి విద్యా సంస్థ ఆరేళ్లకోసారి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కనీసం రెండు బ్యాచ్ల పాసవుట్ తర్వాత ఎన్బీఏ అక్రె డిటేషన్ను తప్పనిసరిగా పొందాలి. వివరాలకు: ఠీఠీఠీ.ఛ్చజీఛీ.ౌటజ ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ): దేశంలో సాంకేతిక విద్య అభివృద్ధి ప్రణాళిక, ప్రమాణాలు, నిర్వహణ, పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఉన్నత సలహా సంస్థ ఏఐసీటీఈ. దేశంలో సాంకేతిక విద్యాసంస్థలలో డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్గ్రాడ్యుయేషన్/ పోస్ట్ డిప్లొమా/ పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లామా కోర్సులను నిర్వహించాలంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. ఈ క్రమంలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఎంసీఏ, ఆర్కిటెక్చర్, పాలిటెక్నిక్ తదితర ఇన్స్టిట్యూట్లకు గుర్తింపునిస్తుంది. సంబంధిత ఇన్స్టిట్యూట్లలో అదనపు కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా ఈ సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోర్సులు, కరిక్యులం, మౌలిక వసతులు, ఫ్యాకల్టీలు- అర్హతలు, నాణ్యత ప్రమాణాలు, అసెస్మెంట్, ఎగ్జామినేషన్ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలను రూపొందించడం, కొత్తగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటుకు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వడం, ఇన్స్టిట్యూట్షన్స్ను నిరంతరం పర్యవేక్షించడం తదితర వ్యవహారాలను ఏఐసీటీఈ నిర్వర్తిస్తుంది. జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని రకాల మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న ఫార్మసీ ఇన్స్టిట్యూట్లలో పీజీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)ను కూడా నిర్వహిస్తుంది. వివరాలకు: www.aicteindia.org నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ): దేశంలో ఉపాధ్యాయ విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్సీటీఈ సలహాలు, సూచనలను అందజేస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఉపాధ్యాయ విద్య కోర్సులను ఆఫర్ చేస్తున్న కాలేజీలకు గుర్తింపును కూడా ఇస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ): దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడడం, సంబంధిత ఇన్స్టిట్యూట్షన్స్కు, అర్హతలకు గుర్తింపు ఇవ్వడం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రధాన బాధ్యత. ప్రజలకు సురక్షితమైన ఆరోగ్య సేవలు అందేలా చూడడం, ప్రాక్టీస్లో నిర్ణీత ప్రమాణాలు ఉండే విధానంలో భాగంగా డాక్టర్లు అందరూ ఎంసీఐ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా అండర్గ్రాడ్యుయేట్, పీజీ స్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్లో ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు ఉండేలా పర్యవేక్షించడం మెడికల్ ఇన్స్టిట్యూట్షన్స్కు సంబంధించిన మెడికల్ క్వాలిఫికేషన్ గుర్తింపు-రద్దు అంశంలో తగిన సూచనలు ఇవ్వడం, నిర్దేశిత అర్హత ఉన్న డాక్టర్లకు శాశ్వత/తాత్కాలిక ప్రతిపాదిక రిజిస్ట్రేషన్ వంటివి దీని ప్రధాన విధులు. వివరాలకు: www.mciindia.org ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ): దేశంలో ఫార్మసీ ఎడ్యుకేషన్, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి ఫార్మసీ యాక్ట్ ప్రకారం విధి విధానాలను పీసీఐ పర్యవేక్షిస్తుంది. ప్రొఫెషనల్గా ఫార్మసీ ప్రాక్టీస్కు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తుంది. దేశ వ్యాప్తంగా ఫార్మసీ ఎడ్యుకేషన్లో ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు ఉండేలా పర్యవేక్షించడం, ఫార్మసీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లకు గుర్తింపు ఇవ్వడం, పీసీఐ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇన్స్టిట్యూట్ల గుర్తింపును వెనక్కి తీసుకోవడం, విదేశీ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వడం, ఫార్మాసిస్ట్కు సంబంధించి సెంట్రల్ రిజిస్టర్ను నిర్వహించడం వంటివి పీసీఐ ప్రధాన విధులు. వివరాలకు: www.pci.nic.in డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ): దేశంలో డెంటల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషన్ పరంగా ప్రమాణాలను డీసీఐ నిర్దేశిస్తుంది. దేశ వ్యాప్తంగా డెంటల్ ఎడ్యుకేషన్లో ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూడడంతోపాటు, వివిధ యూనివర్సిటీలు అందించే డిగ్రీలకు గుర్తింపునివ్వడం వంటి బాధ్యతలను డీసీఐ నిర్వహిస్తుంది. సంబంధిత ఇన్స్టిట్యూట్లలో సిలబస్, ఎగ్జామినేషన్, స్టాఫ్, మౌలిక వసతులను కూడా పర్యవేక్షిస్తుంది. వివరాలకు: www.dciindia.org సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం): ఆయుర్వేద, సిద్ధ, యునానీ, వంటి భారతీయ వైద్య విధానాల్లో పాటించాల్సిన ప్రమాణాలను సీసీఐఎం సూచిస్తుంది. భారతీయ వైద్యానికి సంబంధించి కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు/హాస్పిటల్స్ను తనిఖీ చేయడం వాటిలోని సౌకర్యాలను పరిశీలించడం వంటి విధులను నిర్వహించడానికి పర్యవేక్షక కమిటీని నియమిస్తుంది. భారతీయ వైద్యానికి సంబంధించి ఇన్స్టిట్యూట్లు/హాస్పిటల్స్ ఆఫర్ చేస్తున్న కోర్సులు, వాటి కాల వ్యవధి, ప్రాక్ట్టికల్ ట్రైనింగ్, ఎగ్జామినేషన్స్, మెడికల్ క్వాలిఫికేషన్ గుర్తింపు కోసం పాటించాల్సిన ప్రమాణాలు, స్టాఫ్ అర్హతలు, ఎక్విప్మెంట్, ట్రైనింగ్, ఇతర అంశాలను సీసీఐఎం పర్యవేక్షి స్తుంది. వివరాలకు: www.ccimindia.org సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి (సీసీహెచ్): దేశంలో యూనివర్సిటీ/మెడికల్ ఇన్స్టిట్యూట్ హోమియోపతి కోర్సును ఆఫర్ చేయాలంటే సీసీహెచ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ఇన్స్టిట్యూట్లలో కోర్సు, సిలబస్, ఎగ్జామినేషన్, స్టాఫ్, మౌలిక వసతుల విషయంలో పాటించాల్సిన ప్రమాణాలను సూచిస్తుంది. ఇందుకు సంబంధించి తనిఖీ చేసే అధికారాన్ని కూడా సీసీహెచ్ కలిగి ఉంది. వివరాలకు: www.cchindia.com -
అక్రెడిటేషన్ బిల్లులో మార్పులు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థలకు అక్రెడిటేషన్ను తప్పనిసరి చేసే ఉద్దేశంతో రూపొందించిన అక్రెడిటేషన్ బిల్లులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్వల్ప మార్పులు చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి జైలు శిక్ష విధించనున్నట్లు రూపొందించిన నిబంధనను బిల్లు నుంచి తొలగించింది. ‘ఉన్నత విద్యాసంస్థలకు జాతీయ అక్రెడిటేషన్ నియంత్రణ ప్రాధికార సంస్థ బిల్లు-2011’కు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీని ప్రకారం దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ అక్రెడిటేషన్ సంస్థల నుంచి అక్రెడిటేషన్ తప్పనిసరి. తప్పనిసరి అక్రెడిటేషన్ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా లేదా ఏకకాలంలో రెండూ విధించనున్నట్లు బిల్లులోని క్లాజ్-41లో పేర్కొన్నారు. అయితే, వివిధ భాగస్వాములు, పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయాల మేరకు ఈ నిబంధనలో మార్పు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బిల్లు పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం పొందగలదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.