JammuKashmir
-
జమ్ముకశ్మీర్కు త్వరలో రాష్ట్రహోదా !
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలో జమ్ముకశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరించే అవకాశాలున్నాయి. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కోరుతూ కొత్తగా ఏర్పడ్డ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రహోదా ఇవ్వనుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా రద్దైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ -
కశ్మీర్లో లష్కరే కీలక కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా కీలక కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్ హతమయ్యాడు. కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్గా వ్యవహరించే ఇతడి మృతి దక్షిణ కశ్మీర్లో లష్కరేకు కోలుకోలేని దెబ్బగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. సోమవారం కార్డన్ సెర్చ్ సందర్భంగా ఉగ్రవాదులు దాగున్న ఇంటికి నిప్పంటుకుంది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒకరిని లష్కరే తోయిబా కశ్మీర్ వ్యాలీ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ దార్ అలియాస్ సత్తార్గా, మరొకరిని రయీస్ దార్గా గుర్తించారు. 2015 నుంచి లష్కరేలో పనిచేస్తున్న సత్తార్కు గ్రెనేడ్ దాడులు, లక్షిత హత్యలు వంటి 20కి పైగా ఉగ్ర ఘటనలతో సంబంధముంది. కొన్నేళ్లుగా బలగాల కళ్లుగప్పి తిరుగుతున్న సత్తార్ పై రూ.10 లక్షలు, రయీస్పై రూ.5 లక్షల రివార్డున్నట్టు కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ధి చెప్పారు. -
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్షా హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో మోదీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. పీటీఐకి ఇచ్చిన తాజా ఇంటర్యూలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో అక్కడ అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇది చాలా పెద్ద పరిణామం. కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం మోదీ సర్కార్కు దక్కిన అతిపెద్ద విజయం. ఎన్నికలు ముగిసిన వెంటనే కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తాం’అని షా పేర్కొన్నారు. -
ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(ఎంఏ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(మసరత్ ఆలం)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సాయపడుతూ దేశ వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ‘‘ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచే ఎలాంటి సంస్థలు, శక్తులనైనా కేంద్రం ఊరికే వదిలిపెట్టదు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద ఈ సంస్థపై చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్లో భారత వ్యతిరేక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, జనాన్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. జమ్మూకశ్మీర్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత అతివాద హురియత్ కాన్ఫెరెన్స్కు మసరత్ చైర్మన్గా ఉన్నారు. 2010లో కశ్మీర్ అల్లర్లకు బాధ్యుల్లో భట్ కూడా ఒకరు. దీంతో అదే ఏడాది భట్ను పోలీసులు అరెస్ట్చేయగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భట్ను విడిపించారు. బీజేపీ ఒత్తిడితో అరెస్ట్చేసి జైలులో పడేశారు. -
2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?
ఆర్టికల్ 370ని తొలగించి నాలుగున్నరేళ్లు దాటినా జమ్ముకశ్మర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో 85 మంది ఉగ్రవాదులు, 35 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారు. 2023లో జమ్ముకశ్మీర్లో తొమ్మిది ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో ఆరు జమ్మూ డివిజన్లో, మూడు కశ్మీర్ లోయలో జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ డివిజన్లో 25 మంది సైనికులు మరణించారు. ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో, కశ్మీర్ లోయలో జరిగిన మూడు ఆపరేషన్లలో తొమ్మదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మార్చి, జూన్, జూలై, అక్టోబర్లలో సైనిక ప్రాణనష్టం జరగలేదు. ఫిబ్రవరిలో ఒక సైనికుడు, ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్లలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు, సెప్టెంబర్లో నలుగురు, ఆగస్టులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మాచెల్ సెక్టార్లోని ఒక ఫార్వర్డ్ ఏరియాలోని లోయలో జారిపడి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించారు. ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలోని పొట్గంపొర అవంతిపొర వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిమాచల్ ప్రదేశ్ సైనికుడు వీరమరణం పొందారు. ఏప్రిల్లో పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని భటాధురియన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. స్థానికేతర మిలిటెంట్లు యూబీజీఎల్ ఉపయోగించి ఆర్మీ వాహనంపై గ్రెనేడ్తో దాడి చేసినట్లు సమాచారం. మేలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలోని కంది అటవీ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టులో దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. సెప్టెంబరులో, రాజౌరిలోని నార్లా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికునితో పాటు ఒక ఆర్మీ శునకం మరణించింది. దక్షిణ కాశ్మీర్లోని గాడోల్ కోకెర్నాగ్ ఎన్కౌంటర్లో కల్నల్, మేజర్తో సహా కనీసం ముగ్గరు ఆర్మీ సిబ్బంది మరణించారు. నవంబర్లో కలకోట్ రాజౌరిలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో 30 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. డిసెంబరులో పూంచ్లోని తన్నమండి సూరంకోట్ రోడ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పౌరులు మరణించగా, ఆర్మీ కస్టడీలో ముగ్గురు మరణించారు. 2023లో ఇప్పటి వరకు 85 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది కూడా చదవండి: ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు! -
ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా ఆ గార్డెన్!
తులిప్ గార్డెన్ చూడగానే ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతలా అందంగా ఉంటాయి ఆ పూల మొక్కలు. చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్ పుష్పాల గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకునేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. అలాంటి తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా రికార్డులకెక్కింది. ఇది శ్రీనగర్లోని ఇందిరాగాంధీ మొమోరియల్ ఉంది. ఏకంగా 1.5 మిలియన్ల పూలతో ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఈ ఉద్యానవనంలో 68 విభిన్న రకాల మొక్కల నుంచి సుమారు 1.5 మిలయన్ల పైగా తులిప్ పుష్పాలు ఉంటాయి. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో ట్విట్టర్లో పేర్కొన్నారు కూడా. ఆయన ఈ సుందర వనాన్ని దాదాపు లక్షమంది దాక సందర్శించి ఉండొచ్చన్నారు. అలాంటి అందమైన తులిప్ గార్డెన్ ఆసియాలో అతిపెద్దది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి. ఈ మొక్కలను మనం వెంకటేష్ టబు నటించిన కూలీ నెం.1 సినిమాలో చూశాం. అందులో "కొత్తకొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది" అనే పాటలోఒ ఈ గార్గెన్ని కనిపిస్తుంది. చాలాచాలా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండొచ్చు గానీ. మనీకు తెలిసినంతవరకు ఆ తులిప్ పూలను చూస్తే మనకు మాత్రం నిస్సందేహంగా ఆ పాట గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పూలను చూసే అలా పాట రాశారేమో కాబోలు. ఇక ఈ తులిప్ తోట శ్రీనగర్లోని దాల్ సరస్సు జబర్వాన్ కొండల మధ్య ఉంది. ఈ ఉద్యానవనం సుమారు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో దీని సిరాజ్ బాగ్ అనిపిలిచే వారు. శ్రీనగర్ టూరిజం ప్రకారం ఈ ఉద్యానవనం 2007లో పూల పెంపకంతో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కాశ్మీర్ లోయలో ఏడు టెర్రస్లతో కూడిన టెర్రస్ పద్ధతిలో నేలపై ఏటవాలుగా ఈ గార్డెన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆ గార్డెన్లోని వివిధ రకాల పూలతో తులిప్ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి వసంత రుతువులో ఈ ఫెస్టివల్ని నిర్వహించడం విశేషం. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
నేటితో ముగియనున్న జోడో యాత్ర
శ్రీనగర్: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్లో ముగియనుది. ఈ సందర్భంగా శ్రీనగర్లోని లాల్చౌక్ క్లాక్ టవర్ వద్ద అత్యంత కటుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948లో ఇక్కడే జాతీయ పతాకాన్ని ఎగరేయడం విశేషం. రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తానిచ్చిన హామీని నెరవేర్చుకున్నానని చెప్పారు. సెప్టెంబర్ 7న మొదలైన రాహుల్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 4 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. మతసామరస్యమే ప్రధాన ఎజెండా సాగిన ఈ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ ఉల్లాసంగా కనిపించారు. సోమవారం ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా శ్రీనగర్లోని ఎస్కే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. బీజేపీపై పోరుకు విపక్షాలు ఏకం విపక్షాల మధ్య విభేదాలున్నా, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై పోరులో అవి ఐక్యంగా ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జోడో యాత్రలో పాల్గొనబోమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చెప్పడంపై ఆయన స్పందించారు. జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి చేరినప్పటికీ ఫలితం మాత్రం దేశమంతటా ఉందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల విద్వేషం, అహంకారంల స్థానంలో తమ యాత్ర దేశానికి సోదరభావమనే ప్రత్యామ్నాయాన్ని చూపిందని అన్నారు. -
ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. వీరిలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ జహీద్ అహ్మద్ వని అలియాస్ ఉజైర్ ఉన్నాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. పుల్వామా, బుడ్గావ్ జిల్లాల్లో ఉగ్రవాదుల ఆచూకీ సమాచారం అందుకున్న భద్రతాదళాలు కూంబింగ్ నిర్వహించాయని తెలిపారు. పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు మృతి చెందగా, బుడ్గావ్లోని చరారే షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన బిలాల్ అహ్మద్ ఖాన్ చనిపోయాడన్నారు. జహీద్ వని జైషేలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడని, అతని సోదరుడు బాన్ప్లాజా దాడిలో నిందితుడని తెలిపారు. 2017 నుంచి జహీద్ చురుగ్గా ఉగ్రకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. లోయలో మొత్తం జేషే కార్యకలాపాలకు ఇతనే సూత్రధారి అని, ఇతని మరణం భద్రతా దళాలు సాధించిన గొప్పవిజయమని విజయ్ కుమార్ ప్రశంసించారు. 11 ఎన్కౌంటర్లు.. 21 మంది ఉగ్రవాదులు జనవరిలో ఇంతవరకు 11 ఎన్కౌంటర్లలో 21మంది టెర్రరిస్టులు మరణించినట్లు చెప్పారు. వీరిలో 8మందికి పాక్తో సంబంధం ఉందన్నారు. పలు ఐఈడీ పేలుళ్లతో వనికి సంబంధం ఉందని ఆర్మీ అధికారి మేజర్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ చెప్పారు. ఉగ్రవాదుల్లోకి యువతను రిక్రూట్ చేయడంలో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. మరణించిన ఇతర ఉగ్రవాదులను కఫీల్ భారీ అలియాస్ ఛోటూ, వహీద్ అహ్మద్ రెషి, ఇనాయత్ అహ్మద్ మిర్గా గుర్తించారు. వీరిలో ఛోటూ పాక్ నివాసి. కాల్పుల్లో మరణించిన మిర్ ఉగ్రవాదులుంటున్న ఇంటి యజమాని కుమారుడని, హైబ్రిడ్ టెర్రరిజానికి ఇది ఉదాహరణఅని ప్రశాంత్ తెలిపారు. ఇలాంటి వారికి టెర్రరిస్టులుగా ఐడెంటిటీ ఉండదని, కానీ ఉగ్రవాదులకు సహాయంగా వ్యవహరిస్తుంటారని వివరించారు. పాక్, హైబ్రిడ్ టెర్రరిస్టులు భద్రతాదళాలకు అసలు సమస్యన్నారు. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తొలిసారి 200 దిగువకు తెచ్చామని తెలిపారు. డ్రోన్లతో పాటు ఇతర మార్గాల్లో వీరికి ఆయుధాలు అందుతున్నాయని, ఈ ఆయుధ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అధికారులు చెప్పారు. In dual encounters - 4 neutralized in Pulwama and 1 in Budgam. Among the killed in Pulwama is Zahid Wani who was actively involved in killings and recruitments. He was the district (Pulwama) commander and JeM chief of the entire Valley: Vijay Kumar, IGP Kashmir pic.twitter.com/86nkmwaRBM — ANI (@ANI) January 30, 2022 చదవండి: సీన్ రివర్స్.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్ -
శ్రీనగర్లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. కాగా, వీరు స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద మంగళవారం సాయంత్రం బాంబు దాడికి తెగబడ్డారు. పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్గా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బాంబు దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అక్కడి ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భద్రత సిబ్బంది, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏవైన పేలుడు పదార్థాలు ఉన్నాయా.. అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రిపబ్లిక్డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar Details awaited. pic.twitter.com/ioU2AQABgh — ANI (@ANI) January 25, 2022 చదవండి: రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా -
ముఫ్తీ పాస్పోర్ట్పై ఆదేశాలివ్వలేం
శ్రీనగర్: తనకు పాస్పోర్ట్ను జారీ చేయాలని అధికారులను ఆదేశించా లన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మెహబూబా ముఫ్తీకి పాస్పోరŠుట్ట జారీ చేయకూడదని పోలీస్ వెరిఫికేషన్ నివేదిక సిఫారసు చేసినందువల్ల పాస్పోర్ట్ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి జస్టిస్ అలీ మొహమ్మద్ మాగ్రే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ను జారీ చేయాలని తాను ఆదేశించలేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసు కునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేద న్నారు. ‘పోలీస్ వెరిఫికేషన్ నివేదిక వ్యతిరేకం గా వచ్చినందున మీకు పాస్పోర్ట్ జారీ చేయలేమ’ని రీజనల్ పాస్పోర్ట్ అధికారి మార్చి 26న మెహ బూబా ముఫ్తీకి లేఖ రాశారు. దీనిపై ముఫ్తీ స్పం దిస్తూ.. ‘కశ్మీర్లో నెలకొందని చెబుతున్న సాధారణ స్థితికి ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు పాస్పోర్ట్ జారీ చేయడం భారతదేశ భద్ర తకు ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి పాస్పోర్ట్ ఉండటం దేశ సార్వభౌమత్వానికి భంగకరమట’ అని ఆమె ట్వీట్ చేశారు. -
కశ్మీర్కు ముర్ము.. లదాఖ్కు మాథుర్
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ రాష్ట్రం స్థానంలో నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్కు లెఫ్ట్నెంట్ గవర్నర్గా జీసీ ముర్ము, లేహ్కు లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఆర్కే మాథుర్ గురువారం పాలనాపగ్గాలు చేపట్టారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దుతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5వ తేదీన కేంద్ర తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి రావడం తెల్సిందే. లదాఖ్ రాజధాని లెహ్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్కే మాథుర్తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జీసీ ముర్ము(59)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాధాకృష్ణ మాథుర్(66) 1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా, సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా పనిచేసి రిటైరయ్యారు. గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ముర్ము స్వస్థలం ఒడిశా. విధుల్లో ఉండగానే లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి అధికారి ముర్మునే. కాగా, జమ్మూకశ్మీర్కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం కేంద్ర విధించిన ఆంక్షలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
‘నన్ను నిర్భందించారు.. చంపేస్తారేమో’
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాని అరెస్ట్ చేసి ఇప్పటికి పది రోజులకు పైనే అయ్యింది. జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజా జావెద్ ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓ వాయిస్ మెసేజ్ని విడుదల చేశారు. మీడియాతో మాట్లాడితే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై అమిత్ షా వివరణ ఏంటని ఇల్తిజా ప్రశ్నించారు. ‘ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. కశ్మీర్ ప్రజలని మాత్రం జంతువుల మాదిరి ఓ బోనులో బంధించారు. వారు మానవ హక్కులను కూడా కోల్పోయారు. జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన వ్యక్తం చేయకుండా ఉండటం కోసం మా రాష్ట్రంలో సమాచార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బయటి ప్రపంచంతో మా సంబంధాలను నిలిపివేసి మా గొంతు నొక్కేశారు’ అన్నారు. ‘అంతేకాక నన్ను కూడా నిర్భందించారు. కర్ఫ్యూ విధించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీడియాకు తెలియజేశాను. అందుకే నన్ను కూడా నిర్భందించారు. ఈ విషయాల గురించి మరోసారి మీడియాతో మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం నన్ను నిఘా పర్యవేక్షణలో ఉంచి నేరస్తురాలిగా చూస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను కూడా చంపేస్తారేమోనని భయంగా ఉంది. నా మాటలపై అమిత్ షా ఎలా స్పందిస్తారో చూడాలి’ అంటూ ఇల్తిజా వాయిస్ మెసేజ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, మానవహక్కుల ఉల్లంఘన జరగుతుందంటూ.. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇల్తిజా సందేశం సంచలనం సృష్టిస్తోంది. -
‘విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి’
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం కశ్మీర్ లోయలో హింస పెరిగిపోయిందనే వార్తలొస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ స్పందిస్తూ.. ‘కశ్మీర్ లోయను సందర్శించడానికి ఎయిర్క్రాఫ్ట్ పంపుతా. వచ్చి.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోండి’ అని రాహుల్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా గవర్నర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విమానం కాదు కావాల్సింది.. స్వేచ్ఛ అంటూ రాహుల్ మండి పడ్డారు. ‘డియర్ గవర్నర్ మీ ఆహ్వానం మేరకు నేను, ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్, లదాఖ్లో పర్యటిస్తాం. అయితే మాకు కావాల్సింది ఎయిర్ క్రాఫ్ట్ కాదు... స్వేచ్ఛ. ప్రజలను కలిసి, వారితో స్వయంగా మాట్లాడే అవకాశం కల్పించండి చాలు’ అంటూ రాహుల్ తీవ్రంగా స్పందించారు. Dear Governor Malik, A delegation of opposition leaders & I will take you up on your gracious invitation to visit J&K and Ladakh. We won’t need an aircraft but please ensure us the freedom to travel & meet the people, mainstream leaders and our soldiers stationed over there. https://t.co/9VjQUmgu8u — Rahul Gandhi (@RahulGandhi) August 13, 2019 -
ఆర్టికల్ 370: పూలమాలతో ఎదురు చూడటం లేదు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాల పట్ల దాయాది దేశం విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ విభజనను సాకుగా చూపి అంతర్జాతీయ సమాజంలో భారత్ను దోషిగా నిలపాలని పాక్ తెగ ప్రయత్నించింది. అయితే ఈ విషయంలో పాక్కు నిరాశే ఎదురయ్యింది. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పాక్ ప్రజలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో భారత్పై పాక్ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిద్ధంగా లేదని ఖురేషీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. కానీ ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. మనకు పూలమాలతో స్వాగతం పలకడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా లేదు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డం పడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి’ అని ఖురేషి జనాలను కోరారు. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతుగా నిలిచిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
178 సార్లు నెట్ సర్వీసులు కట్!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో మొబైల్ ఫోన్, మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులే కాకుండా ల్యాండ్లైన్ ఫోన్ సర్వీసులు కూడా గత వారం రోజులుగా నిలిచిపోయాయి. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వీటి సేవలు నిలిచి పోయిన విషయం తెల్సిందే. కశ్మీర్లో ఈ సేవలను నిలిపివేయడం మూడోసారో, 30వ సారో కాదు. 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 178 సార్లు నిలిపివేసినట్లు ఇంటర్నెట్ వాచ్డాగ్ ‘ఫ్రీడమ్ లా సెంటర్ (ఇండియా)’ ఓ నివేదిలో వెల్లడించింది. ఈసారి ల్యాండ్లైన్ సేవలను కూడా నిలిపివేయడం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. గత వారం రోజులుగా వార్తా పత్రికలు కూడా ప్రచురితం కాకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోంది. శాటిలైట్ డిషెస్ ఉన్న వాళ్లు మాత్రమే కశ్మీర్ గురించి జాతి జనులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని చూడగలిగారు. నేటి వరకు వాటిలో వస్తున్న టీవీ ఛానళ్ల ద్వారా వార్తలు తెలసుకోగలుగుతున్నారు. ప్రజా ఎమర్జెన్సీ, ప్రజా భద్రతను దష్టిలో పెట్టుకొని ‘టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికమ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ) రూల్స్ 2017’ కింద కమ్యూనికేషన్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. కశ్మీర్లో ల్యాండ్ ఫోన్ సర్వీసులనైతే ప్రభుత్వం అతి సులువుగా నిలిపివేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ అయిన ఒక్క బీఎస్ఎన్ఎల్ మాత్రమే కశ్మీర్లో ఈ సర్వీసులను నిర్వహిస్తోంది. అయినప్పటికీ 1971 నుంచి కశ్మీర్లో ల్యాండ్ లైన్ కమ్యూనికేషన్ సేవలను నిలిపివేయలేదని, ఇదే మొదటిసారని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. కనీసం కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా ఈ సేవలను నిలిపి వేయలేదట. అయితే హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాణి ఎన్కౌంటర్ జరిగినప్పుడు బారముల్లా, బండిపొర, కుప్వారా జిల్లాల్లో ల్యాండ్లైన్ సర్వీసులను నిలిపివేశారట. -
కశ్మీర్లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్ అంబానీ
ముంబై: జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రాంతాలలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని రిలయన్స్ సంస్థల అధినేత, సీఎండీ ముకేశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడి ప్రజలకు కావాల్సిన వాటిపై, చేయవల్సిన అభివృద్దిపై ఇప్పటికే స్సెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ టాస్క్ఫోర్స్ పలు విషయాలపై అధ్యయనం చేస్తుందన్నారు. అక్కడి ప్రజలకు అవసరమైన, కశ్మీర్ అభివృద్దికి కావాల్సిన పరిశ్రమలను రిలయన్స్ స్థాపిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్దిలో భాగం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో జమ్మూ, కశ్మీర్, లదాఖ్లలో రిలయన్స్ పెట్టుబడులకు సంబంధించిన మరిన్ని వార్తలను చూస్తారని ఈ సందర్భంగా అంబానీ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం తొలిసారి జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘మనమంతా కలిసి కొత్త జమ్మూకశ్మీర్, కొత్త లదాఖ్, కొత్త భారత దేశాన్ని నిర్మించి ప్రపంచానికి చూపిద్దాం. జమ్మూకశ్మీర్లో ఇక నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలు వస్తాయి, అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా సుందరమైన కశ్మీరంలో సినిమాలు తీయొచ్చు.. బాలీవుడ్, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలను ఇక్కడ వారి సినిమాలు చిత్రీకరించాలని కోరుతున్నా’అంటూ మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
ఖట్టర్ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో రాజకీయ నాయకులు అత్యుత్సాహంతో చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ.. విమర్శల పాలవుతున్నారు. ఈ క్రమంలో శనివారం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ‘ఇక మీదట అందమైన కశ్మీరీ యువతులను కోడళ్లుగా తెచ్చుకోవచ్చు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖట్టర్ వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని దీదీ సూచించారు. ఈ మేరకు దీదీ ట్విటర్లో ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలి. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేసి ఇతరులను బాధించకూడదు. కశ్మీరీ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది. మీ వ్యాఖ్యలు కేవలం కశ్మీరీ ప్రజలనే కాక యావత్ దేశ ప్రజలను బాధించాయి’ అంటూ మమతా ట్వీట్ చేశారు. We,and more so people holding high public office, must restrain ourselves from making insensitive comments about the beloved people of Jammu and Kashmir. These are hurtful, not only for J&K, but the entire nation — Mamata Banerjee (@MamataOfficial) August 10, 2019 'బేటీ బచావో, బేటీ పడావో' కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టారియా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమలుకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పారు. 1000 మంది బాలలకు 850 నుంచి 933 మంది బాలికలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. అప్పుడు బిహరీ యువతులను కోడళ్లుగా చేసుకునే వాళ్లం అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇక మీదట అందమైన కశ్మీరీ యువతులను కోడళ్లుగా చేసుకోవచ్చు అంటూ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
‘ఇలాంటి పొరుగువారు పగవాడికి కూడా వద్దు’
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. పాక్లో పని చేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించడం.. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటిని తెంచుకుంటున్నట్లు ప్రకటించడమే కాక నేడు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్ప్రెస్ను శాశ్వతంగా నిలిపివేసింది. పాక్ చర్యలపై కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి పొరుగువారు ఉండకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చర్యలపై రాజ్నాధ్ స్పందిస్తూ.. ‘మన పొరుగువారి వల్ల మనకు చాలా భయాలున్నాయి. మన స్నేహితుల్లో ఎవరైనా మనకు నచ్చకపోతే.. వారిని వదిలించుకోవచ్చు. అసలు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలో మనమే నిర్ణయించుకుంటాం. కానీ ఇరుగు పొరుగు విషయంలో ఇలాంటి అవకాశం ఉండదు. మన పొరుగు వారు ఎలాంటి వారైనా సరే చచ్చినట్లు భరించాల్సిన పరిస్థితి’ అంటూ రాజ్నాధ్ అసహనం వ్యక్తం చేశారు. ఎవరికి ఇలాంటి పొరుగువారు ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు రాజ్నాధ్ సింగ్. జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతామని పాక్ తెలిపింది. అంతేకాక తమ గగనతలాన్ని సెప్టెంబర్ 5 వరకు పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో తాము చైనాతోనూ సంప్రదింపులు జరుపుతామని పాక్ పేర్కొన్నది. -
చైనా అసంతృప్తి.. భారత్ కౌంటర్
బీజింగ్: లఢఖ్ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా విడదీయడం పట్ల చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధీటుగా స్పందించింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. భారత్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని.. అలానే ఆయా దేశాలు కూడా అలానే ప్రవర్తిస్తే మంచిదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై చైనా నేడు స్పందించింది. భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని చైనా హితవు పలికింది. అయితే ఈ అంశంలో చైనా సలహా అక్కర్లేదని భారత్ స్పష్టం చేసింది. అలానే భారత్ - చైనాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాలు ఆమోదయోగ్యమైన, మార్గదర్శమైన పరిష్కారం కోసం కృషి చేయాలని విదేశాంగ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్సభ ఆమోదం పొందింది. -
ఆర్టికల్ 370 రద్దు: మరో పుల్వామా దాడి
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై దాయాది దేశం పాక్ మరోసారి విషం చిమ్మింది. ఆర్టికల్ 370 రద్దు ప్రభావం త్వరలోనే ఉంటుందని.. రానున్న రోజుల్లో మరో పుల్వామా దాడి జరగవచ్చని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మంగళవారం పాకిస్తాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తూ.. మోదీ నిర్ణయం కశ్మీర్ ప్రజలను అణచి వేయలేదని పేర్కొన్నాడు. బీజేపీది జాత్యాంహకార భావజాలమని.. ముస్లింలను ఆ పార్టీ రెండో తరగతి ప్రజలుగానే పరిగణిస్తుందని వ్యాఖ్యానించాడు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం, మహ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని బలపరుస్తుందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. ‘భారతదేశం కేవలం హిందువులకే అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. అదెప్పుడూ ముస్లింలను రెండో తరగతి ప్రజలుగానే భావిస్తుంది. ఈ రోజు మొదటి సారి బీజేపీ భావజాలాన్ని ప్రపంచం కూడా చూసింది’ అన్నాడు ఇమ్రాన్. పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన కొందరు కశ్మీర్ నాయకులు.. నేడు జిన్నా రెండు దేశాల సిద్ధాంతం నిజమయ్యిందని బాధపడుతున్నారని పేర్కొన్నాడు. భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మానవులందరిని సమానంగా చూస్తుందని ఇమ్రాన్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. గతంలో జరిగిన పుల్వామా దాడికి, పాక్కు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఇమ్రాన్ స్పష్టం చేశాడు. అయితే బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలోనే మరో పుల్వామా దాడి జరగనుందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) సభ నుంచి వాకౌట్ చేశాయి. -
మీడియా ఎదుట ఫరూక్ భావోద్వేగం..!
శ్రీనగర్ : రాష్ట్రం తగులబడుతుంటే.. తాను ఇంట్లో ఎలా కూర్చుంటానని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్సభలో చర్చ కొనసాగుతుండగా ఫరూక్ సభలో లేకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అమిత్ షా తను కావాలనే ఇంట్లో కూర్చున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తనను గృహ నిర్భందం చేశారని.. తన కొడుకు ఒమర్ను కూడా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానిప్పుడు తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చానన్నారు ఫరూక్. రాష్ట్రం అల్లకల్లోలంగా మారిన సమయంలో ఇంట్లో ఎలా కూర్చుంటానని ప్రశ్నించారు. తనను, రాష్ట్ర ప్రజల్ని కాపాడలంటూ మీడియా ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేంద్ర నాయకులు ప్రాంతాలను విభజించారు. కానీ, హృదయాలను కూడా విభజిస్తారా. జనాలను కూడా హిందూ, ముస్లింలుగా విభజిస్తారా.ఈ దేశం లౌకికతను, ఐక్యతను విశ్వసిస్తుందని భావించాను. కానీ నేడు బీజేపీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించింది’అని వాపోయారు. -
‘ఫరూక్ను నిర్భందించలేదు’
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై లోక్సభలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షాలు ఫరూక్ అబ్దుల్లా గురించి ప్రశ్నించగా.. ఆయనను అరెస్ట్ చేయలేదు.. నిర్భందంలోకి కూడా తీసుకోలేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్కు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులను ఆదివారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమిత్ షా మంగళవారం సభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సులే.. ‘ఫరూక్ అబ్దుల్లా నా పక్కనే కూర్చునే వారు.. కానీ నేడు ఆయన సభకు హాజరుకాలేదు’ అని తెలిపారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ఫరూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయలేదు.. నిర్భందించలేదు. ఆయన కావాలనే ఇంట్లో ఉన్నారన్నా’రు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేదా అని సుప్రియా ప్రశ్నించగా.. నేను వైద్యుడిని కాదంటూ అమిత్ షా సమాధానమిచ్చారు. ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాలేదనే అంశాన్ని తొలుత డీఎంకే గుర్తించింది. ఆయన ఎక్కడున్నారని, ఆయనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఆ పార్టీ సభ్యుడు దయానిధి మారన్ స్పీకర్కు తెలిపారు. సభలోని సభ్యులను రక్షించే బాధ్యత స్పీకర్దే అన్నారు మారన్. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్థానిక నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, తదితర నేతలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
వైరలవుతోన్న అమిత్ షా ఫోటో
న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా ఆర్టికల్ 370 రద్దు గురించి ఎంత చర్చ జరిగిందో.. అదే స్థాయిలో ఓ ఫోటో గురించి కూడా చర్చ జరిగింది. ఇంతకూ ఆ ఫోటో ఎవరిదంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షాది. సాధరణంగా సెలబ్రిటీల ఫోటోలు, వెరైటీగా ఉన్న ఫోటోలు వైరల్ కావడం చూస్తుంటాం. కానీ ఈ రోజు అందుకు భిన్నంగా అమిత్ షా ఫోటో తెగ వైరలయ్యింది. నెట్టింట్లో ఈ ఫోటో గురించి ఒకటే చర్చ. ఆర్టికల్ 370 రద్దు గురించి సభలో ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు అమిత్ షా చేతిలో కొన్ని పత్రాలు పట్టుకుని ఉన్న ఫోటో ఇది. అయితే ఆ ఫోటోలో ఏముంది అన్న విషయం అందరిని ఆకర్షించింది. ఇంతకూ ఆ ఫోటోలో ఏం ఉందంటే.. ఆర్టికల్ 370 రద్దుకు సబంధించి రాజ్యాంగ పరంగా, రాజకీయంగా, న్యాయపరంగా ఏఏ సెక్షన్లను చేర్చాలి, వాటి వల్ల వచ్చే చిక్కులు.. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇలా పూర్తి సమాచారాన్ని ఈ పత్రాల్లో పొందుపరిచారు. అంతేకాకుండా రాష్ట్రపతికి ఈ సమాచారాన్ని చేరవేయడం, రాజ్యసభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జమ్మూకశ్మీర్కి హోం శాఖ కార్యదర్శిని పంపించడం లాంటి అంశాలు ‘మార్కర్’ తో గీసి మరీ ఉండటాన్ని మనం ఇందులో గమనించవచ్చు. ఈ పత్రాలను సభలోకి తీసుకెళ్లిన తర్వాత వీటి ఆధారంగానే ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్, లడఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం లాంటి సంచలనాత్మక నిర్ణయాలను అమిత్షా ప్రకటించారు. అంటే ముందే ఓ పద్ధతి ప్రకారం చక్కగా రాసుకొని, ఎలాంటి చిన్న తప్పు దొర్లకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుందని ఈ ఫోటో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. -
‘నేడు నిజంగానే కశ్మీర్ను కోల్పోయాం’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కృషి వల్ల కశ్మీర్ను సంపాదించుకోగలిగాం. కానీ నేడు దాన్ని శాశ్వతంగా కోల్పోయాం అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చర్యతో నేడు నిజంగానే కశ్మీర్ను కోల్పోయామన్నారు కపిల్ సిబల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో బిల్లు పాస్ అయ్యింది. కానీ బిల్లుపై బీజేపీ.. విపక్షాలతో, కశ్మీర్ నాయకులతో చర్చించలేదు. కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. సభలో కూడా బిల్లు గురించి చర్చించడానికి తగిన సమయం ఇవ్వలేదు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బిల్లుకు సంబంధించిన చర్చ ప్రారంభించారు. కానీ చర్చకు సిద్ధం కావడానికి ప్రతిపక్షాలకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. సంఖ్యా బలం మూలంగానే బీజేపీ ఇలా చేసింది’ అన్నారు కపిల్ సిబల్. అంతేకాక ఈ నిర్ణయం చారిత్రాత్మకమో, కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు కపిల్ సిబల్. చరిత్రలో ఏం జరిగింది.. చట్టంలో ఏం ఉందో మాట్లాడటానికి మనం ఇక్కడ లేమన్నారు కపిల్ సిబల్. ప్రజాస్వామిక దేశంలో మన పాత్ర ఏంటనే అంశాల గురించి ఈ రోజు మనం పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కపిల్ సిబల్. -
బీజేపీది ఏకపక్ష ధోరణి
సాక్షి, జగిత్యాల: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. భారతదేశానికి తలమానికంగా భావించే జమ్మూకశ్మీర్ ప్రత్యేక హక్కులను కాపాడేందుకు ఆనాడు ఆర్టికల్ 370, 35ఏని రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. జమ్మూకశ్మీర్ను భారత్ భూభాగంలో అంతర్భాగంగా కొనసాగించడానికి నాడు ఈ ప్రత్యేక హక్కులను కల్పించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ఉన్న సంఖ్యా బలాన్నిఆసరాగా చేసుకుని ఇలాంటి ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం విచారకరమన్నారు. ప్రతిపక్షాల ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం వల్ల భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఊహించలేమన్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలు, మన దేశంపై ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తుందనే అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాయన్నారు. -
‘ఇదో సాహసోపేత నిర్ణయం’
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా వర్ణించారు. ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ‘జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు. ఆర్టికల్ 370 రద్దు బీజేపీ ప్రధాన భావజాలాల్లో ఒకటి. జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంద’ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన అద్వాణీ అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్, లడఖ్లో శాంతి, సుఖ సంతోషాల స్థాపనలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని అద్వాణీ వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది: అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నగరంలో రేపటి వరకు హై అలర్ట్ కొనసాగుతుందని సిటీ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయడం లేదని వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు అందరూ అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలో దింపామని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్, పికెట్తో పాటు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సంఘనలు జరిగితే 100కు డయల్ చేయాలని, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నగరంలో సభలు, నిరసనలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న ఐదు జోన్ల పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. -
సభలు, ర్యాలీలకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మహేందర్రెడ్డి తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు. సభలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. -
‘చారిత్రక తప్పిదాన్ని సవరించారు’
న్యూఢిల్లీ: కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. చారిత్రక తప్పిదాన్ని నేడు సవరించారన్నారు. జమ్మూకశ్మీర్ విభజనపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చారిత్రక తప్పిదాన్ని సవరించిన ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాను అభినందిస్తున్నాను అన్నారు. ఇక మీదట మహోన్నత భారత్ దిశగా పయనించబోతున్నాం అంటూ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతమైన రోజు. జమ్మూకశ్మీర్ను భారత్లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయి. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడింది. జీవితంలో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా’ అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, 35ఏ రద్దు, జమ్మూకశ్మీర్ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. -
విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో చదువుతున్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో, రైల్వే, విమానయాన శాఖ అధికారులతో కిషన్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్లతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను క్షేమంగా స్వస్థలాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావులు ప్రతి క్షణం కిషన్ రెడ్డికి సహాయంగా ఉంటున్నారు. -
విద్యార్థుల కోసం 3 బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనగర్లోని తెలుగు విద్యార్థులను క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. కశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దాంతో ఎన్ఐటీ, కాలేజీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయిందని తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు మూడు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు అర్థరాత్రి వరకు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో విద్యార్థులు తమకు సాయం చేయలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ట్విట్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులను శ్రీనగర్ నుంచి తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని సంప్రదించాలని తెలిపారు. అక్కడి కార్యాలయానికి సంబంధించిన ఫోన్ నంబర్లు 011-2338 2041 లేదా +91 99682 99337 కేటీఆర్ ట్వీట్ చేశారు. Any student/parent wanting assistance, please call our Resident Commissioner Sri Vedantam Giri at 011-2338 2041 or on his mobile +91 99682 99337 at Telangana Bhavan, New Delhi — KTR (@KTRTRS) August 3, 2019 ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్మూకశ్మీర్ నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు రావడానికి బస్సులు ఏర్పాటు చేశారని.. అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కే జోషి తెలిపారు. నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్లో టచ్లో ఉన్నారని, వారు ఇప్పటికే శ్రీనగర్ నుండి జమ్మూకు రోడ్డు మార్గాన బయలుదేరారన్నారు. విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ ప్రకటించారు. -
త్యాగాలకు మా బిడ్డలంతా సిద్ధం
భోపాల్: దేశం కోసం తమ బిడ్డలందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు మధ్యప్రదేశ్లోని కుదవాల్ సిహోరా గ్రామస్థులు. పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఈ గ్రామానికి చెందిన 36 ఏళ్ల అశ్విన్ కచ్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలర్పించినందుకు తామెంతో గర్వపడుతున్నామని.. మిగతా బిడ్డలను కూడా సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు అశ్విన్ లాంటి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరెంతోమంది యువకులు సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు' అన్నారు. -
కథువాలో మరో కీలక పరిణామం
కథువా : దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కథువా ఉదంతంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కథువా ఎస్పీని మార్చేశారు. కథువా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ)గా ఉన్న సులేమాన్ చౌదరి స్థానంలో శ్రీధర్ పాటిల్ నియమించారు. దీంతో కొత్త కథువా ఎస్పీగా శ్రీధర్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కథువాలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం ఒడిగట్టిన వారికి మరణ శిక్ష విధించేందుకు ఆమోదిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ను సైతం తీసుకొచ్చింది. ఈ ఘటనలో స్థానిక పోలీసులదే కీలక పాత్ర కావడంతో, ఈ కేసును స్థానిక పోలీసులు విచారణ చేపట్టడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. దీంతో ఈ కేసును జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచు పోలీసులు ఈ కేసుపై ఛార్జ్షీటు కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీటులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్ను ఏ1గా పేర్కొన్నారు. సాంజీరామ్ మేనల్లుడు( మైనర్), మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వీరిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ప్రస్తుతం కథువా కేసు విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కొత్త ఎస్పీని నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. -
జమ్ముకశ్మీర్లో మళ్లీ అలజడి
-
సరిహద్దులో అలజడి; వరుస ఎన్కౌంటర్లు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మళ్లీ అలజడి. పాక్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్గావ్ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతం కాగా, ఇంకొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ వార్తలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
అధీనరేఖ రక్తసిక్తం
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా అధీనరేఖ వద్ద కొన్నాళ్లుగా మళ్లీ ఉద్రి క్తతలు పెరుగుతున్నాయి. అధీన రేఖ నిశ్శబ్ద రేఖగా ఎప్పుడూ లేదు. కానీ రెండు నెలలుగా అక్కడ చోటు చేసుకున్న ఉదంతాలు గమనిస్తే గత పదిహేనేళ్లలో ఇంత చేటు ఘర్షణలు ఎప్పుడూ లేవని అర్ధమవుతుంది. ఆదివారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత కెప్టెన్తోసహా నలుగురు జవాన్లు కన్నుమూశారు. అయిదురోజుల్లో ఇలా చనిపోయిన జవాన్ల సంఖ్య 9కి చేరుకుంది. ఇరువైపులా సైని కులతోపాటు సాధారణ పౌరులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎందరో క్షతగాత్రులవుతున్నారు. అధీనరేఖకు, అంతర్జాతీయ సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రామాల్లోని ఇళ్లు నిలువునా తూట్లు పడి కనబడుతున్నాయి. సాధారణ పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల కారణంగా అటు అధీన రేఖ వద్ద, ఇటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత నవంబర్ నుంచి 500 పాఠ శాలలు మూసేయవలసి వచ్చింది. గత సంవత్సరం అధీన రేఖ వద్ద పాకిస్తాన్ వైపు నుంచి 881 కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకోగా ఒక్క డిసెంబర్లోనే అవి 147 ఉన్నాయి. మొన్న జనవరి 1 నుంచి ఇంతవరకూ దాదాపు 240 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో ఈ ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య గత ఏడాది ఉదంతా లన్నిటా మరణించినవారి సంఖ్యతో సమానంగా ఉన్నదంటున్నారు. చాలా సంద ర్భాల్లో మన సైన్యం గట్టి జవాబిచ్చింది. పర్యవసానంగా అటువైపు కూడా ప్రాణ నష్టం ఉంటున్నది. తొలుత మీరు కాల్పులు జరిపారంటే మీరు జరిపారని పర స్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా సర్వసాధారణమైంది. ఇలాంటి ఉల్లంఘనలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవడానికి ఇరు దేశాల సైనిక డైరెక్టర్ జనరళ్ల(డీజీఎంఓ) మధ్యా హాట్లైన్ సదుపాయం ఉంది. ఈమధ్య కాలంలో ఒకటి రెండుసార్లు అలా మాట్లా డుకున్నారని అంటున్నారు. కానీ ఫలితం లేదు. 2016 సెప్టెంబర్లో మన సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడ చొరబాటుదార్ల కోసం నిర్మించిన శిబిరాలను ధ్వంసం చేసింది. అంతక్రితం ఉడీ సెక్టార్లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేసి బిహార్ బెటాలియన్కు చెందిన 19మంది జవాన్ల ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు జరిగాయి. అయితే అవి సైతం పాకిస్తాన్ను కట్టడి చేయలేకపోయాయని ఆ తర్వాత సాగుతున్న ఘర్షణల పరంపరను గమనిస్తే అర్ధమవుతుంది. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అయితే ఉల్లంఘనల సంఖ్య మొదట్లో చాలా స్వల్పంగా ఉండేది. కానీ 2013 దాటాక ఈ ఉదంతాలు క్రమేపీ పెరుగుతూ 2015 నాటికి మితిమీరాయి. వాటితోపాటే మరణాల సంఖ్య పెరు గుతోంది. ఇదంతా చొరబాటుదార్ల సమస్యతో మొదలవుతున్నదని మన నిపుణులు చెబుతున్నారు. లష్కరే తొయిబా, ఇతర సంస్థలకు చెందిన మిలిటెంట్లకు పాక్ సైన్యం మారణాయుధాలిచ్చి భారత్ గడ్డపై ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తూ అందులో భాగంగానే కాల్పులు జరుపుతున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉడీ సెక్టార్లో మన సైన్యానికి భారీ నష్టం కలగజేసిన లష్కరే మిలిటెంట్లు అలా ప్రవే శించినవారే. ఇరు దేశాల మధ్యా రెండుసార్లు పూర్తి స్థాయి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1999లో కార్గిల్లో చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని మన జవాన్లు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా దాదాపు మూడు నెలలు చిన్నపాటి యుద్ధం జరిగింది. యుద్ధ సమయాల్లో ప్రభుత్వం ముందుగానే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తుంది. అక్కడ జవాన్ల కదలికలు ముమ్మరమవుతాయి. యుద్ధం ముగిసిందన్న ప్రకటన వచ్చేవరకూ ఊరు వెళ్లడం క్షేమం కాదని అందరికీ తెలుస్తుంది. కానీ అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలది ఏడాది పొడవునా అయోమయ స్థితి. ఈ క్షణం అంతా సవ్యంగానే ఉన్నదని పిస్తుంది. మరుక్షణంలో సరిహద్దుల ఆవలి నుంచి శతఘ్నులు, మోర్టార్లు గర్జిస్తాయి. అవి ఎప్పుడు శాంతిస్తాయో తెలియదు. పొలం పనికెళ్లినవారో, బడి నుంచి తిరిగొస్తున్న పిల్లలో, ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళో వాటి బారిన పడతారు. ప్రాణాలైనా పోవచ్చు. తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యమూ రావొచ్చు. చావు బతుకుల మధ్య ఉండే సన్నటి సరిహద్దు రేఖ అక్కడ చెదిరిపోతుంది. చిత్రమేమంటే ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలూ, వాటిననుసరించి ఉండే పరస్పర హెచ్చ రికలు, వాటికి కొనసాగింపుగా ఆరోపణల యుద్ధం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నా రెండు దేశాల మధ్యా వాణిజ్య లావాదేవీలు ఆగవు. అలా ఆపి రోజూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నష్టపోవడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉండవు. అయితే ఇరు దేశాల మధ్యా సామరస్య వాతావరణం ఏర్పడితే ఈ వాణిజ్యం మరిన్ని వందల రెట్లు పెరుగుతుందని, అది రెండు ఆర్థిక వ్యవస్థలనూ బలోపేతం చేస్తుందని పాకిస్తాన్ సైన్యం గుర్తించదు. రెండు దేశాల డీజీఎంఓల మధ్యా హాట్లైన్ సదుపాయం ఉన్నమాట నిజమే అయినా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడటం లేదు. సమస్యకు మూలంగానీ, దానికి పరిష్కారంగానీ అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. ఇరు దేశాల మధ్యా ఉన్నత స్థాయి చర్చలు జరగడం, అంతర్జాతీయ వేదికల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిళ్లు తీసుకురావడం ముఖ్యం. అలాగే కశ్మీర్లో ప్రశాంతత నెలకొనడానికి రాజకీయ పరమైన చర్యలు కూడా ప్రారంభించాలి. అక్కడ ప్రశాంతత నెలకొంటే సరిహద్దుల్లో పాక్ ఆటలు సాగవు. ఇప్పుడు అధీనరేఖ వద్ద దాదాపు యుద్ధ వాతావరణం నెల కొంది. దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడమన్నది తన చేతుల్లోనే ఉన్నదని పాక్ నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. -
సైనికులతో ప్రధాని దీపావళి ధమాకా
-
సంచలనం: పోలీస్ Vs ఆర్మీ
శ్రీనగర్: కల్లోల కశ్మీర్లో కలిసి పనిచేయాల్సిన సైనికులు, పోలీసులు కొట్లాటకు దిగడం సంచలనంగా మారింది. నిషేధిత సమయంలో, అదికూడా సివిల్ డ్రెస్లో ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్లను అడ్డుకున్న పాపానికి పోలీసులపై దాడి జరిగింది. జమ్ముకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. అమర్నాథ్ యాత్ర డ్యూటీ ముగించుకున్న కొందరు ఆర్మీ జవాన్లు బల్తాల్ బేస్ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో గుండ్వైపునకు ప్రయాణమయ్యారు. సోనామార్గ్ చెక్పోస్ట్ వద్ద కాపలా ఉన్న జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆర్మీ జవాన్లు వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సమీపంలోని గుండ్ పోలీస్ స్టేషన్కు సమాచారం చేరవేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఉంచి, ఎట్టకేలకు ఆర్మీ జవాన్ల వాహనాలు ఆపేశారు. దీంతో ఆగ్రహించిన జవాన్లు.. ‘ఆర్మీవాళ్లనే అడ్డుకుంటారా?’ అంటూ పోలీసులతో వాదనకు దిగారు. గుండ్పోలీస్ స్టేషన్కు సమీపంలోని ఆర్మీ క్యాంపు నుంచి మరికొంత మంది జవాన్లను పిలిపించారు. అందరూ కలిసి పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. స్టేషన్లోకి చొరబడి, సామాగ్రిని, రికార్డులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అధికారుల పాట్లు.. నేతల ట్వీట్లు కాగా, పోలీసులపై ఆర్మీ జవాన్ల దాడి ఘటనను చిన్నదిగా చూపేందుకు అటు ఆర్మీ, పోలీసు వర్గాలు ప్రయత్నించాయి. కానీ దెబ్బలు తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల ఫొటోలు మీడియాలో ప్రసారం కావడంతో చర్యలకు ఉపక్రమించాయి. దాడికి పాల్పడిన ఆర్మీ జవాన్లపై కేసు నమోదు చేశామని, సైనిక పరంగానూ వారిపై విచారణకు ఆదేశాలు జరీ అయ్యాయని జమ్ముకశ్మీర్ ఐజీ మునీర్ అహ్మద్ ఖాన్ మీడియాకు తెలిపారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు. రాష్ట్రపోలీసులపై ఆర్మీ దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ట్వీట్ చేశారు. -
సమయం లేదు మిత్రమా.. స్వీట్ వార్నింగ్!
శ్రీనగర్: నేలతల్లి ఇంటికి మంచుమామ విచ్చేశాడు. భారీగా హిమపాతం కురిపిస్తూ ఉత్తరభారతాన్ని గిలిగింతలు పెట్టాడు. అసలే అందంగా ఉండే కశ్మీర్ను ఇంకాస్త రసవత్తరంగా మార్చేశాడు. ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ ధవళవర్ణంలో మెరిపోతూ కనిపించాడు. ఈ శీతాకాలపు అతిథి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అక్కడ కొలువైఉంటాడు. తన మ్యాజిక్ కరిగిపోయి నీరులా మారకముందే చూడటానికి రమ్మంటూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాడు.‘సమయంలేదు మిత్రమా..’ అంటూ ‘స్వీట్ వార్నింగ్’ ఇస్తున్నాడు. మధ్యధరా ప్రాంతంలో ఆవిర్భవించి, వాయువ్య దిశగా కదులుతూ హిమాలయాల వద్ద మంచు వర్షాన్ని కురిపించే Western Disturbance(పశ్చిమ కలవరాలు) జనవరి 3 నుంచి ఉత్తరభారతంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. జమ్ముకశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా హిమం, వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ఇళ్లు, చెట్లు, రోడ్లు, వాహనాలు.. అన్నింటిపైనా ఇంచులకొద్దీ మంచు పేరుకుపోయింది. ఆ దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు. రాగల 24 గంటలూ హిమపాతం కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఛండీగఢ్) అధికారి మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. (మంచుదుప్పటిలో ఉత్తరభారతం: ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంచుదుప్పట్లో ఉత్తరభారతం
-
కశ్మీర్పై అమెరికాకు పాక్ హెచ్చరికలు!
వాషింగ్టన్: కశ్మీర్ విషయంలో తమ వాదనను అమెరికా అంగీకరించకపోవడంతో బిత్తరపోయిన పాకిస్థాన్ రాయబారులు ఏకంగా ఆ దేశానికి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాదని పేర్కొన్నారు. భారత్, కశ్మీర్ విషయంలో తమ వాదనను పట్టించుకోకపోతే తాము రష్యా, చైనాకు దగ్గరవుతామని అమెరికాను హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కశ్మీర్పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాయబారి ముషాహిద్ హుస్సేన్ సయెద్ ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రధాన మేధోసంస్థ అయిన అట్లాంటిక్ కౌన్సిల్లో సంప్రదింపులు ముగిసిన వెంటనే.. 'అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాదు. దాని ప్రపంచాధిపత్యం తగ్గిపోతున్నది. దాని గురించి మరిచిపోదాం' అంటూ ఆయన పేర్కొన్నారు. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, ఈ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తెచ్చేందుకు పాక్ ప్రధాని షరీఫ్ రాయబారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాకు తన వాదన వినిపించి మద్దతు పొందేందుకు షరీఫ్ రాయబారులు హుస్సేన్ సయెద్, షాజ్రా మన్సద్ ఇక్కడికి వచ్చారు. అయితే, ఉగ్రవాదం విషయంలో అమెరికా పాకిస్థాన్కు ఘాటు సందేశం ఇవ్వడంతో ఇరుకునపడ్డ ఈ రాయబారాలు ఇలా తమనోటికి పనిచెప్పారు. కశ్మీర్ విషయమై 90 నిమిషాల పాటు అమెరికా ప్రతినిధులకు సయెద్ వివరించారు. ఆయన డొల్లవాదనకు సంఘీభావం లభించకపోవడంతో చికాకుపడ్డ సయెద్.. అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీచేశారు. ఇవి అధికారికంగా కెమెరాలో రికార్డు కాకపోయినా.. ఆహూతులకు స్పష్టంగా వినిపించాయి. -
బడికైనా, గుడికైనా.. ఇలాగే వెళ్తారు!
ఇటు జమ్ము-పూంచ్ హైవే.. అటు చాక్లీ, ఖర్దిను, అప్పర్ పోథా గ్రామాలు. మధ్యలో రాజౌరి ప్రధాన నది. ఈ మూడు గ్రామాల వాసులు బయట ప్రపంచానికి అనుసంధానం కావాలంటే ఈ రాజౌరీ నదిని దాటాలి. కానీ ఈ నదిపై అధికారులు ఎలాంటి వంతెన నిర్మించలేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి.. సొంతంగా తయారుచేసుకున్న పడవల్లో ఇలా నదిని దాటుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాలన్నా.. ఆపత్కాలంలో ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. ఇలాంటి ప్రమాదకరమైన పడవలే వారికి దిక్కు. అయినా అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మించడానికి తలపెట్టింది. కానీ నత్తనడకన సాగుతోంది. అది ఎప్పుడూ పూర్తవుతుందో దేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇలా సొంతంగా నిర్మించుకున్న పడవల్లో నదిని దాటి బయటి ప్రపంచానికి అనుసంధానం అవుతున్నామని చాక్లీ గ్రామ ప్రజలు చెప్తున్నారు. -
జార్ఖండ్, కశ్మీర్లకు బీజేపీ పరిశీలకులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు బీజేపీ పరిశీలకులను పంపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలను ఎన్నుకోనున్నారు. జమ్మూకశ్మీర్, జార్ఖండ్లకు ఇద్దరు చొప్పున పరిశీలకులను పంపాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. జమ్మూకశ్మీర్కు అరుణ్ జైట్లీ, అరుణ్ సింగ్.. జార్ఖండ్కు జేపీ నద్దా వినయ్ సమస్త్రబుధేలను పరిశీలకులుగా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జార్ఖండ్లో మెజార్టీ సాధించగా, జమ్మూకశ్మీర్లో రెండో అతిపెద్ద పార్టీగా కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే.