APSP Battalion
-
‘ఏపీఎస్పీ’ అసిస్టెంట్ కమాండెంట్ ఇళ్లపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పంతుల శంకర్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. ఆయన అక్రమాస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదు రావడంతో తూర్పుగోదావరి, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని శంకర్ ఇళ్లు, అతని బంధువుల నివాసాల్లో ఏసీబీకి చెందిన 13 బృందాలు సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. శంకర్ 1989 జనవరి 16న పోలీసు శాఖలో చేరాడు. 2001 జూన్లో ఇన్స్పెక్టర్గా, 2011 జూలైలో డీఎస్పీగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. రూ.88.81 లక్షల విలువైన 3 నివాస గృహసముదాయాలున్నట్లు గుర్తించారు. రూ.32,64,500 విలువైన 9 ఇళ్ల స్థలాలు, రూ.22.51 లక్షల విలువైన 20.98 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.6.57 కోట్ల విలువైన రెండు పౌల్ట్రీ ఫార్మ్లు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. రూ.59,400 నగదు, రూ.27 వేల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.28,99,812 ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.9,71,704 ఎస్బీఐ లైఫ్ ఇన్స్రూ?న్స్, రూ.2.70 లక్షల విలువైన బంగారం, రూ.47,340 విలువైన వెండి వస్తువులున్నట్లు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. మొత్తంగా శంకర్ స్థిర, చర ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.8,43,71,756గా లెక్క తేల్చిన ఏసీబీ.. అందులో రూ.2,46,85,516 అక్రమాస్తులుగా ప్రాథమిక అంచనాకు వచ్చింది. శంకర్ను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ తెలిపింది. -
మహిళలకు భరోసా కల్పించేందుకు 'దిశ'
-
పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేలా చర్యలు
సాక్షి, కాకినాడ : రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసించారు. పోలీసుల పట్ల ప్రజల్లో గౌరవం పెరిగేలా సిఎం జగన్ పలు సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పోలీసు వ్యవస్థకు గౌరవం తీసుకుని వచ్చే విధంగా సిబ్బంది నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అత్యంత కీలకమైన ఏపిఎస్పీ బెటాలియన్ విపత్తు సమయాల్లో అందించిన సేవలు అభినందనీయం అని కొనియాడారు. పోలీసు వ్యవస్థను ఆధునికంగా సాంకేతికపరంగా పటిష్ట పరిచే దిశగా సిఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారని కన్నబాబు వెల్లడించారు. మహిళలకు మేమున్నామని భరోసా కల్పించేందుకు దిశ చట్టాన్ని సిఎం జగన్ తీసుకు వచ్చారని, పోలీసు వ్యవస్థలో వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సేవలందించేందుకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మరిన్ని సంస్కరణల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. (సీఎంగా చంద్రబాబుది అధికార దుర్వినియోగమే) -
‘ఖాకీ’ వసూల్!
సాక్షి, కర్నూలు : జనరల్ డ్యూటీ నుంచి బ్యాండు గ్రూపునకు బదిలీ చేయాలంటే రూ.40వేలు, ఎంటీ సెక్షన్కు బదిలీ చేసి అటాచ్మెంట్ కింద విధులు కేటాయించాలంటే రూ.60వేలు, బయట కంపెనీల నుంచి హెడ్క్వార్టర్కు బదిలీ చేయడానికి రూ.30వేలు..కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఓ అధికారి నిర్ణయించిన ధరల పట్టిక ఇదీ. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగుచూసింది. దీంతో ‘ఆరుగురు’ వసూల్ రాజాలపై వేటు పడింది. ఈ అంశం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ ఎస్ఐ , ఎంటీ సెక్షన్ హెడ్కానిస్టేబుల్తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేస్తూ బెటాలియన్ ఐజీ బి. శ్రీనివాసులు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వసూళ్ల రాజాలను తక్షణమే కేటాయించిన స్థానాలకు వెళ్లిపోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏఆర్ ఎస్ఐను ఐదో బెటాలియన్కు, ఎంటీ సెక్షన్ హెడ్కానిస్టేబుల్ను 16వ బెటాలియన్కు, కానిస్టేబుళ్లను ఒకరిని మూడో బెటాలియన్కు, మరొకరిని 16వ, ఐదో, 9వ బెటాలియన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ అంశం పటాలంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. రూ.10 కోట్లకు పైగా వసూళ్లు ఉద్యోగుల బదిలీల్లో రూ.10 కోట్లకు పైనే వసూలు చేసినట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. జనరల్ డ్యూటీ నుంచి ఆర్మర్ గ్రూపునకు బదిలీ చేయడానికి ఒక్కో కానిస్టేబుల్ నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. అలాగే జనరల్ డ్యూటీ నుంచి బ్యాండు గ్రూపునకు బదిలీ చేయడానికి ఒకొక్కరి నుంచి రూ. 40వేలు చొప్పున నలుగురు నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు సమాచారం. జనరల్ డ్యూటీ నుంచి ఎంటీ గ్రూపునకు బదిలీ చేసి అటాచ్మెంట్కు ఒకొక్కరి నుంచి రూ.60వేలు చొప్పున 20 మంది దగ్గర వసూలు చేసినట్లు సమాచారం. బయట కంపెనీల్లో పనిచేసే వారిని హెడ్క్వార్టర్కు రప్పించడానికి ఒకొక్కరి వద్ద నుంచి రూ.30వేల చొప్పున వంద మంది ఉద్యోగులనుంచి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. అలాగే బెటాలియన్ లూప్లైన్ పోస్టులకు కూడా భారీగా ధరలు నిర్ణయించి వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చిల్డ్రన్స్పార్కు, మ్యాంగోగార్డెన్, లెమన్గార్డెన్, డ్రైనేజీ నిర్వహణ, ప్లంబర్ విధులు వంటి పోస్టుల నియామకానికి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. బయట కంపెనీల నుంచి జనరల్ డ్యూటీలకు బదిలీ చేయడానికి రూ.30వేలు, అక్కడి నుంచి లూప్లైన్లో విధులు నిర్వహించడానికి ఒకొక్కరి నుంచి రూ.25వేల ప్రకారం వసూలు చేసినట్లు సిబ్బంది నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో మూడవ రేంజ్ డీఐజీ వెంకటేష్ వసూళ్ల భాగోతంపై ఇటీవల విచారణ జరిపించి ఆధారాలను సేకరించారు. బదిలీల కోసం ఒక అధికారి డబ్బులు వసూలు చేసినట్లు 14 మంది రాతపూర్వకంగా డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీఎస్పీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం ఏపీఎస్పీ ఐజీ శ్రీనివాసులు దృష్టికి వెళ్లడంతో వసూలు రాజాలపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కర్నూలులో మాజీ డీజీపీ
కర్నూలు : హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్కావరా స్వగ్రామం అనంతపురం జిల్లాకు వెళ్తూ ఆదివారం సాయంత్రం మాజీ డీజీపీ జేవీ రాముడు కర్నూలులో ఆగారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ మూడో రేంజ్ డీఐజీ గోగినేని విజయ్కుమార్, కమాండెంట్ శామ్యుల్జాన్, ఎస్పీ ఆకె రవికృష్ణ తదితరులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్థానిక అతిథిగృహంలో కొద్దిసేపు సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయంటూ ఆరా తీశారు. ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న ఫ్యాక్షన్ హత్యల విషయంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. -
రెండవ పటాలం పేరు నిలబెట్టండి
– తెలంగాణకు రెండవ పటాలం నుంచి కానిస్టేబుళ్లు బదిలీ కర్నూలు: ఎక్కడ పనిచేసినా ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం పేరు నిలబెట్టాలని కమాండెంట్ శామ్యూల్ జాన్ కానిస్టేబుళ్లకు సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఏపీఎస్పీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా మంచిర్యాల, బీచ్పల్లి బెటాలియన్లకు వారు అలాట్ అయ్యారు. బుధవారం సాయంత్రం కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో సహోద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమాండెంట్ శామ్యూల్ జాన్ మాట్లాడుతూ ఎక్కడ విధులు నిర్వహించినా ఎంపికైన బెటాలియన్కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్, డీఎస్పీ ఎన్.వి.ఎస్.మూర్తి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. -
మూడో బెటాలియన్ రేంజ్ డీఐజీగా విజయ్కుమార్
– ముగ్గురు సీఎంల దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహణ – బెటాలియన్స్ ఐజీ నుంచి బాధ్యతలు స్వీకరణ కర్నూలు: ఏపీఎస్పీ మూడో బెటాలియన్ రేంజ్ డీఐజీగా (కర్నూలు, కడప, అనంతపురం) గోగినేని విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో డీఐజీగా ఉన్న ప్రసాదబాబు పదవీవిరమణ పొందారు. ఆ స్థానంలో ఇప్పటి వరకు కర్నూలు రెండో పటాలం కమాండెంట్గా విధులు నిర్వహించిన విజయ్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఈనెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్లో బెటాలియన్స్ ఐజీ ఆర్పీ మీనా నుంచి విజయ్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 2013 అక్టోబరు 29 నుంచి మూడు సంవత్సరాల ఐదు నెలల పాటు ఈయన రెండవ పటాలం కమాండెంట్గా విధులు నిర్వహించారు. గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గూడవల్లికి చెందిన వెంకటసుబ్బయ్య, చిన్నామణి దంపతులకు ఐదుగురు సంతానం కాగా, చిన్న కుమారుడైన విజయ్కుమార్.. బీ.కాం వరకు చదువుకున్నారు. 1982లో ఆర్ఎస్ఐ హోదాలో ఏపీఎస్పీ విభాగంలో విధుల్లో చేరి హైదరాబాద్లో శిక్షణ పొందారు. తర్వాత వరంగల్ 4వ బెటాలియన్లో పని చేశారు. 1985 నుంచి 1998 వరకు సుమారు 13 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, చంద్రబాబు నాయుడు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. 1988లో ఆర్ఐగా పదోన్నతి పొందినప్పటికీ, సీఎం సెక్యూరిటీలోనే విధులు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు నల్గొండ బెటాలియన్లో ఆర్ఐగా విధులు నిర్వహించారు. 2001 నుంచి 2012 వరకు స్పెషల్ ఇంటలిజెన్సీ బ్రాంచి (నక్సల్స్ వింగ్)లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. 2012లో కాకినాడ, సత్తిపల్లి బెటాలియన్స్లో పని చేశారు. 2013 అక్టోబరు 29 నుంచి ఇప్పటి వరకు కర్నూలు రెండో పటాలం కమాండెంట్గా విధులు నిర్వహించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈయన ఇద్దరు కూతుళ్లు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. ఇండియన్ పోలీస్ మెడల్, ఉత్తమ సేవా పతకంతో పాటు సుమారు 50 నగదు రివార్డులను ఈయన విధి నిర్వహణలో అందుకున్నారు. నెల రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన ఈయన శుక్రవారం హైదరాబాద్ చేరుకొని బెటాలియన్స్ ఐజీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండో పటాలంకు చెందిన పలువురు అధికారులు ఈ సందర్బంగా విజయ్కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇద్దరు ఆర్ఐలు తెలంగాణకు బదిలీ
కర్నూలు : ఏపీఎస్పీ రెండవ పటాలంలో పనిచేస్తున్న ఆర్ఐలు ఏడుకొండలు, భిక్షపతి తెలంగాణకు బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజనలో భాగంగా వారిని తెలంగాణకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీపై వెళ్తున్న వీరిని కమాండెంట్ శామ్యూల్ జాన్ మంగళవారం సత్కరించారు. 2012 ఫిబ్రవరి 14నుంచి వారు రెండవ పటాలంలో సేవలందించారు. జనవరి 31వ తేదీన పదవీ విరమణ పొందిన ఆర్ఐ వెంకటరామ్ను కూడా ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ అల్లా బకాష్ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శశికాంత్, ఎస్.ఎం.బాషా, గోపాలకృష్ణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు యుగేంధర్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. -
2వ పటాలం కమాండెంట్గా శామ్యూల్ జాన్
- విజయ్కుమార్కు డీఐజీగా పదోన్నతి కర్నూలు : ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం కమాండెంట్ విజయ్కుమార్ స్థానంలో సీహెచ్ శామ్యూల్జాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గుంటూరుకు చెందిన ఈయన 1982లో ఆర్ఎస్ఐ హోదాలో ఏపీఎస్పీ విభాగంలో చేరారు. వరంగల్, కాకినాడ, మంగళగిరి బెటాలియన్లలో పని చేశారు. 1988లో ఆర్ఐగా, 2004లో అసిస్టెంట్ కమాండెంట్గా, 2011లో అడిషనల్ కమాండెంట్గా పదోన్నతి పొందారు. కర్నూలు రెండవ పటాలంలో విధులు నిర్వహిస్తూ 2013లో పదోన్నతిపై 11వ బెటాలియన్ కడప జిల్లాకు కమాండెంట్గా బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లపాటు విధులు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన కర్నూలు రెండవ పటాలం కమాండెంట్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఐజీగా విజయ్కుమార్ : ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన విజయ్కుమార్కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్స్ మూడవ రేంజ్ (కర్నూలు, కడప, అనంతపురం) డీఐజీగా ఉన్న ప్రసాద్బాబు డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విజయ్కుమార్ నియమితులయ్యారు. 2013 నుంచి ఈయన కర్నూలు ఏపీఎస్పీ రెండవ కమాండెంట్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విజయ్కుమార్ ఈ నెల 18వ తేదీన మూడవ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
బాలిక అదృశ్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన ఎస్.సంధ్యా(13) రోజులుగా కనిపించడం లేదని తల్లిదండ్రులు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాలుగో తేదీ సాయంత్రం 6.15 గంటలకు ఇంటి నుంచి సైకిల్పై వెళ్లిన బాలిక ఆచూకీ ఈ రోజు నుంచి తెలియలేదని, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి దగ్గర విచారించిన సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు నాలుగో పట్టణపోలీసు స్టేషన్ సీఐకి (94406 27736, 08518–259462)కు సమాచారం తెలపాలని సూచించారు. -
యోగాతో ఒత్తిడి దూరం
– ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కర్నూలు: ఒత్తిడి లేని మనస్సు.. రోగంలేని శరీరం యోగాతో సాధ్యమని ఏపీఎస్పీ రెండో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ అన్నారు. బెంగళూరులో ఈనెల 6,7,8 తేదీల్లో జరిగిన యోగా మహోత్సవం పోటీల్లో భాగంగా స్థానిక యోగా గురువైన మహమ్మద్గౌస్ పాల్గొని గోల్డ్మెడల్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ఏపీఎస్పీ క్యాంపులో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా శశికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్గౌస్ యోగా ద్వారా కర్నూలుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని యోగా సాధన చేయాలని సూచించారు. అవార్డు గ్రహీత గౌస్ మాట్లాడుతూ తన జీవితాన్ని యోగాకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. యోగా టీచర్లంతా కలిసి గురువు గౌస్ను సన్మానించారు. -
బెటాలియన్లో వసతుల కల్పనకు కృషి
బెటాలియన్స్ ఐజీ మీనా కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని బెటాలియన్స్ ఐజీ ఆర్కే మీనా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బెటాలియన్ను సందర్శించారు. ముందుగా బెటాలియన్లోని ఎస్పీవీఎన్ ఇంగ్లిషు మీడియం స్కూలును సందర్శించి కొత్తగా నిర్మించిన స్టేజీ, డైనింగ్ షెడ్, ఎల్కేజీ, నర్సరీ విభాగాలను ప్రారంభించి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులను బావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్లు ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన సభకు హాజరై రిటైర్డ్ డీఐజీ జే.ప్రసాద్బాబును సన్మానించారు. కార్యక్రమంలో కామాండెంట్లు విజయకుమార్, కోటేశ్వరరావు, సీహెచ్ విజయరావు, అరుణ్జైట్లీ, ఎల్ఎస్ పాత్రుడు, సీహెచ్ శ్యామూల్జాన్, జగదీశ్కుమార్, సూర్యచంద్, బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎస్కే అల్లాబకాష్ పాల్గొన్నారు. -
ముగిసిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
– 14,576 మంది రాత పరీక్షకు ఎంపిక కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు శనివారం ముగిసాయి. గత నెల 7వ తేదీ నుంచి స్థానిక ఏపీఎస్పీ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో ఆరు జిల్లాల అభ్యర్థులు ఈ స్క్రీన్ టెస్టుకు హాజరయ్యారు. మొత్తం 16,363 మంది హాజరు కాగా, ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. చివరిరోజు శనివారం ఎక్కువమంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా, పురుష అభ్యర్థులు కలిపి 1,025 మంది హాజరు కాగా, అందులో 856 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. నెల రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షల వద్ద సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, లైజనింగ్ ఆఫీసర్ షరీఫ్, పరిపాలన అధికారి అబ్దుల్ సలాం, సీఐ మధుసూదన్రావు, మినిస్టీరియల్ సిబ్బంది, ఈకాప్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
మిషన్ ఎవరెస్ట్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): మిషన్ ఎవరెస్ట్ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందిలో హాజరైన 18 మంది దరఖాస్తుల పరిశీలన చేశారు. అనంతరం 100 మీటర్ల, 2.4కి.మీల పరుగు పందెంను ఏపీఎస్పీ బెటాలియన్ ఆర్ఐ యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యపరీక్షలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు పీఎస్ ఉషారాణి బృందం జరిపింది. ఈ సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి విజయవాడ/విశాఖ పట్టణం పంపిస్తామన్నారు. అక్కడ వారికి పర్వతారోహణ, ఆరోగ్యపరీక్షలు, క్రమశిక్షణ, ప్రవర్తనలో శిక్షణ ఇస్తారన్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చిన 130 మందిలో 20 మందిని ఎంపిక చేసి భారత రక్షణ శాఖ ద్వారా హిమాలయ పర్వతాల వద్దకు తీసుకెళ్లి, పర్వతాధిరోహణపై శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన 5గురిని ఎంపిక చేసి ఏప్రిల్-జూన్ మధ్యలో ఎవరెస్ట్ అధిరోహణకు పంపిస్తారని వివరించారు. కార్యక్రమంలో సెట్కూరు మేనేజర్ పీవీ రమణ, శ్రీనివాసగుప్త, నాగరాజు, మొయినుద్దీన్, షబ్బీర్, రత్నమయ్య, ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది తిరుమల్రెడ్డి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్
మూడో రోజు 424 మంది ఎంపిక కర్నూలు : కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతొంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో మూడో రోజు బుధవారం దేహదారుఢ్య పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 710 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల హాల్టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలించారు. అనంతరం బరువు, ఛాతీ, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. బ్యాచ్కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 424 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు 215 మంది తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి వారిని అనుమతించకుండా వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
గార్డు డ్యూటీల్లో అప్రమత్తంగా ఉండాలి
– ఏపీఎస్పీ కమాండెంట్ కర్నూలు : గార్డు డ్యూటీలు నిర్వహించే వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ విజయ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మూడో రోజు బుధవారం పెరేడ్ నిర్వహించారు. సిబ్బంది నుంచి కమాండెంట్ గౌరవందనం స్వీకరించారు. అనంతరం సిబ్బందిని సమావేశ పరిచి విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కుటుంబ సంక్షేమం తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటాలంలో పని చేస్తున్న సిబ్బందికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారికి రావాల్సిన రుణాలు, మెడికల్ బిల్లులు, రవాణా భత్యం త్వరితగతిన మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మోటర్ వాహనాల (ఎంటీ) కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆర్ఎస్ఐ (అడ్జుడెంట్) కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంటు కమాండెంట్స్ ఎస్ఎం బాషా, గోపాలకృష్ణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు యుగంధర్, బిక్షపతి, సమర్పణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్బాస్
కర్నూలు: మాజీ పోలీస్బాస్ (డీజీపీ) జేవీ రాముడు కర్నూలుకు వచ్చి వెళ్లారు. అనంతపురంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఏపీఎస్పీ పటాలంలో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆకె రవికృష్ణ, పటాలం కమాండెంట్ గోగినేని విజయకుమార్, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్, గోపాలకృష్ణ తదితరులు ఆయనకు పూలబోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లాలోని శాంతి భద్రతలతో పాటు ఏపీఎస్పీ రెండో పటాలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జేవీ రాముడు ఆరా తీశారు. ఆయుధాగారంతో పాటు స్కూలు, పార్కు, పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలో వాటిని ప్రారంభించనున్నట్లు కమాండెంట్ వివరించారు. -
ఏపీఎస్పీ పటాలం ప్రతిష్ట పెంచండి
– ఏపీఎస్పీ కమాండెంట్ విజయకుమార్ కర్నూలు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం ప్రతిష్టను మరింత పెంచాలని కమాండెంట్ విజయకుమార్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం బీ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఐ సమర్పణరావు, ఆర్ఎస్ఐ కేశవరెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో కూర్చోని రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డ్సు, డ్యూటీ రోస్టర్, డైలీ ప్రోగ్రామ్ రిజిస్టర్, నగదు లావాదేవీలకు సంబంధించిన రిజిస్టర్, స్టోర్ బుక్, పరేడ్ తదితర రికార్డులను తనిఖీ చేశారు. పటాలంలో హెడ్క్వాటర్ కంపెనీతో కలిపి మొత్తం 8 కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. విధి నిర్వహణలో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, విధుల నిర్వహణలో అలసత్వం తగదని సిబ్బందికి హెచ్చరించారు. -
శ్రీకాకుళంలో ఏపీఎస్పీ బెటాలియన్
కోటబొమ్మాళి : శ్రీకాకుళం జిల్లాలో మూడు వేల మంది కానిస్టేబుల్స్తో ఏపీఎస్పీ కొత్త బెటాలియన్ ఏర్పాటు చేయనున్నట్టు విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎ.రవిచంద్ర తెలిపారు. కోటబొమ్మాళి పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి చిన్నరాజప్పతో మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ బెటాలియన్ ఏర్పాటుకు అవసరమైన వందెకరాలు స్థలాన్ని ఎచ్చెర్లలో కేటారుుంచారని మరో 60 ఎకరాల స్థలాన్ని ఫైరింగ్ శిక్షణకు కేటారుుంచారని తె లిపారు. విశాఖ రేంజ్ పరిధిలో సారవకోట, శ్రీకాకుళం ట్రాఫిక్, రణస్థలం, కోటబొమ్మాళి, ఎచ్చెర్లలో కొత్త పోలీస్స్టేషన్ భవనాలు నిర్మించామని చెప్పారు. అలాగే 23 మంది ఏఎస్ఐలకు, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ శిక్షణకు పంపించామని డీఐజీ తెలిపారు. తమ పరిధిలో 500 మంది కానిస్టేబుల్స్ను నియమించనున్నట్టు చెప్పారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మావోరుుస్టుల ప్రాబల్యం తగ్గిందని పేర్కొన్నారు. 18 మంది రిజర్వు సబ్ఇన్స్పెక్టర్లు నియమిస్తామని తెలిపారు. వీరికి గ్రేహేండ్స్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. -
గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏపీఎస్పీకి చెందిన 9వ బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం రేణిగుంటలో చోటుచేసుకుంది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా సంతోష్ పనిచేస్తున్నాడు. అయితే, ఈరోజు ఉదయం అతడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే కుప్పకూలిపోయి సంతోష్ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు శ్రీకాకుళం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
సాక్షి, హైదరాబాద్: సిబ్బంది కొరత పోలీస్ శాఖకు పెనుసవాలుగా మారింది. ఇందుకు కారణం ఈ శాఖలో దాదాపు 8 వేల పోస్టులు ఖాళీగా ఉండిపోవడమే. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 500 మందికి ఒక పోలీసు ఉండాలి. అయితే రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా 1,050 మంది జనాభాకు ఒకరు మాత్రమే ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఖాళీలనూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యపై పోలీస్ శాఖ ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా 55,128 పోస్టులున్న పోలీసు విభాగంలో 16 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. ఇవి కేవలం జిల్లాలు, అర్బన్ జిల్లాలు, కమిషనరేట్లతో పాటు రైల్వే పోలీసు విభాగాల్లో ఉన్న ఖాళీలు మాత్రమే. సిబ్బంది విభజన పూర్తికాని నేపథ్యంలో ఇంకా రాష్ట్ర స్థాయి పోస్టులైన నాన్-క్యాడర్, అదనపు ఎస్పీలతో పాటు డీఎస్పీ పోస్టులు, ప్రత్యేక విభాగమైన ఏపీఎస్పీలో ఖాళీలపై పూర్తి స్పష్టత రాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోలీసు విభాగానికి ఒకేసారి 32 వేల పోస్టులు మంజూరు చెయ్యడం, వీటిలో కొన్ని రిక్రూట్మెంట్లు పూర్తయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సిబ్బంది లేమి ప్రభావం శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తుపై తీవ్రంగా పడుతోంది. మహిళా పోలీసుల పరిస్థితీ ఇంతే.. మహిళా పోలీసుల విషయంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉండగా.. పోలీసు విభాగంలోని 20 యూనిట్లలోనూ కలిపి ఉన్న మహిళా పోస్టుల సంఖ్య మాత్రం 2,700 మాత్రమే. వీటిలోనూ అనేకం ఖాళీగానే ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అర్బన్ జిల్లా మినహా ఇతర జిల్లాల్లో మహిళా పోస్టుల సంఖ్య 200కు చేరట్లేదు. రాష్ట్రంలోని ప్రతి పోలీసు విభాగంలోనూ సిబ్బంది కొరత ఇలానే ఉంది. దీనిని అధిగమించాలనే ఉద్దేశంతో రిటైర్డ్ పోలీసులనూ ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీవో)గా తీసుకుందామన్నా, హోంగార్డుల్ని రిక్రూట్ చేసుకుందామనుకున్నా ప్రభుత్వ అనుమతి లభించట్లేదు. ఈ కొరతకు తోడు కొత్తగా ఏర్పాటు చేసిన తుళ్లూరు, పోలవరం ముంపు మండలాల సబ్-డివిజన్లతో పాటు రాజధాని ప్రాంతంలోనూ అవసరమైన కొత్త పోస్టుల్ని లెక్కించాల్సి ఉంది. ఇదిలాఉండగా ప్రాథమికంగా 8,800 ఖాళీలు పూరించేందుకు అనుమతి కోరుతూ పోలీసు విభాగం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. వీక్లీ ఆఫ్.. అందని ద్రాక్ష! మూడు షిప్టుల్లో పని చేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. వీక్లీ ఆఫ్ అనేది అందని ద్రాక్షగా మారిపోయింది. దీంతో పని భారం పెరిగి సిబ్బంది ఒత్తిడికి లోనవుతుండటంతో ఆ ప్రభావం ఆరోగ్యం పైనా పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి కీలక సందర్భం వచ్చినా బందోబస్తు కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. -
మంగళగిరిలో అమ్ములపొది
- ఏపీ పోలీస్ ఆయుధాగారం తరలింపు ... - హైదరాబాద్ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్కు మార్చాలని నిర్ణయం - ఇప్పటికే భవనాలు పరిశీలించి ప్రభుత్వానికి లేఖ రాసిన డీజీపీ రాముడు - భద్రతాపరంగా ఇక్కడే మంచిదనే అభిప్రాయంలో ఉన్నతాధికారులు సాక్షి, గుంటూరు: మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఏపీ పోలీస్ ఆయుధాగారం ఏర్పాటుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఈ ఆయుధాగారాన్ని గుంటూరు- విజయవాడ మధ్య ఉన్న మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్కు మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు నెలల క్రితం రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లోని కొన్ని భవనాలను పరిశీలించి, హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఆమోదం రాగానే ఆయుధాగారాన్ని ఇక్కడకు మార్చనున్నట్టు సమాచారం. ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ఉన్న ప్రాంతంలో ఆయుధాగారాన్ని ఏర్పాటు చేయడం వల్ల భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయనేది పోలీస్ ఉన్నతాధికారుల అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలోని డీపీఓల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన ఆయుధాగారాలు ఉండటంతో కేంద్రం నుంచి వచ్చే ఆయుధాలను భద్రపరిచేందుకు దీన్ని వినియోగిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఏ జిల్లాకు ఆయుధాలు అవసరమైనా ఇక్కడి నుంచే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద రెండు వేల ఎకరాల్లో గ్రేహౌండ్స్, ఏఆర్, ఏఎన్ఎస్ వంటి విభాగాలతోపాటు పోలీస్ ట్రైనింగ్ సెంటర్, ఫైరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ విభాగాలన్నీ ఏర్పడితే వాటికి అందుబాటులో ఆయుధాగారం ఉండటం సౌకర్యవంతంగా ఉంటుందనే ఆలోచన కూడా పోలీస్ ఉన్నతాధికారుల్లో ఉంది. యథాతథంగా గుంటూరులోని రీబ్రౌనింగ్ సెంటర్ 1927లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం గుంటూరు పోలీస్ హెడ్క్వార్టర్స్లో ‘స్టేట్ రీబ్రౌనింగ్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. దీనిలో పోలీసుల ఆయుధాలు తుప్పుపట్టకుండా ప్రత్యేక కెమికల్ ద్వారా శుభ్రపరిచి, మరమ్మతులు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందిన పోలీసులు తమ ఆయుధాలను ఇక్కడే రీబ్రౌనింగ్ చేయించుకునేవారు. విచిత్రమేమిటంటే రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు తమ ఆయుధాలను గుంటూరులో ఉన్న రీబ్రౌనింగ్ సెంటర్లోనే రిపేర్ చేయిస్తుండటం గమనార్హం. 15 ఏళ్ల క్రితం గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ మొదటి బెటాలియన్ విభాగాలు ఈ రీబ్రౌనింగ్ సెంటర్ను హైదరాబాద్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఆ తరువాత వాతావరణం అనుకూలించక పోవడంతో తీసివేశారు. ఇదిలాఉంటే రీబ్రౌనింగ్ సెంటర్ను కూడా మంగళగిరి ఆరవ బెటాలియన్కు తరలిస్తారా లేక, గుంటూరులోనే కొనసాగిస్తారా అనే విషయంపై పోలీస్ అధికారుల్లో స్పష్టత లేదు. అయితే ఈ సెంటర్ ఏర్పాటుకు అన్ని చోట్లా వాతావరణం అనుకూలించదనే విషయం ఇప్పటికే రుజువు కావడంతో దీన్ని యథాతథంగా కొనసాగించాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆలోచనగా తెలుస్తోంది. -
ఏసీపీ చెర నుంచి బాల కార్మికునికి విముక్తి
హైదరాబాద్ : బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ అధికారి తన ఇంట్లో బాల కార్మికుడి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో కార్మికశాఖ అధికారులు సదరు పోలీసు ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సరూర్నగర్ హుడా కాలనీలో నివాసం ఉంటున్న ఏపీఎస్పీ బెటాలియన్ ఏసీపీ ఈవీ రామారావు ఇంట్లో కార్మికశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సూరి (10) అనే బాలుడి చేత రెండేళ్లుగా ఇంటి పనులు చేయించుకుంటున్నారన్న సమాచారంతో కార్మికశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీలో ఏసీపీ ఇంట్లో ఉన్న బాల కార్మికుడిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అడ్డువచ్చిన కానిస్టేబుల్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రస్తుతం కర్నూలు బెటాలియన్లో పనిచేస్తున్నారు. కాగా ఆయనపై కేసు నమోదు చేశారు. -
ఫ్లైఓవర్పై నుంచి కింద పడ్డ లారీ
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీఎస్పీ బెటాలియన్ క్యాంపు తరువాత ఉన్న ఓ ఫ్లైఓవర్ పైనుంచి ఒక లారీ కిందపడింది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది. (మంగళగిరి) -
గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
కడప: జిల్లాలోని సిద్ధపటం మండలం కనుమలోపల్లిలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుడు బెటాలియన్ కానిస్టేబుల్ బాలాజీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తలను దుండగులు బండి ఆత్మకూరులో వదిలి వెళ్లారు. సదరు గ్రామస్తులు మనిషి తలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా... కోడూరు వద్ద తల లేని మొండాన్ని గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తల, మొండం గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుదిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తన కుటుంబాన్ని కర్నూలులో దింపిన వెంకటేశ్వర్లు తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైయ్యాడని పోలీసులు తెలిపారు. తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు. -
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రొద్దుటూరు క్రైం: గణేష్ నిమజ్జనం విధుల కోసం హైదరాబాద్కు వెళ్లిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాసులు (31) గుండె పోటుతో మృతి చెందాడు. కానిస్టేబుల్ అంత్యక్రియలు గురువారం ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. బద్వేల్కు చెందిన శ్రీనివాసులు 2007లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రమీలతో వివాహమైంది. వారికి దీపక్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసులు 2006లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఏపీఎస్పీ 14 బెటాలియన్ అనంతపురంలో పని చేస్తున్నాడు. బంధువులందరూ ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్లో ఉండటంతో అక్కడే ఉన్నారు. శ్రీనివాసులు విధుల్లో భాగంగా వినాయ క నిమజ్జనం బందోబస్తు కోసం వారం రోజుల కిందట హైదరాబాద్కు వెళ్లాడు. లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. యూసఫ్గూడాలో నివసించే తన స్నేహితుడు రంజిత్కుమార్ వద్దకు ఈ 9న రాత్రి వెళ్లాడు. అక్కడ రంజిత్కుమార్తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. గాయ పడిన శ్రీనివాసులును వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె పోటుతో మృ తి చెంది ఉంటాడని వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం రాత్రి ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. మృతదేహం చూడగానే భార్య ప్రమీల బోరున విలపించింది. గురువారం ఉదయం శ్రీనివాసనగర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ కేవశరెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ మహేష్. బెటాలియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
గాల్లోకి కానిస్టేబుల్ 22 రౌండ్ల కాల్పులు!
మంచిర్యాల: 13వ ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ అనిల్ గాల్లో కాల్పులు ఘటన ఆందోళనకు కారణమైంది. విధుల పేరుతో అధికారులు వేధిస్తున్నారని కానిస్టేబుల్ ఆరోపిస్తూ గాల్లోకి 22 రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేటలో చోటు చేసుకుంది. దీంతో ఆ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఆకస్మిక ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానిస్టేబుల్ అనిల్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్ (కర్నూలు), న్యూస్లైన్ : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్లో ట్రేడ్మన్ అభ్యర్థుల ఎంపికకు సోమవారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నైపుణ్యాన్ని పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా.. లేదా..? అని పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరుకాగా జూలై 27వ తేదీ వీరికి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కల్నల్ జాఫ్రి తెలిపారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్మన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందని చెప్పారు. అయితే, ఈ నెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, వాటిని మంగళవారం నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ముగుస్తుందని జాఫ్రి పేర్కొన్నారు. -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్, న్యూస్లైన్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా సోమవారం కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్లో ట్రేడ్మెన్ అభ్యర్థుల ఎంపికకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నిపుణతను పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా లేదా అనేది పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరవగా వీరికి జులై 27వ తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కల్నల్ జాఫ్రి తెలియజేశారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్మెన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు. అయితే ఈనెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ఇది ముగుస్తుందన్నారు. -
మక్కా పేలుళ్లు జరిగి నేటికి ఏడేళ్లు
చార్మినార్: పాతబస్తీ మక్కా మసీదులో పేలుడు జరిగి ఆదివారానికి ఏడేళ్లవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2007 మే 18న మక్కా మసీదులో సంభవించిన పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా పలుచోట్ల ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఇక మక్కా మసీదు వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మక్కా మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రే ష్ట త్రిపాఠీ తెలిపారు. 6 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 7 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలతో పాటు దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. అశ్విక దళాలు గస్తీ తిరుగుతున్నాయన్నారు. పాతబస్తీలో నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. వెంటాడుతున్న విషాదం... చార్మినార్ : మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి ఏడేళ్లైనా.. ఆ నాటి విషాద ఘటన పాతబస్తీ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. 2007 మే 18న వుధ్యాహ్నం 1.18 గంటలకు బాంబు పేలింది. ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి మృతుల కుంటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ వారిని ఎన్ని లక్షలు వెచ్చించినా తీసుకు రాలేవు కదా.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి రాష్ర్ట ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష, ఇతరు నుంచి కూడా ఆర్థిక సహాయం అందిందనప్పటికీ... తమ వారు లేని లోటు తీర్చలేనిదంటున్నారు. బాంబు పేలుడు ఘటన ...తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు తమకు తీరని నష్టం జరిగిదంటున్నారు. నవాబ్సాబ్కుంటకు చెందిన ఇర్ఫాన్షరీఫ్ మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం అందింది. ఆ డబ్బుతో అతని ఇద్దరు తోబుట్టువుల వివాహాలు చేశారు. అలాగే మిశ్రీగంజ్కు చెందిన అక్రం అలీ ఖాన్ కుమారుడు సాజిద్ అలీఖాన్ మక్కామసీదు బాంబు పేలుడు ఘటనలో మృతి చెందడంతో...అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 6 లక్షల ఆర్థిక సహాయం లభించింది. దీంతో ఆమె వచ్చిన డబ్బుతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. అటు కుమారుడు లేక...ఇటు కోడలు లేక వయోవృద్ధుడైన అక్రం అలీ నిర్జీవంగా ఇంట్లో కాలం గడుపుతున్నాడు. ప్రస్తుతం తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ.... తమ వారు లేని లోటును ఎవరు తీరుస్తారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. -
కానిస్టేబుల్ వీరంగం
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: ఏపీఎస్పీ కానిస్టేబుల్ సాయిబాలాజీ సింగ్తోపాటు విద్యుత్ ఉద్యోగి నరేంద్ర, వీరి బంధువు గురువారం రాత్రి స్థానిక సినీ హబ్ థియేటర్స్లో వీరంగం సృష్టించారు. కారును పార్కింగ్లో పెట్టాలని కానిస్టేబుల్కు థియేటర్ సిబ్బంది శివశంకర్రెడ్డి చెప్పారు. తాము కానిస్టేబుళ్లమని చెబుతూ వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఇండికా కారులోని లాఠీలను తీసుకొని కానిస్టేబుల్ బాలాజీ శివశంకర్రెడ్డిని చితకబాదాడు. థియేటర్లోని తోటి సిబ్బంది బాలాజీతో వాగ్వాదానికి దిగారు. బాలాజీతోపాటు మరో ఇద్దరు శివశంకర్రెడ్డిని తలపై మోదడంతో తీవ్ర రక్తగాయమైంది. థియేటర్ యజమాని రాజేశ్వరరెడ్డి ఈ విషయాన్ని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న సాయిబాలాజీ సింగ్తోపాటు మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. తనపై దాడి చేసిన కానిస్టేబుల్, మరో ఇద్దరిపై శివశంకర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు వైఎస్ మహమూద్ పోలీస్స్టేషన్కు చేరుకుని సాయిబాలాజీ సింగ్పై కేసు నమో దు కాకుండా రాజేశ్వరరెడ్డితో చర్చించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
భద్రత కట్టుదిట్టం
కర్నూలు, న్యూస్లైన్: పురపాలక ఎన్నికలను పోలీసు శాఖ సవాల్గా తీసుకుంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ స్థాయి అధికారులు, స్థానిక పోలీసు అధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అందుబాటులోని సిబ్బందితో పాటు పారా మిలటరీ బలగాలతో నిఘాను తీవ్రతరం చేశారు. ఇప్పటికే పారా మిలటరీ బలగాలన్నీ మున్సిపల్ పట్టణాలకు చేరుకోగా.. సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ సిబ్బంది సేవలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 79 మంది ఎస్ఐలు, 294 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 1074 మంది కానిస్టేబుళ్లు, 64 మంది హోంగార్డులు, ఏఆర్ఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు 470 మంది, 1421 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 17 ప్లటూన్ల ఏపీఎస్పీ, సీఎపిఎఫ్ సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. స్పెషల్ స్ట్రయికింగ్, స్ట్రయికింగ్ ఫోర్సులతో పాటు షాడో పార్టీలను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఎన్నికలు జరిగే మునిసిపల్ పట్టణాల్లోకి కొత్త వ్యక్తులు, ఎన్నికలతో సంబంధం లేని వారు రాకుండా చెక్పోస్టుల వద్ద కట్టడి చేశారు. అక్రమ మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడంతో పాటు బెల్టు షాపులపై దాడులు కొనాసాగించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1183 మంది లెసైన్స్ ఆయుధాలు ఉండగా, ఇప్పటి వరకు 1104 ఆయుధాలను జిల్లా ఆర్మ్డ్ హెడ్క్వార్టర్తో పాటు ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఎన్నికల్లో గొడవలకు ఆస్కారం కలిగిస్తారనే అనుమానం ఉన్న వారందరిపైనా షాడో పార్టీలు ఏర్పాటయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు అవకాశం లేకుండా వీడియో చిత్రీకరించేందుకు ఈ సారి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సీఆర్పీసీ అమలులో ఉన్నందున కర్నూలు నగరంతో పాటు జిల్లా మొత్తం మీద సభలు, సమావేశాలు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు అలాంటి వారిని జిల్లా బహిష్కరణకు గురి చేసేలా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని 8 మునిసిపాలిటీల్లో ఈనెల 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజు శాంతియుత ప్రజా జీవనానికి అవరోధం కలిగించేలా హింసాత్మక ఘటనలకు పాల్పడితే అల్లరి మూకలపై కాల్పులు జరిపేందుకూ వెనుకాడవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి: ఎస్పీ మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో మునిసిపల్ ఎన్నికలు జరిగేలా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కాల్పులకూ వెనుకాడబోమన్నారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల వేటకు ఏపీఎస్పీ బలగాలు
అటవీ సిబ్బందికి అండగా పంపాలని పోలీసుశాఖ నిర్ణయం అటవీ సిబ్బందికి పోలీసు సంస్థల్లో సాయుధ శిక్షణ పోలీసు, అటవీశాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు రాష్ట్ర ప్రత్యేక పోలీస్(ఏపీఎస్పీ) బలగాలను రంగంలోకి దించనున్నారు. నల్లమలతోపాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడంలో శిక్షణ పొందిన ఏపీఎస్పీ సాయుధ బలగాలను వినియోగించడం ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల దూకుడుకు కళ్లెం వేయాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయి అటవీ సిబ్బందిపై గొడ్డళ్లతో దాడిచేసి హతమార్చడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనంతరం సర్కారు ఆదేశాల మేరకు డీజీపీ ప్రసాదరావు అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఎస్పీకి చెందిన ఏడు ప్లటూన్లను అటవీ సిబ్బందికి సహాయంగా కూంబింగ్కు పంపాలని నిర్ణయించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అటవీ సిబ్బందికి ఆయుధాలు మాత్రమే ఇస్తే సరిపోదని, స్మగ్లర్ల దాడులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పోలీసుశాఖ, అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ఉమ్మడి వ్యూహరచన చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి భద్రతగా ఏపీఎస్పీ సాయుధ బలగాలను పంపేందుకు పోలీసుశాఖ అంగీకరించింది. దాడులకు దిగే స్మగ్లర్లను మట్టుపెట్టే బాధ్యతను కూడా ఏపీఎస్పీ బలగాలే తీసుకుంటాయి. ఒకవైపు స్మగ్లర్ల వేట కొనసాగుతుండగానే అటవీ సిబ్బందికి సాయుధ శిక్షణ అందించేందుకు కూడా పోలీసుశాఖ అంగీకరించింది. వివిధ జిల్లాల్లో ఉన్న పీటీసీ, డీటీసీలలో అటవీ సిబ్బందికి కూడా పోలీసులతో కలిపి సాయుధ శిక్షణ అందించనున్నారు. బలగాల మధ్య సమన్వయం ముఖ్యం ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినప్పటికీ అంతగా ఫలితాలను సాధించింది లేదు. స్పెషల్ టాస్క్ఫోర్స్, అటవీ సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. దీంతో స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసు, అటవీ బలగాలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీంతోపాటు కేసుల దర్యాప్తు అంశంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. స్మగ్లర్ల దాడుల వంటి సమయంలో పోలీసులు కేసులు నమోదుచేసినప్పటికీ, వాటిని అటవీశాఖకు బదిలీ చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో జాప్యం తదితర కారణాల వల్ల కేసులు వీగిపోతున్నాయనే వాదన ఉంది. దీంతో దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. మరోవైపు స్మగ్లర్లకు శిక్షాకాలం పెంపుదలపై ప్రభుత్వానికి అటవీశాఖ ప్రతిపాదనలను పంపించనుంది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్పైనా ఆరా: ఎర్రచందనాన్ని భారీస్థాయిలో దేశ సరిహద్దులను దాటించడంలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పాత్ర ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో దావూద్ గ్యాంగ్ పాత్రపై కూడా నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. దావూద్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముది వెల్లడించారు. -
ఐదుగురు డీఎస్పీలు బదిలీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ డి.మోహన్రావ్ను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ జి.వేణుగోపాల్ను నియమించారు. అనంతపురం డీటీసీ డీఎస్పీ ఎన్. సుబ్బారావును పెనుకొండ డీఎస్పీగా, పెనుకొండలో డీఎస్పీగా ఉన్న జి.రామకోటేశ్వరరావును ఇంటలిజెన్స్ డీఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురం పీటీసీ డీఎస్పీ డి.నాగరాజును అనంతపురం డీఎస్పీగా, అనంతపురం డీఎస్పీ ఎన్.దయానందరెడ్డిని ఇంటిలిజెన్స్ డీఎస్పీగా బదిలీ చేశారు. చక్రం తిప్పిన మంత్రి రఘువీరా ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ తమ కనుసన్నల్లో పనిచేసే అధికారులను నియమించుకోవడంలో రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి క్రియాశీలకమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో తనకు చెక్ పెట్టేందుకు అప్పటి డీజీపీ దినేష్రెడ్డిపై జేసీ దివాకర్రెడ్డి ఒత్తిడి తెచ్చి కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమించిన మోహన్రావుపై బదిలీ వేటు వేయించారు. ఆ స్థానంలో తనకు విశ్వాసపాత్రుడైన వేణుగోపాల్ను నియమింపజేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, డీఎస్పీ ఎన్.సుబ్బారావు విద్యార్థి దశ నుంచే మంచి మిత్రులని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు కళ్యాణదుర్గం డీఎస్పీగా ఎన్.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. తన మిత్రుడు కావడం వల్లే సుబ్బారావును ఏరికోరి కళ్యాణదుర్గం డీఎస్పీగా రఘువీరా నియమింపజేసుకున్నారని అప్పట్లో పోలీసు వర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా డీఎస్పీ సుబ్బారావు పనిచేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. వాటిపై విచారణ చేసిన ఎన్నికల సంఘం డీఎస్పీ సుబ్బారావుపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిని కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమిస్తే రఘువీరాకు చెక్ పెట్టవచ్చునని అప్పట్లో జేసీ దివాకర్రెడ్డి భావించారు. ఆ క్రమంలోనే తన బంధువైన అప్పటి డీఐజీ దినేష్రెడ్డిపై ఒత్తిడి తెచ్చి.. కళ్యాణదుర్గం డీఎస్పీగా మోహన్రావును నియమించేలా జేసీ దివాకర్రెడ్డి చక్రం తిప్పారు. దీనిపై పలు సందర్భాల్లో రఘువీరా తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇప్పుడు మోహన్రావును బదిలీ చేయించి రఘువీరా పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ స్థానంలో తనకు సన్నిహితుడైన వేణుగోపాల్ను నియమించుకోవడంలో రఘువీరా సఫలీకృతులయ్యారు. కళ్యాణదుర్గం డీఎస్పీగా నియమితులైన వేణుగోపాల్ గతంలో ఉరవకొండ సీఐగా పనిచేశారు. స్థానిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన తన మిత్రుడు ఎన్.సుబ్బారావును పెనుకొండ డీఎస్పీగా నియమించుకోవడంలోనూ రఘువీరా విజయం సాధించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తనను బదిలీ చేయాలని చాలా కాలంగా కోరుతున్న అనంతపురం డీఎస్పీ దయానందరెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో డీఎస్పీగా పనిచేస్తోన్న డి.నాగరాజును నియమించారు. మంత్రి రఘువీరా ఆమోదముద్ర వేశాకే డి.నాగరాజును అనంతపురం డీఎస్పీగా నియమించారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో బలంగా విన్పిస్తోంది. గుంతకల్లు, ధర్మవరం డీఎస్పీలు సుప్రజ, నవాబ్జాన్లను కూడా బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడే అవకాశం ఉంది. -
పోలీసు యూనిఫాం ధరించడం అదృష్టం
సాక్షి, హైదరాబాద్: పోలీసు యూనిఫాం ధరించే అదృష్టం కొందరికే వస్తుంద ని, దాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి సేవ చేయాలని కొత్త డీజీపీ బి. ప్రసాదరావు అన్నారు. రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (ఏపీఎస్పీ) మొదటి బె టాలియన్లో గురువారం 268 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పటిష్ట చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది కోసం క్యాంటిన్లు ఏర్పాటు చేయడంతోపాటు, యూనిట్ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. డీజీపీతోపాటు ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్సావంగ్, ఐజీ స్వాతిలక్రా, డీఐజీలు షేక్ మహ్మద్ ఇక్బాల్, జె. ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు.