-
భిన్నత్వంలో.. ఏకత్వం!
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
దేవుని సేవకు ఇదోమార్గం..
భక్తి ఎక్కువైతే కొందరు ఊహాతీతంగా ప్రవర్తిస్తారు. వరగుణ పాండ్యన్ అనే రాజు ప్రవర్తన ఇందుకు మంచి ఉదాహరణ. తిరవిడై మరుదూర్ అనే ఊళ్లో ఆలయానికి కావలసిన నూనెను తీయడం కోసం ఒక రోజు నువ్వులు ఆరబెట్టారు. ఆ సమయంలో అటువైపుగా ఓ శివభక్తుడు వచ్చి ఓ పిడికెడు నువ్వులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.దేవుడి కోసం ఉపయోగించాలని ఎండబెట్టిన నువ్వుల్ని ఇలా నోట్లో వేసుకోవచ్చా? అది తప్పు కదా? అపచారం కదూ! అక్కడ కాపలా ఉన్నవారు ఇది చూశారు. ‘అయ్యో... అపచారం అపచారం’ అంటూ పరుగున వచ్చి అతనిని పట్టుకుని తీసుకుపోయి రాజు వరగుణ పాండ్యన్ ఎదుట హాజరుపరచారు.వరగుణ పాండ్యన్ అతని వంక తీక్షణంగా చూశాడు. నుదుట బొట్టుతో పరమ శివభక్తునిలా కనిపించిన అతడిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈయన ఇలా చేయడమేమిటీ అని అనుకున్న రాజు నమ్మలేకపోతున్నాడు.‘నువ్విలా చేయడమేమిటీ?’ అని అడిగాడు. దానికి ఆ భక్తుడు ఇలా చెప్పాడు... ‘నేను ఆకలి వల్ల అలా చేశాను. ఈ ఊరు నాకు ఎంతో నచ్చింది. శివాపచారం చేస్తే ఏడు జన్మలకు ఈ ఆలయానికి గానుగ ఆడించే ఎద్దుగా పుడతారన్న విషయం తెలుసు. అందుకే అలా చేశాను’ అన్నాడు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసేవారు. పుడితే ఈ ఊళ్ళో పుట్టాలి. అదీనూ గానుVýæ ఆడించే ఎద్దుగా. ఆ ఆలయంలో సేవ చేయాలి. ఒక తప్పు చేస్తే ఆ అవకాశం దక్కుతుందని తెలిసి ఆ భక్తుడు అలా చేశాడు.రాజు వరగుణ పాండ్యన్ భక్తుణ్ణి నోరు తెరవమన్నారు. శివభక్తుడు నోరు తెరిచాడు. అతని నోటిని రాజు చీలుస్తాడని అక్కడున్న వారందరూ అనుకున్నారు. కానీ రాజు భక్తుని నోటిలో అంటుకుని ఉన్న నువ్వుల్ని తీసి తన నోట్లో వేసుకున్నాడు. ‘మీరు చేసిన అపచారాన్ని నేనూ చేశాను. మీతో కలిసి నేనూ గానుగ ఆడించే ఎద్దుగా పుడతాను’ అన్నాడు రాజు. ఇలా ఉంటుంది అపరిమత భక్తిగలవారి ప్రవర్తన. ప్రవర్తనలోని తప్పొప్పుల కన్నా వారి భావన ప్రధానమని గ్రహించాలి. – యామిజాల జగదీశ్ -
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by हिंदू धर्म रक्षक (@omkar_sanatanii) (చదవండి: టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్) -
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు. ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు. విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు. ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు. ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు. ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు. ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయనఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'? -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు.. -
భద్రాచలం: రామా కనవేమిరా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భద్రాచలంలో వసతి, సౌకర్యాలకు నోచుకోవడంలేదు. అధికారులు దశాబ్దాలుగా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదు. ఒక్కరోజులోనే ఏసీ గదులు బుకింగ్.. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలతోపాటు ప్రైవేటు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గదులను బుక్ చేసుకునేందుకు దేవస్థానం ఆన్లైన్లో అవకాశం కల్పించింది. ఈ నెల 17,18 తేదీల్లో కల్యాణం, పట్టాభిషేకం ఉండగా, 11 నుంచి ఆన్లైన్ బుకింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో ఇటు దేవస్థానం, అటు ప్రైవేటు లాడ్జీల్లో ఉన్న ఏసీ గదులన్నీ బుక్ అయిపోయాయి. సింగిల్ రూమ్ మొదలు సూట్ వరకు ఏ ఒక్కటీ అందుబాటులో లేవు. వేసవిలో భద్రాచలంలో నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. దీంతో ఏసీ రూమ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. నాన్ ఏసీలదీ అదే బాట నాన్ ఏసీ గదులకు సంబంధించి దేవస్థానం ఆధ్వర్యంలోని కుటీరాలు, సత్రాల్లోని గదులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కేవలం ప్రైవేటు లాడ్జీల్లో నాన్ ఏసీ గదులే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల 16 సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల ప్యాకేజీతో లభిస్తున్నాయి. ఇవి సింగిల్ రూమ్కి రూ.1,732 మొదలు ట్రిపుల్ రూమ్కు రూ. 3,464 వరకు చార్జీలుగా ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇంత ధర చెల్లించేందుకు కూడా భక్తులు పోటీ పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ గదులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భద్రాచలంలో ఉన్న గదులన్నీ ఆన్లైన్లో ముందుగానే బుక్ అయిపోతే నవమి రోజు ఇక్కడికి చేరుకునే సామాన్య భక్తులు, అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోని వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. డార్మిటరీలు కరువే నవమి వేడుకలు చూసేందుకు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఇలా వచ్చే భక్తుల్లో సగం మంది ఉదయమే (ఏప్రిల్ 17) భద్రాచలం చేరుకుని కల్యాణం చూసుకుని, దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఇలాంటి వారికి వసతితో పెద్దగా అవసరం పడదు. కానీ స్నానాలు చేసేందుకు, సామన్లు దాచుకునేందుకు అనువుగా నామామాత్రపు సౌకర్యాలను ఈ భక్తులు ఆశిస్తారు. ప్రస్తుతం భద్రాచలంలో ఈ సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు గోదావరి నదినే స్నానాలకు దిక్కవుతోంది. తమతో పాటు తెచ్చుకున్న లగేజీని దాచుకోవడం కష్టంగా మారుతోంది. బొమ్మలు, కొబ్బరికాయల దుకాణాలే క్లోక్రూమ్ సేవలు అందిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భద్రాచలంలో ఎప్పుడో దశాబ్దాల కిందట కట్టిన సత్రాలు, ప్రైవేటు లాడ్జీలే ఆశ్రయం కల్పిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలో 32 గదులు, జానకీ సదనంలో 32 గదులు తప్ప మరో నిర్మాణం జరగలేదు. మరోవైపు ప్రైవేటు సెక్టారులో ఒకటి రెండు హోటళ్లు, కుల సంఘాల ఆధ్వర్యంలో సత్రాలు అందుబాటులోకి వచ్చాయి. హోం స్టే పద్ధతి అమల్లోకి తెస్తే.. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో మౌలిక సదుపాయలు మెరుగుపరచడంపై దేవస్థానం, ప్రభుత్వం, భద్రాచలం పంచాయతీలు ప్రయత్నించడం లేదు. ఫలితంగా శ్రీరామనవమి, ముక్కోటి, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దాతల ద్వారా నిధులు సమీకరించి కొత్తగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇతర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్టుగా ‘హోం స్టే’ పద్ధతిని భద్రాచలంలో అమల్లోకి తీసుకురావడంపై కనీస స్థాయిలో కూడా ప్రయత్నాలు జరగడం లేదు. భద్రాచలంలో ఉన్న స్థానికులకు హోం స్టే విధానంపై అవగాహన కలిగిస్తే పైసా ఖర్చు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం సాధ్యం అవుతుంది. కానీ ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఎంత సేపు అరకొర సౌకర్యాల నడుమ ఉన్న మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేయడం, సెక్టార్లుగా విభజించి టిక్కెట్ల అమ్మకాలు సాగించడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చివరికి భద్రాద్రిలో తమ ఇబ్బందులు తీర్చాలంటూ ఆ రామయ్యకే మొర పెట్టుకుని వెళ్లిపోతున్నారు. -
లండన్లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
Manali Hidimba Temple Photos: మంచు ముద్దగా.. హిడింబ దేవాలయం అద్భుతమైన దృశ్యలు (ఫోటోలు)
-
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
US: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?
అందరి దేశం అమెరికా. ఏ ఒక్క జాతికో మతానికో పరిమితమైన దేశం అనే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. నానా జాతులు, భిన్న మతస్తులు, ఎన్నో సంస్కృతుల వారంతా కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర ఒక ఆధునికమైన దేశాన్ని నిర్మించుకున్నారు. ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనున్న జనాభా దాదాపు దాదాపు 33 లేదా 34 కోట్లు మాత్రమే, మన దేశంతో ( 140 కోట్ల పైనే ) పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. యూ ఎస్ జనాభాలో తెల్లవారు దాదాపు 75 శాతం ( వైట్స్ 57, లాటినోస్ 18 ) నల్లవారు 12 శాతం, మిగతా వారు అమెరికా భూమి పుత్రులైన రెడ్ ఇండియన్స్, ఆసియా, ఫసిఫిక్ వగైరా దేశస్తులు. మత పరంగా చూసినప్పుడు 2022 అంచనా ప్రకారం క్రిస్టియన్ ప్రొటెస్టెంట్లు (34 శాతం ) ముందు వరసలో వారి తర్వాతి స్థానం ( 23 శాతం ) క్యాతోలిక్స్ది. యూదులు 2 శాతం కాగా, ఇతర చిన్న మతాల వారు 3 శాతం లేదా ఏ మతంతో సంబంధం లేదు అనేవారు 38 శాతం అమెరికాలో ఏ పట్టణానికి వెళ్లినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రముఖమైన అన్ని మతాల ప్రార్థణా మందిరాలు కనబడతాయి. ముఖ్యంగా మెజారిటీ వర్గానికి సంభందించిన చర్చిలకు కొదవ లేదు. అయితే వీటికి రెగ్యులర్గా హాజరు అయ్యేవారి సంఖ్య మాత్రం అంతంతేనని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులను ఆకర్షించడానికి నిర్వాహకులు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగమే ఉచిత వారాంత లంచ్లు, వైద్య శిభిరాలు, ఆస్పత్రులు, అనాథ, వృద్ధ ఆశ్రమాలు, విద్యా సంస్థల నిర్వహణ వంటివి. అవి ఏవైనా, ఏ మతం వారు చేసినా "మానవ సేవే మాధవ సేవ"గా భావించి చేసిన కార్యక్రమాలతో పేద వర్గాలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. అమెరికన్ చర్చిల్లో ఎక్కువగా కనబడేవారు అక్కడ స్థిరపడిన చైనా, దక్షిణ కొరియా ,జపాన్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, టర్కి, జర్మనీ తర్వాత మనవారు. అమెరికా వైశాల్యంలో భారత్ కన్నా చాలా పెద్ద దేశం. వాళ్లకు భూమి కొరత లేదు. అందుకే అక్కడి ప్రార్థణా స్థలాలు ఏ మతం వారివైనా విశాలమైన ప్రాంగణాల్లో ఉంటాయి. రోడ్ల పక్క, కూడళ్లలో ఎక్కడ ఉచిత స్థలం దొరికితే అక్కడ ప్రార్థణా స్థలాలు నిర్మించడం, మైకులు పెట్టి శబ్ద కాలుష్యం సృష్టించడం వాళ్లకు నచ్చదు. కాకపోతే కరపత్రాలు వేస్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, ప్రచార సాహిత్యాన్ని పంచుతారు, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుంటారు. అమెరికన్ చర్చిల్లో చాలాచోట్ల ఆటస్థలాలు, ప్లే స్కూల్లు, గ్రంధాలయాలు, సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక పార్కింగ్ స్థలాల గురించి చెప్పే పని లేదు. ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు అలాంటి నిర్మాణాలను అనుమతించకపోవడం విశేషం. క్రైస్తవేతర మతాలయాల విషయంలో హిందువులు, ముస్లింలు, బౌద్దులు ముందున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా భారతీయులు కనబడుతారు ముఖ్యంగా మన తెలుగువారికి కొదువ లేదు, అదే విధంగా హిందూ దేవుళ్ళు దర్శన మిస్తారు. ఒక అంచనా ప్రకారం ఆ దేశంలో నున్న హిందువుల సంఖ్య దాదాపు రెండున్నర మిలియన్లు. హిందూ ఆలయాల్లో ప్రసిద్ధమైనవి పిట్స్ భర్గ్ వెంకటేశ్వరాలయం, న్యూ జెర్సీ, అట్లాంటా , హ్యూస్టన్లోని స్వామి నారాయణ్ అక్షరధాంలు, వెస్ట్ వెర్జినియాలోని బృందావనం, మేరీలాండ్లోని శివ విష్ణు ఆలయం, న్యూయార్క్ గణేష, ఇవేకాక మీనాక్షి , హనుమాన్, సాయిబాబా వంటి మందిరాలు మనకు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తాయి. హరే కృష్ణ, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, గురు రవిశంకర్ గారి ఈషా యోగా ధ్యాన కేంద్రాలు, గతంలో ఒక వెలుగు వెలిగిన మహేష్ యోగి, ఓషో వంటి వారివి ఇలా అక్కడ తమ కార్యకలాపాలు సాగించిన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో. ఇలాంటివి భారతీయులు కలుసుకోడానికి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈ మందిరాల నిర్వాహకులు భారత్ నుంచి తరచుగా గురువులను, ప్రభోదకులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లిన వాళ్లకు కూడా స్వదేశంలో ఉన్న భావన కలగడం సహజం . నేను 2006 మొదలు 2022 వరకు ఒక దశాబ్దంన్నర కాలంలో పదికి పైగా పర్యాయాలు ఒకసారి జంటగా మరోసారి ఒంటరిగా, అమెరికాలోనున్న మా పిల్లలను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి ఏవోకొన్ని పర్యాటక ప్రాంతాలను, అక్కడి హైందవ ఆలయాలను దర్శించు కున్నప్పుడు ఆ దేశస్తుల్లో గమనించిన పరమత సహనం ప్రశంసనీయం ! వేముల ప్రభాకర్ (చదవండి: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!) -
భక్తి అంటే..?
భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు. మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు. కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు. ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి. సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే. తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే! శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
అలంకరణ మెండుగా.. మది నిండుగా.. సంక్రాంతి పండగ!
'ప్రకృతి పండగ సంబరంగా జరుపుకోవాలంటే ఆ కళ కూడా మన ఇంటికి కొత్త కళాకాంతులు తీసుకురావాలి. అప్పుడే పండగ మరింత అందంగా, శోభాయమానంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంక్రాంతి అలంకరణలు ఇవి.' సంక్రాంతి, పొంగల్ ఈ రెండింటినీ హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున, ఇళ్లను అందంగా అలంకరించడానికి పోటీపడుతుంటారు. సంప్రదాయ పద్ధతులే కాకుండా, పొంగల్ లేదా మకర సంక్రాంతికి ఇంటిని అలంకరించుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిలో ఇంటీరియర్ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు.. రంగుల రంగోలి ఏ భారతీయ పండుగకైనా ఇంటి ముందు అందమైన రంగోలీ ముచ్చటగొలుపుతుంది. ముగ్గుల పండగగా పేరొందిన సంక్రాంతికి ఇంటి గుమ్మం వద్ద, పూజ గది, పొంగల్ కోసం బయట రంగోలి డిజైన్లను రూపొందించడానికి మీ సృజనాత్మకతను చూపచ్చు. అందరూ వేసేదిగా కాదు అనుకుంటే వినూత్నమైన డిజైన్లను ప్రయత్నించవచ్చు. దీంతో పొరుగువారిని మించిపోవచ్చు. అపార్ట్మెంట్ల కోసం ఇన్డోర్.. అందరూ అలంకరించుకోవడానికి విశాలమైన పచ్చికతో కూడిన పెద్ద బంగ్లాలలో నివసించరు. అనేక మంది పట్టణవాసులు పట్టణాలు, నగరాల్లోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. కానీ ఇన్డోర్ డెకరేషన్ అవుట్డోర్లో చేసినట్లే ఆహ్వానించదగినదిగా ఉంటుంది. మీ గదిని ఆకులతో పొడవాటి చెరకుతో అలంకరించండి. బియ్యం పాలు, బెల్లం ఉడకబెట్టడాన్ని సూచించే మట్టి కుండలతో అలంకరించండి. సంక్రాంతి లేదా పొంగల్ జరుపుకోవడానికి మీకు పెద్ద బాల్కనీ లేదా తోట అవసరం లేదని గ్రహించాలి. ఆకులతో అందంగా.. పొంగల్, సంక్రాంతి అనేది శ్రేయస్సు వేడుక, ఈ థీమ్లో ఆకుపచ్చ రంగుదే అగ్రతాంబూళం. అందుకని, పొంగల్ రోజున మామిడి ఆకుల తోరణాలను ఇంటి ప్రవేశద్వారం వద్ద వేలాడదీయడం శుభప్రదమైనది. రంగు రంగు కాగితాలను ఉపయోగిస్తూ చేతితో పర్యావరణ అనుకూలమైన అలంకరణ చేయచ్చు. థీమ్ డెకరేషన్లో గాలిపటం గాలిపటాల హంగామా ఈ పండగ ప్రత్యేకం. కాబట్టి, పేపర్ క్రాఫ్ట్తో రంగురంగుల గాలిపటాల తయారీ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకు వస్తుంది. వీటిని తయారు చేయమని పిల్లలను ప్రోత్సహించవచ్చు. వాల్ హ్యాంగింగ్లను అందమైన అలంకరణలుగా ప్రయత్నించవచ్చు. కాగితంతో తయారు చేసిన సీతాకోకచిలుకలు, పువ్వులు, జంతువుల బొమ్మలు ఇంటీరియర్కు అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. మార్కెట్లో కూడా గాలిపటాలు అన్ని ఆకారాలు, పరిమాణాలలో లభిస్తాయి. బాల్కనీ అయితే గాలిపటాలను వేలాడదీయవచ్చు. లివింగ్ రూమ్లోని ఓ వాల్ని ఎంచుకుని రంగు రంగుల గాలిపటాలతో ఆకర్షణీయమైన అలంకరణ కోసం అతికించవచ్చు. వీటికి పువ్వులు, చెరకు డిజైన్లను కూడా జోడించవచ్చు. వాల్ పేపర్స్ పొంగల్ అలంకరణ చిటికేసినంత సులువుగా నట్టింటికి రావాలంటే ఇప్పుడు అందమైన ఫెస్టివల్ వాల్ పేపర్లు, వాల్ డెకార్ బ్యాక్డ్రాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాల్పేపర్ని ఎంచుకొని, డెకార్ చేయడమే తరువాయి. పండగ పిండివంటలు ఒక టేబుల్పైన కాగితం లేదా చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండ్ల బొమ్మలు, అరిశెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు.. వంటివి పలహారాల పేట్లు, కొయ్య బొమ్మలను ఉంచితే చాలు పండగ కళ వచ్చేసినట్టే. ఇవి చదవండి: 'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి.. -
మైసూర్లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి
మైసూర్లో ప్రపంచంలోని అరుదైన రెండు వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది. తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు. -
భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం
గీతా జయంతి ప్రత్యేకం.. సర్వధర్మములను విడనాడి నన్నే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపముల నుండి విడిపించెదను. నీవు శోకింప తగదు! — అధ్యాయం 18: శ్లో 66 మహర్షి వ్యాసులవారు రచించిన భగవద్గీతకు పరమహంస యోగానంద చేసిన విస్తారమైన అనువాదము, వివరణలో ఆ మహా యోగివర్యులు కృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునునికి చేసిన వాగ్దానానాన్ని ఈ విధంగా అనువదించారు; “నీవు అహంకార జనితాలైన కర్తవ్యాలను విస్మరించి, నేను నిర్దేశించిన దివ్య కర్తవ్యాలను నిర్వహిస్తూ, నాలోనే ఆనందిస్తే, విముక్తిని పొందుతావు.” ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ రచయిత, ఒక శతాబ్ది కంటే ఎక్కువ కాలం క్రితమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించిన పరమహంస యోగానంద ఈ విశ్వంలోని మొత్తం సమాచారం గీతలోని 700 శ్లోకాల్లో నిబిడీకృతమై ఉన్నదనీ, “భగవంతుని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఆ భాగం పైన గీత తన కాంతిని ప్రసరిస్తుందనీ” వివరించారు. యోగానందగారు గీతా వ్యాఖ్యానం పై తమ పనిని తన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి, శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు మరియు శ్రీకృష్ణ భగవానుడు గీతలో రెండుసార్లు ప్రస్తావించిన పవిత్ర క్రియాయోగ ప్రక్రియను పునరుజ్జీవింపచేసిన మహావతార్ బాబాజీ తమ అంతర్దృష్టితో చేసిన మార్గదర్శకత్వంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభించారు. యోగానంద ఈ విధంగా విశదపరిచారు; “ఒక దైవ సాక్షాత్కారం పొందిన గురువు సహాయంతో, సహజావబోధాజనిత అంతర్దృష్టితో కూడిన గ్రహణశక్తి అనే ఆడకత్తెరను ఉపయోగించడం ద్వారా భాష ,నిగూఢత అనే గట్టి పెంకును పగలగొట్టి, ధార్మిక బోధలలోని లోపలి సారమైన సత్యాన్ని అందుకోవడం ఎలాగో మనం నేర్చుకోగలుగుతాము.“ 1952 లో జరిగిన తమ మహా సమాధికి కొద్ది నెలల ముందు గీతలోని లోతైన అధ్యాత్మిక భావాల అంతిమ సమీక్ష మరియు వివరణ కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఏకాంతవాసంలో గురుదేవులు చేపట్టారు. “ఆ గదిలోని స్పందనలు (యోగానంద ఈ రచనా వ్యాసంగం చేపట్టిన గదిలో) నమ్మశక్యం కాకుండా ఉన్నాయి; ఆ గదిలోకి వెళ్తుంటే భగవంతుడిలోకి ప్రవేశిస్తున్నట్లే ఉండేది.” అని అక్కడి సన్న్యాసి ఒకరు గుర్తుచేసుకొన్నారు. యోగానంద బృహత్కృషి కేవలం గీతను తన స్వంత భావాల ప్రకారం, మేధస్సుతో మెలితిప్పి అర్థం చేప్పి వివరించడంలో కాకుండా, శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన నిజమైన సంభాషణను మహర్షి వ్యాసులవారికి తమ ‘బ్రహ్మానంద స్థితిలోని వివిధ స్థాయిలలో’ ఏవిధంగా వెల్లడి అయిందో దానిని ప్రపంచానికి వివరించడంలో ఉంది. అలా ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ సర్వవ్యాప్త పరమాత్మ (శ్రీకృష్ణుడు) కు, అర్జునుడి రూపంలోని ఒక ఆదర్శ భక్తుడి ఆత్మకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. గ్రహించగలిగిన భక్తుడికి మొట్టమొదటి అధ్యాయం నుండే కురుక్షేత్ర యుద్ధం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ప్రతి వ్యక్తిలోనూ — ఆత్మతో సంబంధం కలిగిన స్వచ్చమైన విచక్షణాయుత మేధస్సు (పాండు పుత్రులు) కు,అహంకారం అనే మాయకు లోనైన ఇంద్రియబద్ధమైన గుడ్డి మనస్సు (గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడు, అతడి కుటిల సంతానం) కు మధ్య — జరుగుతున్న ఆధ్యాత్మిక,మానసిక యుద్ధాన్ని వివరించడానికి పోలికగా ఊపయోగిస్తున్నారని స్పష్టమౌతుంది. కృష్ణుడి (గురువు లేక జాగృతమైన ఆత్మ చైతన్యం, లేక ధ్యాన జనిత సహజావబోధం) సహాయంతో యుద్ధం చేయాలి; భౌతికంగా, మానసికంగా, అధ్యాత్మికంగా ‘రాజ్యాన్ని అహంకారం నుండి, మరియు దుష్ట మానసిక ప్రవృత్తులనే దాని సైన్యం నుండి తిరిగి స్వాధీనపరచుకోవడం,’ తద్ద్వారా సర్వసమర్థ ఆత్మ సామ్రాజ్యాన్ని స్థాపించడం. కృష్ణుడు శోకతప్తుడైన అర్జునునికి నిశ్చయమైన ఓదార్పును అందించినట్టే, యోగానంద ప్రతి నిజమైన అధ్యాత్మిక అన్వేషకుడిలో ఉన్న అర్జునునికి తన అపూర్వమైన పలుకులతో ఈ విధంగా సలహా ఇచ్చారు. ”ప్రతి వ్యక్తీ తన కురుక్షేత్ర యుద్ధాన్ని తానే పోరాడి గెలవాలి. ఇది కేవలం గెలవ తగిన పోరు మాత్రమే కాదు, ఈ విశ్వానికి నిర్దేశింపబడిన దివ్య న్యాయాన్ని అనుసరించి, జీవాత్మకు పరమాత్మతో ఉన్న శాశ్వత సంబంధాన్ననుసరించి, ముందో తరువాతో తప్పక గెలవాల్సిన యుద్ధమిది.” గాడ్ టాక్స్ విత్ అర్జున‘, క్రియాయోగం గురించిన మరింత సమాచారంకోసం:yssofindia.org -
ఇవాళే సుబ్రమణ్య షష్ఠి! ఈ రోజున ఏం చేస్తారంటే..?
ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథిని గాక కేవలం ఈ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రమణ్య షష్ఠి అంటారు ఎందుకు. అసలేం చేస్తారు ఈరోజున. దక్షిణ భారతదేశ ప్రజలు ఎందుకంతా ఈ పండుగకు ప్రాముఖ్యత ఇస్తారు. పైగా ఆ రోజు పలు చోట్ల తీర్థం కూడా జరుగుతుంది. ఈ సుబ్రమణ్య షష్ఠిని పలు చోట్ల పలు విధాలుగా పిలుస్తారు ఎందుకని?. తదితరాల గురించే ఈ కథనం!. సుబ్రమణ్య షష్ఠి అనగా? శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి జననం.. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అనితరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. పలు పేర్లు ఎలా వచ్చాయంటే..? ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీస్వామివారిసహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానంచేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. ఈ పండగలో దాగున్న సామాజిక ప్రయోజనం.. జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని, ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోపకారం మిధం శరీరం" అని భావించి పేదవారికి కంబళ్ళు, దుప్పట్లు తోపాటు చలి నుంచి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతుంది. (చదవండి: ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!) -
ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. భోగితో ముగుస్తుంది: సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. పాశురములు చదివేటప్పుడు.. మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పంచాలి (రోజు పొంగలి , దద్ధోజనం , పరవాన్నం) ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం* -
కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయట
కార్తీక మాసం..అనేక పర్వదినాలకు ఆలవాలం. శివకేశవులకు, ఆయన వారి కుమారుడు అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. నోములు, వ్రతాలు, పూజలు ఈ మాసంలో చేసుకుంటే అధిక ఫలాన్నిస్తాయి. అటువంటి వాటిలో కేదారేశ్వర వ్రతం ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు, అన్న వస్త్రాలకు లోటుండదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే తారతమ్యం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి ఆ కేదారేశ్వరుని ధ్యానించాలి. గంగాజలం లేదా శుద్ధజలం, ఆవుపాలు, చెరుకు రసం, కొబ్బరినీళ్లు, తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం సమర్పించిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చన చేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి. ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురాణోక్తి. శ్రీ కేదారేశ్వర వ్రత కథ శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా ఆరాధిస్తాం కదా... ఆయన అర్ధనారీశ్వరుడెలా అయ్యాడో వివరించే కథ ఇందులో కనిపిస్తుంది. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడం కోసం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ–సాధ్య– కిన్నర కింపురుష–యక్ష–గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై వినోద సంభరితమైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించాడు. శివుడాతనిని అభినందించి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలు గాగల వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి ‘‘నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరి?’’ అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని ‘‘దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార’’ ని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలనుకుని కైలాసాన్ని వదలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. అక్కడి మునులు, వారి పత్నులను చూసి వారితో ‘‘నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగన లారా! నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి’’ అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు ‘‘అమ్మా! పార్వతీ! ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవావ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రతవిధానాన్ని వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని భక్తితో పూజ చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యం నుంచి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి ‘‘నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడాసొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ‘‘ఓయీ! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు’’ అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్బలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యం పొందుతారు. -డి. వీ. ఆర్. భాస్కర్ -
అలవాటుని అధిగమించటం అతికష్టం!
అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. పెరిగిన భౌగోళిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, పరిస్థితులు, వాతావరణం, మనుషులు, మత విశ్వాసాలు మొదలైన ఎన్నో అంశాలు ఒక అలవాటు ప్రబలటానికి దోహదం చేస్తాయి. అవే పరిస్థితుల్లో ఉన్న మరొక వ్యక్తికి అది కాక మరొక అలవాటు ఉండవచ్చు. దీనికి వ్యక్తి స్వభావం కారణం అవుతుంది. అంటే, వ్యక్తి సహజ స్వభావం, పరిస్థితుల ప్రభావాల సమాహారంగా అలవాట్లు ఏర్పడుతాయి. ఆ అలవాటు తెచ్చి పెట్టుకున్నది అని గుర్తించటం ఉండదు. అది సహజ లక్షణం అనే భ్రమలో ఆ వ్యక్తి మాత్రమే కాదు, చుట్టుపక్కల వారు కూడా ఉంటారు. అలవాటు ఎట్లా ఏర్పడిందో గుర్తించటం చాలా కష్టం. దానిని మానుకోటం మాత్రం కష్టం. ముందు అది మంచిది కాదు అని గుర్తించాలి, తరవాత మానాలి అనే సంకల్పం ఉండాలి. ఆ పైన ప్రయత్నం చేయాలి. మొదటిదే చాలా కష్టం. ఎందుకంటే మనిషికి తనని తాను సమర్థించుకోటం అన్నది సహజంగా ఉంటుంది. అలవాటై పోయంది అనటం అలవాటుగా మారింది. ఇంతకీ అలవాటు అంటే? అల+వాటు = అలవాటు. అంటే, సముద్రంలో అల ఎంత సహజంగా పైకి ఎగసి, అంతే వేగంగా ఎటువంటి ప్రయత్నం, శ్రమ లేకుండా పడుతుందో అంత తేలికగా హాయిగా జరిగిపోయేది. దానిని ప్రత్యేకంగా గుర్తించటం కూడా ఉండదు. అలవాటు అన్నది ఎంత బలంగా ఉంటుందంటే దానిని మానటం చాలా కష్టం. బలవంతంగా మానే వాతావరణం కల్పిస్తే గిజగిజ లాడిపోతారు. అందులోనూ దురలవాట్లు అయితే మరీనూ. పిచ్చిగా ప్రవర్తించటం, అవతలి వారికి పిచ్చెక్కేట్టు ప్రవర్తించటం లేదా ఆత్మహత్యలకి ΄పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అదే మంచి అలవాటు అయితే ఇబ్బంది పడతారు కాని, ఉన్న పరిస్థితుల్లోనే సద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాని, గిజగిజలాడరు. ఉదాహరణకి రోజూ ఒక సమయానికి ధ్యానమో, పూజో చేసుకునే అలవాటు ఉన్నవారు ఎప్పటిలాగా వీలుకాకపోతే ఉన్నంతలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ పని పూర్తి చేసుకుంటారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎంత మంది మధ్య ఉన్నా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా పుస్తకం పట్టుకుని కూర్చొంటారు. కొంతమంది త్వరగా దేనినైనా అలవాటు చేసుకుంటారు. వీరి అలవాట్లని మార్చటం అంత కష్టం కాదు. కొత్త అలవాట్లని తేలికగా చేసుకోగలరు కనుక మంచివి అలవాటు చేస్తే సరి! కొంతమందికి ఏది అలవాటు కావటం అన్నదే ఉండదు. వీళ్ళతో ప్రమాదం ఏమంటే మంచివి, పనికి వచ్చే అలవాట్లు కూడా ఉండవు. మనిషి జీవితం చాలావరకు అలవాటుగా సాగుతుంది. కొంతమందిని ఈ విధంగా ఎట్లా బతుకుతున్నావు? అని అడిగితే అలవాటయి పోయింది అంటారు. చిన్నప్పటినుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవడుతుంది. రుచులు కూడా అలవాటు వల్లనే కలుగుతాయట! చిన్నతనం నుండి కారం తినటం అభ్యాసం చేస్తే అదే అలవాటు అవుతుంది. ఎప్పుడు తినని వారికి నోరు మంట పుడుతుంది. ఒక్కొక్కప్రాతం వారు ఒక్కొక్క ఆహారాన్నీ ఇష్టపడటానికి కారణం ఇదే. అభిరుచులు కూడా అంతే! సాధారణంగా చేదు ఇష్టం ఉండదు ఎవరికీ. కాని నెమ్మదిగా అలవాటు చేసుకుని వదల లేని స్థితికి వచ్చింది సమాజం. కాఫీ, టీ, శీతల పానీయాలు ఇత్యాదులు. మొదటిసారి గొంతు దిగవు. ఆ తరువాత వదలవు. ధూమపానం, మద్యపానం సంగతి సరే సరి. – డా.ఎన్. అనంత లక్ష్మి (చదవండి: పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం? ఆ 12 నాగులనే పూజిస్తారు ఎందుకు?) -
'కార్తీకమాసంలో ఇలా చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి'
మాసాల్లో కార్తీకం..యుగాల్లో కృత యుగం..శాస్త్రాల్లో వేదం..తీర్థాల్లో గంగానదికి సమానమైనవి లేవన్నది పురాణ వచనం. అంతటి మహత్యం గల కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైది. అందుకే భక్తులు వేకువనే చన్నీటి స్నానాలు.. జప, తప నియమాలు..పూజలు.. ఉపవాసదీక్షలు చేస్తారు. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్: కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడంతో ఈ నెలకు ఆ పేరు వచ్చింది. ఈ నెల శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రి వేళల్లో వదీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,197 దేవాలయాలున్నాయి. వీటిలో శివాలయాలు 45 వరకు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కార్తిక పూజలు శ్రేష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దీపారాధన చేసేందుకు పనులు పూర్తి చేశారు. కార్తీక స్నానం కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోపు నది, చెరువు, కాలువల్లో కానీ, ఈ వనరులు అందుబాటులో లేకుంటే ఇంట్లో కానీ తలస్నానం చేయాలి.అప్పుడే కార్తీక స్నానం అవుతుంది. ఈ నియమంతో స్నానం చేసి, శివుడు, విష్ణువు, మరే దైవాన్ని అయినా ధ్యానించి, అర్ఘం ఇవ్వడంతో గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. పుణ్యప్రదం.. కార్తీక దీపం భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకే ప్రథమ స్థానం. అందుకే ఇంట్లోకానీ, శివాలయంలో కానీ ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేస్తారు. ఎవరైనా తెలిసికానీ, తెలియకుండా కానీ ఎక్కడైనా సరే దీపం పెడితే వారి పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే సీ్త్రలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీపారాధనతో పాటు శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు. వన భోజనం ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం కార్తిక మాస ప్రత్యేకం. ఐక్యత సాధనకు ఇది ఎంతో ఉపకరణం. కలిసిమెలసి మసలుకునే తత్త్వం వనభోజన సంబరాలతో అలవడుతుంది. ఈ కార్యక్రమం వనాలపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ భోజన సంబరంలో పూర్తి సాత్విక వంటకాలనే భుజిస్తారు. కార్తీకం.. ఆచరణ ఇలా కార్తిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికైన ఆహారం భూజించాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. పాలు, పండ్లు భుజించవచ్చు. రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయకూడదు. తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యఫలం సిద్ధిస్తుంది కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకుని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి. ఈ నెలలో 17న నాగుల చవితి, 18న స్కంధషష్టి, 26న కార్తీకదీపం అతిముఖ్యమైన పండుగలు. –సుధాకర్ గురుక్కల్, వేదపండితులు, చిత్తూరు -
ఇలా దీపాలు వెలిగిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందట!
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. దీపంతో దోషం పరిహారం జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట. పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట. బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. -
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. -
గరుత్మంతుడు, హనుమంతుడి మధ్య పోరులో ఎవరు గెలిచారో తెలుసా?
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. ‘అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి, తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడింకెవడున్నాడు’ అనుకుని గర్వించసాగాడు.గరుడుని ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా, అతడికి గర్వభంగం చేయాలని తలచాడు. ద్వారకలో సత్యా సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ‘ప్రభూ! ఏమి ఆజ్ఞ’ అంటూ మోకరిల్లాడు.‘వీరాధి వీరా! వైనతేయా! నీతో ముఖ్యమైన పని పడింది. అందుకే నిన్ను తలచుకున్నాను’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ‘ఆజ్ఞ ఏమిటోసెలవివ్వు ప్రభూ’ అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు.‘మరేమీ లేదు. గంధమాదన పర్వతం మీద కదళీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడవు’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు. ‘నేనేమిటి? నా పరాక్రమమేమిటి? ఒక వానరాన్ని తోడ్కొని రావడానికి నేను స్వయంగా వెళ్లడమా?’ అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అనుకుని తక్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి, గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ‘ఓ వానరశ్రేష్ఠా! మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం. కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను’ అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా, తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికారచేష్టను గమనించి కూడా, హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని, ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి, ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణసంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడుడు వజవజ వణకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి, ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు.గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి, కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకుని సేదదీరాలనుకుని, హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని, హనుమంతుడి తోక అని గ్రహించి, దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుణ్ణి బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిర తిప్పి, గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాలసముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదదీరాడు. తిరిగి శక్తి కూడదీసుకుని, ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిలుచుకున్న గరుత్మంతుణ్ణి చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘ఖగేంద్రా! అలా నిర్విణ్ణుడవై నీరసంగా నిలుచున్నావేమిటి? ఏం జరిగింది? చెప్పు’ అన్నాడు. ‘దేవదేవా! జగన్నాటక సూత్రధారీ! మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్లాను. అతడు నా మాట వినలేదు’ అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు.‘ఛీ! ఏమిటీ ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది. వెంటనే తీసుకురా’ అన్నాడు.‘స్వామీ! నా బలగర్వం అణిగింది. వానరరూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను’ అన్నాడు గరుత్మంతుడు.‘ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్లు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాటాడకుండా వస్తాడు’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు. -
అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు!
విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా... కోల్కతా – కాళీమాత కోల్కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది. ముంబై – ముంబా దేవి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. చండీగఢ్ – చండీ మందిర్ అటు పంజాబ్కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. పాటన్దేవి పేరుతో పట్నా శక్తి స్వరూపిణి ‘పాటన్దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి. నైనాదేవి పేరుతో నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా) అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర) తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర) హసన్ – హసనాంబ (కర్ణాటక) త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర) మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక) కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు) సంబల్పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా) (చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! ) -
మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. సప్తగిరులు భక్తసిరులతో నిండిపోతున్నాయి. తిరుమాడ వీధులు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక సరాగాలు అంబరాన్ని తాకుతున్నాయి. విద్యుద్దీప కాంతులు మంత్రముగ్దులను చేస్తున్నాయి. విరబూసిన అందాలు భక్తులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. దేవదేవుని దివ్య స్పర్శతో పునీతమవుతున్నాయి. పుష్పక విమానం తిరుమల: తిరుమలలో శుక్రవారం బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడింది. మలయప్ప మూడు వాహనాలపై ఊరేగుతూ భక్తులను మురిపించారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హనుమంత వాహన సేవలో టీడీపీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి నేటి వాహన సేవలు ►ఉదయం సూర్యప్రభ వాహనం: బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ కనువిందు చేయనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు. ►రాత్రి చంద్రప్రభ వాహనం:రాత్రి తెల్లటి వ్రస్తాలు, పుష్ప మాలలు ధరించి చల్లని వాతావరణంలో తిరువీధుల్లో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు. (చదవండి: తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?)