senior assistant
-
సెలవులో తహశీల్దార్.. ఆఫీసులో నిద్రపోయిన సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు
లావేరు: లావేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బుధవారం విధి నిర్వహణలో నిద్రపోవడం విమర్శలకు తావిచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చారు. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజు కార్యాలయంలో, జూనియర్ అసిస్టెంట్ రాజేష్ కార్యాలయం బయట కుర్చీల్లో నిద్రపోతున్నారు. అటెండర్ బాబూరావు షర్టు విప్పి అర్ధనగ్నంగా కనిపించారు. సెల్ఫోన్ ద్వారా వీరి ఫొటోలు తీసినా లేవలేదు. మద్యం మత్తులో ఉండటం వల్లే లేవలేదని విలేకర్లకు సమాచారం అందించారు. ఈ విషయమై సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజులు వివరణ కోరగా ఎండ తీవ్రత, అనారోగ్య సమస్య వల్ల విశ్రాంతి తీసుకున్నానని, మద్యం సేవించలేదని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో రాలేదు. పరిశీలిస్తా.. ఈ విషయమై లావేరు తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. తాను సెలవులో ఉన్నట్లు చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ వేరే పనుల కోసం బయటకు వెళ్లారని తెలిపారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విధుల సమయంలో కార్యాలయంలోనే నిద్రపోయారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
సర్టిఫికెట్ కోసం వస్తే.. చాక్లెట్, గ్రీన్ ఇంక్ పెన్ను.. చివరకు గదిలోకి రమ్మని..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ మంగళవారం సర్వీస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాలు.. చిత్తూరుకు చెందిన ఓ మహిళ జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్ కేంద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వహించింది. ఇటీవల డీసీహెచ్ఎస్ పరిధిలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడంతో సర్వీస్ సర్టిఫికేట్ కోసం అధికారులను ఆశ్రయించింది. సీనియర్ అసిస్టెంట్ కల్పించుకుని తొలుత ఆ మహిళను చాక్లెట్ తీసుకురావాలని కోరాడు. ఆ తర్వాత గ్రీన్ఇంక్ పెన్ను అడిగాడు. ఆపై పక్కగదిలోకి రమ్మని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేశాడు. బయటకు వచ్చిన మహిళ దరఖాస్తు ఫారాన్ని అక్కడే చింపేసి విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వారు హుటహుటిన ఆస్పత్రికి చేరకుని సీనియర్ అసిస్టెంట్ను చితకబాదారు. కాళ్లవేళ్ల పడి బతిమలాడడంతో వదిలిపెట్టారు. జరిగిన విషయాన్ని సూపరింటెండెంట్ అరుణ్కుమార్కు వివరించడంతో అక్కడే సర్దుబాటు చేశారు. చదవండి: (సాధారణ టికెట్తోనే రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణం) -
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్ఆర్టీవీయూ), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)ల్లో కొలువుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ).. ఆయా వర్సిటీల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా పూర్తి సమాచారం... ► మొత్తం పోస్టుల సంఖ్య: 127 ► పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్(పీవీన్ఆర్టీవీయూ): 15; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీవీన్ఆర్టీవీయూ): 10; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీజేటీఎస్ఏయూ): 102. అర్హతలు ► డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్/బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్/కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్(లోయర్ గ్రేడ్)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ► జూలై 1, 2021 నాటికి 18–34 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది. వేతనం ► సీనియర్ అసిస్టెంట్: రూ.22,460–రూ.66,330 ► జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపింగ్: 16,400–రూ.49,870 పరీక్ష విధానం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కొలువులకు సంబంధించి పరీక్ష విధానం కింది విధంగా ఉంటుంది. ప్రశ్నప్రతం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లోని సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో, కంప్యూటర్ అప్లికేషన్ విభాగం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. సిలబస్ ఇలా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ► కరెంట్ అఫైర్స్–రీజనల్ నేషనల్ ఇంపార్టెన్స్. ► అంతర్జాతీయ సంఘటనలు, సమావేశాలు. ► జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ ఘనత. ► పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ. ► భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు. ► భారత భౌగోళిక శాస్త్రం(తెలంగాణ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యత). ► తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. ► తెలంగాణ రాష్ట్ర విధానాలు. ► ఆధునిక భారతదేశ చరిత్ర(భారత స్వాతంత్రోద్యమం ప్రాధాన్యం). ► తెలంగాణ చరిత్ర(తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై ప్రత్యేక దృష్టి). ► ప్రాథమిక ఇంగ్లిష్ (పదోతరగతి స్థాయి). సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్–డిప్లొమా స్టాండర్డ్ ► మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్). ► లాజికల్ రీజనింగ్. ► కాంప్రహెన్షన్ అండ్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ► న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. ► బేసిక్ కంప్యూటర్స్. ► మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్: ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. ► ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్. ► బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. ముఖ్యసమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2021 ► దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులకు రూ.80. ► వెబ్సైట్: https://www.tspsc.gov.in/index.jsp -
కాంట్రాక్ట్ ఉద్యోగిని పై దాడి
-
అవినీతి రోగం కుదిరింది!
పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్సీలో యూడీసీ (సీనియర్ అసిస్టెంట్) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్కుమార్, యూడీసీ శోభారాణి తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్ఎంలు యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ డిమాండ్ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్ఎంల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు, లీవ్లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్కమల్, సీఐ ప్రేమ్కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు. -
ఆరోగ్యశాఖలో సిబ్బందిపై లైంగిక వేధింపులు...!
వైద్య ఆరోగ్యశాఖలో ఆయనో సాధారణ సీనియర్ అసిస్టెంట్. కానీ కార్యాలయంలో ఆయన చెప్పిందే వేదం. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు దండుకోవడం మొదలు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల దాకా ఆయన అకృత్యాలు ఎన్నో. బాధితులు నేరుగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో సదరు అధికారి అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అనంతపురం న్యూసిటీ: వైద్య ఆరోగ్యశాఖలో అక్రమార్కులకు అడ్డూ అదపు లేకుండా పోతోంది. ఇటీవల ఓ కీలక అధికారిపై అవినీతి ఆరోపణలు వెలుగు చూడగా...తాజాగా ఆరోగ్యశాఖలో ఓ సీనియర్ అసిస్టెంట్పై భారీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సాధారణ సీనియర్ అసిస్టెంట్ అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తడంపై ఆరోగ్యశాఖలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. ఉద్యోగ నియామకాల్లో జోక్యంతో పాటు అమ్మాయిల అవసరాన్ని ఆసరగాతీసుకుని లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు అధికారి చాలా కాలంగా ఒకే సీటులో తిష్టవేసి వసూళ్లు పర్వం నడిపించాడు. సదరు అధికారి వ్యవహారాలపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిటీ వెల్ఫేర్కు కొందరు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నోటిఫికేషన్ పడితే పండగే ఆరోగ్యశాఖలో ఏదైనా నోటిఫికేషన్ వెలువడితే సదరు సీనియర్ అసిస్టెంట్ వెంటనే రంగంలోకి దిగుతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ముందుగానే తెలుసుకుని వారికి ఫోన్ చేసి మీకు పక్కాగా జాబ్ ఇప్పిస్తామని ట్రాప్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ విధంగా వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల తీసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. 2010లో సెకెండ్ ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీలో భారీగా సొమ్ము చేసుకున్నట్లు తెల్సింది. కొంతమందికి ఉద్యోగాలిప్పిస్తామని మాయమాటలు చెప్పి వారిని తిప్పించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. లైంగిక ఆరోపణలెన్నో ♦ 2010–11లో ఆరోగ్యశాఖలో ఓ చిరు ఉద్యోగి జీవితంతో సదరు సీనియర్ అసిస్టెంట్ ఆడుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల పాటు లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోస్టు రెగ్యులర్ చేయిస్తానని చెప్పి ఓ కీలక అధికారి దగ్గరికి వెళ్లాలని చెప్పగా... సదరు ఉద్యోగి నిరాకరించి, తనకు ఆ పోస్టు అవసరం లేదని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ ఇంత నీచానికి ఒడిగడతావా అంటూ సదరు చిరు ఉద్యోగి తండ్రి సీనియర్ అసిస్టెంట్కు చీవాట్లు పెట్టినట్లు ఆరోగ్యశాఖలోని సిబ్బందే చర్చించుకుంటున్నారు. ♦ ఇక సెకెండ్ ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ ఇతని వికృత చేష్టలకు ఏకంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు ఫిర్యాద చేశారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతల రాజకీయ అండదండలతో ఆ ఫిర్యాదులను తొక్కిపెట్టారు. ఇలాంటి కేసులు లెక్కలేనన్ని ఉన్నాయని ఆరోగ్యశాఖ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంధం చంద్రడు ఆరోగ్యశాఖలో అక్రమార్కులపై నిఘా ఉంచితో అవినీతిని అరికట్టడంతో పాటు మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. సాధారణ ఉద్యోగి..రూ.కోట్లలో ఆస్తులు ♦ ఓ సాధారణ సీనియర్ అసిస్టెంట్ అక్రమార్జనకు అడ్డు లేకుండా పోయింది. డైరెక్టర్కు ఫిర్యాదు చేసిన లేఖలో ఇతని అక్రమాస్తుల చిట్టాను ఇలా ఉంది. ♦ అనంతపురం నాయక్నగర్లో రూ.1.50 కోట్లతో 10 సెంట్లలో స్థలం కొనుగోలు. ♦ తన భార్య, బావమరది పేరిట జిల్లాలోని గోరంట్లలో 10 ఎకరాల స్థలం కొనుగోలు. ♦ బెంగళూరులో ఓ షాపు, నగరంలోని వినాయకనగర్లో రూ కోట్లు విలువ చేసే మూడు అంతస్తుల్లో భవనం. ♦ ఇలా మొత్తం రూ.25 కోట్ల వరకు ఈయన అక్రమార్జన ఉన్నట్లు తెలుస్తోంది. -
అక్రమార్జనలో ‘సీనియర్’
సాక్షి, కర్నూలు : ఆయన రూటే సప‘రేటు’. ఆలోచనే భారీ ‘రేటు’. ఎక్కడ చేయి చాపినా కాసుల పంట పండాల్సిందే. ఏ ఫైలు ముట్టుకున్నా ‘ఆదాయం’ కళ్ల జూడాల్సిందే. లేదంటే ఆయన మనసొప్పదు. ఎవరి ఫైళ్లు అయినా నిలబెట్టేస్తాడు. తనను రహస్యంగా కలవాలని ఆదేశిస్తాడు. అడిగినంత సమర్పించుకుంటేనే పని అవుతుంది. లేదంటే అంతే సంగతి! ప్రస్తుతం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నరాల సంజీవరెడ్డి తీరిది. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు సెర్చ్ వారెంట్తో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సీఐలు శ్రీధర్, గౌతమి, తేజేశ్వరరావు తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి సంజీవరెడ్డి నివాసముంటున్న కర్నూలు ధనలక్ష్మి నగర్తో పాటు అత్తమామల స్వగ్రామమైన వెలుగోడు మండలం మోతుకూరులో ఏకకాలంలో సోదాలు చేశారు. నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు పది చోట్ల స్థలాలు, రెండు చోట్ల బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు...ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నకొద్దీ ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల తలుపులు మూసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా దొరికిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దస్తావేజుల ప్రకారం దాదాపు రూ.రెండు కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేసుకున్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.5 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సంజీవరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. కేసు పరిశోధన కొనసాగుతోందని డీఎస్పీ నాగభూషణం వెల్లడించారు. సంజీవరెడ్డి ఉద్యోగ జీవితానికి సంబంధించి లోతుగా చూస్తే అనేక చీకటి కోణాలు కన్పిస్తున్నాయి. విధుల్లో చేరినప్పటి నుంచే.. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి సంజీవరెడ్డి స్వగ్రామం. తండ్రి నరాల స్వామిరెడ్డి కొత్తపల్లి మండలం లింగాపురం గ్రామ మునసబ్æగా పనిచేస్తూ మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద సంజీవరెడ్డికి 1997లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఆత్మకూరు మండలం వెంకటాపురం, జూపాడుబంగ్లా మండలం తూడిచర్ల గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ)గా పనిచేశారు. అప్పటినుంచే అక్రమార్జనే పరమావధిగా అడుగులేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి వరకు చదువుకున్న ఈయన ఉద్యోగంలో పదోన్నతి కోసం ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2002లో పదోన్నతి పొంది.. 2011 వరకు వీఆర్వోగా కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఆత్మకూరు మండలాల్లో విధులు నిర్వర్తించారు. 2011లో జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది కలెక్టరేట్లో కొంత కాలం పనిచేశారు. అలాగే 2012లో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది కలెక్టరేట్లోనే పనిచేశారు. ఆ తర్వాత కర్నూలు ఆర్ఐగా మూడేళ్ల పాటు, కల్లూరు ఆర్ఐగా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. ఈ çసమయంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే వ్యాపారులతో కుమ్మకై భారీగా సొమ్ము చేసుకున్నట్లు విమర్శలున్నాయి. అక్రమ ఆదాయం విషయంలో అప్పటి కర్నూలు వీఆర్వో శ్రీనివాసరెడ్డితో విభేదాలు తలెత్తి.. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కొత్తపల్లిలో 15 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని చట్టబద్ధం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆస్తులపైనే వెచ్చింపు.. సంజీవరెడ్డి అక్రమార్జన సొమ్మును భూములు, ఇళ్లపైనే వెచ్చించినట్లు తెలుస్తోంది. కర్నూలుతో పాటు స్వస్థలం కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు, ఇంటిస్థలాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ సోదాల్లో లభించిన పత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఏసీబీ అధికారులు గుర్తించిన సంజీవరెడ్డి ఆస్తుల చిట్టా ⇒ కర్నూలు నగరం ధనలక్ష్మినగర్లో 5.5సెంట్ల విస్తీర్ణంలో అధునాతన జీ ప్లస్2 భవనం. సమీపంలోనే భార్య పేరుతో 5.50 సెంట్ల ఇంటి స్థలం. ⇒ 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు, కర్నూలు మండలం పసుపలగ్రామంలో 5సెంట్ల ఇంటి స్థలం, మండల కేంద్రం కొత్తపల్లిలో రెండు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటిస్థలానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి పరుల ఆట కట్టిస్తాం లంచం తీసుకునే, ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకునే ఏ ఒక్కరినీ వదలబోం. అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మావంతు ముందడుగు ఉంటుంది. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధైర్యంగా సమాచారం ఇచ్చినçప్పుడే అవినీతిపరులకు కళ్లెం వేయగలం. లంచం తీసుకునేందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా భయపడే పరిస్థితులు రావాలి. ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుంది. – ఏసీబీ డీఎస్పీ నాగభూషణం -
కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి.. ఆపై
సాక్షి, భీమవరం : కామాంధుడి మాయమాటలకు ఓ యువతి మోసపోయింది. నమ్మి వెంటవెళ్లినందుకు లైంగిక దాడికి గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. నర్సాపురంలోని ఐడియా షోరూంలో పనిచేసే యువతి (19)కి స్థానికంగా నివాసముండే డేగల రాంబాబు పరిచయమయ్యాడు. ఓ ముఖ్యమైన పనుందని చెప్పి గత ఆగస్టులో భీమవరంలోని మౌనిక నివాసానికి తీసుకెళ్లాడు. యువతికి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా వీడియో తీసి యువతిని గత కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి భీమవరం పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేసింది. రాంబాబు సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అతని సొంతూరు ఏనుగువాని లంక అని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. -
మేడ్చల్: సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
విద్యాశాఖలో గంజాయి మొక్క!
కొత్తగూడెం: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే, విద్యాబుద్ధులు నేర్పే పవిత్రబాధ్యతల విభాగంగా కీర్తించుకునే విద్యాశాఖలో గంజాయి మొక్క మాదిరిగా కొత్తగూడెంలో ఓ ఉద్యోగి వ్యవహరించాడు. సాక్షాత్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న కట్టగురు సైదులు రూ.25వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు. పాల్వంచకు చెందిన శ్రీలక్ష్మీ చిల్డ్రన్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు 2015–16కు ముగియడంతో..పునరుద్ధరించాలని యజమాని బతుత్లు ఆంథోని డిసౌజ జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి స్థాయి డీఈఓ లేకపోవడంతో.. ఆ ఫైల్ సీనియర్ అసిస్టెంట్ కట్టగురు సైదులు వద్దకు రాగా..ఐదేళ్లు రెన్యువల్ చేసేందుకు రూ. 25వేలు లంచం డిమాండ్ చేశాడు. కేవలం 30 మంది విద్యార్థులే ఉన్నారని, అంత ఇచ్చుకోలేనని అనడంతో ఏడాదిగా తిప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు. విసిగిపోయిన బాధితుడు..ఏసీబీ ఖమ్మం, వరంగల్ డీఎస్పీ బీవీ.సత్యనారాయణను ఆశ్రయించాడు. ఆయన సూచన ల మేరకు..సైదులుకు పాఠశాల యజమాని ఫోన్ చేసి డబ్బు ఇచ్చేందుకు అంగీకరించగా డీఈఓ ఆఫీస్ మార్గం లోని ఆలయం వద్దకు రమ్మనడంతో అక్కడ డబ్బు ముట్టజెప్తుండగా ఉదయం 11గంటల సమయంలో రెడ్ హ్యాం డెడ్గా పట్టుకున్నారు. అనంతరం డీఈఓ ఆఫీస్కు తరలించి..విచారించారు. కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బీవీ.సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 94404 46146 సెల్నంబర్కు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రతి పనికో రేటు.. ఖమ్మం జిల్లా డీఈఓనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ ఉండని కారణంగా పర్యవేక్షణ కొరవడింది. సీనియర్ అసిస్టెంట్ కట్టగురు సైదులు..లంచం తీసుకుంటూ పట్టుబడడంతో విద్యాశాఖ కార్యాలయంలో లొసుగులపై చర్చ జరుగుతోంది. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడం నుంచి మొదలు..ప్రతి పనికీ ఇక్కడ ఓ రేటు మాట్లాడుకుంటారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్కు, ప్రైవేట్ పాఠశాలల పనులకు కచ్చితంగా డబ్బు చెల్లించుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. కస్తూర్బా పాఠశాలల బిల్లుల మంజూరులోనూ అంతోఇంతో ఇచ్చుకోవాల్సిందేనట. అవినీతి మరకలు పడడం బాధాకరమని, ఇకపై ఇలా జరగకుండా, పద్ధతిగా వ్యవహరించుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామాచారి, ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించారు. ఇటు కార్యాలయ పాలన గాడిలో పెట్టాలన్నా, అటు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెరగాలన్నా పూర్తిస్థాయి డీఈఓ నియామకం చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ డీఈఓ
-
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ డీఈఓ
ఒంగోలు: ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.30 వేల లంచం తీసుకుంటూ జిల్లా విద్యాశాధికారి (డీఈఓ) సూర్యప్రకాశ్ తమ తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని ఏసీబీ అధికారులు తెలిపారు. చీరాలకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలకు అనుమతి ఇచ్చేందుకు డీఈఓ కొంతమేర డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు వారు కూడా అంగీకరించారు. డీఈవో సూర్యప్రకాశ్, సీనియర్ అసిస్టెంట్ రమణ నేడు వారి వద్ద నుంచి రూ.30వేలు తీసుకుంటుండగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో ’వాణిజ్య శాఖ’ జలగలు
లంచం తీసుకుంటూ చిక్కిన ఏసీటీవో, సీనియర్ అసిస్టెంట్ ఏలూరు అర్బన్: ఏసీబీ అధికారుల వలకు ఏలూరు ఏసీటీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు చిక్కారు. బాధితుల ఫిర్యాదు మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ఎన్ఆర్పేటలోని వాణిజ్యపన్నుల విభాగంలో ప్రత్యేక ఏసీటీవోగా పనిచేస్తున్న ఎండీ మస్తాన్, అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జీవీవీ ఫణికుమార్ ఈనెల 14న హనుమాన్ జంక్షన్ సమీపంలోని చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి భీమవరం వెళుతున్న మూడు తవుడు లారీలను ఆపారు. రికార్డులు పరిశీలించి తవుడు అక్రమంగా తరలిస్తున్నారంటూ లారీల యజమాని (లక్ష్మీ గణపతి లారీ ట్రాన్స్పోర్ట్, గుడివాడ) యార్లగడ్డ సతీష్ని రూ.1.50 లక్షలు అపరాధ రుసుం చెల్లించాలని బెదిరించారు. తాము చేపల మేత కోసం తవుడు తరలిస్తున్నామని, దీనికి ఎలాంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదని సతీష్ చెప్పినా వినిపించుకోలేదు. ఇతర వ్యాపార అవసరాలకోసం తవుడు తరలిస్తున్నారని కేసు పెడతామని సతీష్ను బెదిరించారు. రూ.60 వేలు లంచం ఇస్తే కేసు లేకుండా చేస్తామని డిమాండ్ చేసి చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నోట్ల రద్దు కారణంగా అంత సొమ్ము తన వద్దలేదని కొంత గడువు కావాలని సతీష్ వారిని కోరాడు. గడువు ఇచ్చిన ఏసీటీవో మస్తాన్ హామీగా సతీష్ నుంచి రూ.40 వేలకు చెక్ తీసుకున్నారు. దీంతో సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో వలపన్నిన అ«ధికారులు గడువు మేరకు శుక్రవారం సతీష్కు రూ.40 వేల విలువైన కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చి ఏలూరు ఏసీటీవో కార్యాలయానికి పంపారు. ఏసీటీవో మస్తాన్, సీనియర్ అసిస్టెంట్ ఫణికుమార్ వాహన యజమాని సతీష్ నుంచి లంచం తీసుకుంటూండగా డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ యు.విల్సన్ దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మస్తాన్, ఫణికుమార్ను ఏసీబీ కోర్టుకు తరలించారు. -
సీనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
అల్వాల్: ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ జరిగింది. ఎస్ఐ మధుసూదరెడ్డి కథనం ప్రకారం... ఓల్డ్ అల్వాల్ వాసవినగర్ నివాసి జి.భాస్కర్రెడ్డి (53) తొగుట ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్. భార్య పుష్ప, ఇద్దరు పిల్లలున్నారు. భార్య సిద్దిపేటకు వెళ్లి శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి భాస్కర్రెడ్డి బెడ్రూంలోని ఉరేసుకొన్నాడు. ఇతని బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఊడిన ఉద్యోగం
సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ణయం సీనియర్ అసిస్టెంట్ను తొలగిస్తూ ఉత్తర్వులు హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ అసిస్టెంట్ బి.లక్ష్మి అన్నపూర్ణను తొలగిస్తూ జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.విజయ్గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. చిట్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న లక్ష్మి అన్నపూర్ణ తప్పు డు ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొం దినట్లు నిర్ధారణ కావడంతో సీఈఓ ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ–డీకి చెందిన బి.లక్ష్మి అన్నపూర్ణ దళితుడైన బి.బాబును వివాహం చేసుకుంది. ఉపాద్యాయుడైన బాబు మృతి చెందడంతో భర్త ఎస్సీ కావడంతో ఎస్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించి 1997లో జూనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామకం పొందింది. అనంతరం ఎస్సీ సర్టిఫికెట్పై సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందింది. ఆ తర్వాత ఆమె బీసీ డి కేటగిరికీ చెందినదని తెలుసుకున్న జెడ్పీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నేతలు 2013లో అప్పటి జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేయగా, 2015లో ములుగు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించా రు. విచారణ జరిపిన ఆర్డీఓ లక్ష్మిఅన్నపూర్ణ ఎస్సీ కాద ని నివేదిక అందజేశారు. దీన్ని కలెక్టర్కు అందించగా ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దుకై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్క్రూటిని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ మరోసారి విచారించి లక్ష్మి అన్నపూర్ణ దళితురాలు కాదని, బీసీ డీ అని తేల్చి ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తూ కలెక్టర్కు నివేదిక అందించారు. దీంతో గత నెలలో ఆ పత్రం రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ పబ్లికేషన్ ఇస్తూ, ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో చెప్పాలని లక్ష్మిఅన్నపూర్ణకు జెడ్పీ అధికారులు నోటీసు జారీ చేశారు. నెలరోజులసమయంతీసుకున్నా, మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దీంతో సంతృప్తి పడని సీఈఓ బి.లక్ష్మిఅన్నపూర్ణను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందితే డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లక్ష్మి అన్నపూర్ణను డిస్మిస్ చేశారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
నల్గొండ : నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భిక్షపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు. ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు చిన్న రాజేష్ అనే వ్యక్తి నుంచి భిక్షపతి రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ చిక్కాడు. భిక్షపతిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి
మలక్పేట: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. లక్ష్మి అనే మహిళ తమ షాపునకు సంబంధించి వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గాను సీనియర్ అసిస్టెంట్ నరహరి రూ.2,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో తండ్రి మృతి... ఆగిన కుమార్తె పెళ్లి
మదనపల్లె: తెల్లవారితే తన కుమార్తె పెళ్లి... ఇంతలోనే పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో మృత్యు ఒడికి చేరాడు. దీంతో ఆ యువతి వివాహం ఆగిపోయింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. గుండ్లూరు వీధికి చెందిన సత్యప్రసాద్ స్థానిక ప్రభుత్వ జీఆర్టీ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె సత్యప్రియకు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇల్లంతా పెళ్లిసందడితో కళకళలాడుతోంది. వంటావార్పు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంతలోనే గురువారం సాయంత్రం సత్యప్రసాద్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సత్యప్రసాద్ కన్నుమూశారు. దీంతో పెళ్లి వేడుక తాత్కాలికంగా నిలిచిపోయింది. -
ఏసీబీ వలలో వైద్యశాఖ ఉద్యోగిని
పెద్దపల్లి : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సివిల్ ఆస్పత్రి సీనియర్ అసిస్టెంట్ అహ్మదాబేగం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాల్వ శ్రీరామ్పూర్ మండలం పెగడపల్లి ఏఎన్ఎం విజయ టీఏ,డీఏల బకాయిల విడుదల కోసం అహ్మద్బేగంను సంప్రదించగా రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఏఎన్ఎం విజయ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం పెద్దపల్లి ఆస్పత్రిలో ఏఎన్ఎం నుంచి సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఖమ్మం డీఎస్సీ సాయిబాబ సిబ్బందితో కలసి అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగిని
కోటగిరి (నిజామాబాద్ జిల్లా) : కోటగిరి ఎమ్మార్వో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుశీల అనే ప్రభుత్వ ఉద్యోగిని.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇస్మాయిల్ అనే వ్యక్తి గతంలో ఆర్ఐగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అయితే ఇస్మాయిల్కు సంబంధించిన ఇంక్రిమెంట్ ఫైల్ మూవ్ చేయటానికి సుశీల రూ.2 వేలు లంచం అడిగింది. దీంతో ఇస్మాయిల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇస్మాయిల్ దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా సుశీలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భారతి ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్లోని ఆమె బంధువుల నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. వారి నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. కోటి విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే బంగారం, వెండి ఆభరణాలతోపాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భారతికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి
అబిడ్స్ (హైదరాబాద్) : లంచం తీసుకుంటూ విద్యా శాఖ ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గన్ఫౌండ్రీలోని జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్... శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంచిర్యాలలో ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆదిలాబాద్(మంచిర్యాల): మంచిర్యాల ఐటీఐలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకి చిక్కాడు. ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సంతోష్ నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తన జీతానికి సంబంధించిన బిల్లులు పంపించటానికి లింగమూర్తి లంచం డిమాండ్ చేయటంతో సంతోష్ ఏసీబీ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి నిందితుడ్ని పట్టించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
-
ఏసీబీకి చిక్కిన సోషల్ వెల్ఫేర్ అధికారి
కరీంనగర్ : కల్యాణలక్ష్మి పథకం కోసం వచ్చిన ఒక జంట వద్ద నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మల్లయ్య ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సుభాష్నగర్కు చెందిన సుబేర్ అనే యువకుడు మతాంతర వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కల్యాణలక్ష్మి పథకం కోసం వెల్ఫేర్ అధికారి మల్లయ్యను సంప్రదించారు. అయితే ఈ పథకం అమలు కోసం అతను రూ. 10వేలు డిమాండ్ చేశాడు. దీంతో సుబేర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. సుబేర్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మల్లయ్యను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఖమ్మం: ఖమ్మం జిల్లా రిజిస్టార్ ఆఫీస్లో సీనియర్ ఆసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గణపతిరావు వాలిడిటి సర్టిఫికెట్ కోసం అర్జీ పెట్టుకున్న హైకోర్టు అడ్వకే ట్ సీతారాంరెడ్డిని రూ. 3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సీతారాంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అదికారులు అడ్వకేట్ నుంచి గణపతిరావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నీటిపారుదల శాఖకు 16 యాళ్ల గ్రహణం
పత్యేక కట్టడాల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ బాసిజం 70 మంది ఉద్యోగుల జీవితాలతో ఆటలు అతని గుప్పిట్లోనే విలువైన రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు ఎస్ఆర్లలో నమోదుకాక నష్టపోతున్న ఉద్యోగులు బదిలీ అయినా రికార్డులు అప్పగించని ఘనుడు కలెక్టర్కు పలువురి ఫిర్యాదు అతనో సీనియర్ అసిస్టెంట్.. చేసేది గుమస్తాగిరీ.. అయితేనేం.. పలుకుబడితో 16 ఏళ్లుగా ఒకేచోట తిష్ట వేసి.. తనకంటూ ఓ గదిని ఏర్పాటు చేసుకొని, రికార్డులను గుప్పిట్లో పెట్టుకొని తోటి ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నాడు. వారి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు.. ఇతరత్రా ప్రయోజనాలకు గండి కొడుతున్నాడు. ఎట్టకేలకు 2014లో బదిలీ అయినా కొత్త పోస్టులో చేరకుండా.. తన వద్ద ఉన్న రికార్డులు వేరే వారికి అప్పగించకుండా ముప్పుతిప్పలు పెడుతూ నీటిపారుదల శాఖ ఉద్యోగులు, అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. పీఎన్ కాలనీ:నీటిపారుదల శాఖ ప్రత్యేక కట్టడాల విభాగం(శ్రీకాకుళం)లో సీనియర్ అసిస్టెంట్గా సుమారు ఏడాది క్రితం వరకు పనిచేసిన యాళ్ల చంద్రశేఖర్పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇతని బారిన పడి ఉద్యోగపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని ఈ విభాగంలో పని చేస్తున్న సుమారు 70 మంది సిబ్బంది సిబ్బంది చేసుకున్న విన్నపాలకు అధికారులు స్పందించారు. 16 ఏళ్లుగా ప్రత్యేక కట్టడాల విభాగంలో తిష్ట వేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ శాఖాపరమైన, ఉద్యోగుల విలువైన రికార్డులను తన ఇంటి వద్ద, కార్యాలయంలోని తన గదిలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మిగిలిన సీనియర్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ తోటి ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీనియర్ అసిస్టెంటే అయినప్పటికీ కార్యాలయంలో తనకో ప్రత్యేక గది ఏర్పాటు చేసుకొని కార్యాలయ రికార్డులు, ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు అందులోనే పెట్టుకున్నారు. పోనీ ఉద్యోగుల సర్వీసు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారా అంటే అదీ లేదు. ఈయనగారి నిర్వాకంతో జరిగిన నష్టాలను పరిశీలిస్తే.. బదిలీలు, పదోన్నతులపై ఇక్కడికి వచ్చిన సిబ్బంది సర్వీస్ రిజిస్టర్లలో జాయినింగ్ రిపోర్టులను కూడా నమోదు చేయలేదు. గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు, జీఐఎస్, సరెండర్ లీవ్లు వంటి వాటిని నమోదు చేయలేదు. 66 రోజులపాటు జరిగిన సమైక్యాంధ్ర సమ్మె వివరాలను సర్వీస్ రిజిస్టర్లలో పొందుపరచకపోగా, ఆ ప్రొసీడింగ్స్ను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. 2012-13లో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఏఈల సర్వీసు రిజిస్టర్లు, ఒరిజినల్ ధ్రువపత్రాలు తన ఆధీనంలోనే ఉంచేసుకోవడంతో వారు ఇప్పటివరకు ఇంక్రిమెంట్లకు, పదోన్నతులకు నోచుకోలేదు. బదిలీ అయినా.. ఎన్నో విధాలుగా తోటి ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న చంద్రశేఖర్కు ఎట్టకేలకు 2014లో బదిలీ అయ్యింది. ఇక్కడి విధుల నుంచి రిలీవ్ అయినా.. కొత్త పోస్టులో చేరకుండా మెడికల్ లీవ్ పెట్టి కాలక్షేపం చేస్తున్నారు. తన వద్ద ఉన్న రికార్డులు, సర్వీసు రిజిస్టర్లను తన స్థానంలో చేరిన ఉద్యోగికి అప్పగించలేదు. చివరికి సహనం నశించిన కొందరు ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు, తమ కార్యాలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ రికార్డులన్నింటిని అప్పగించాలని చంద్రశేఖర్ను ఆదేశించగా ఫిబ్రవరి 15 నాటికి రికార్డులు అప్పగిస్తానని అప్పటి వరకు గడువు ఇవ్వాలని కోరారు. అయితే ఆ గడువు కూడా ముగిసి 20 రోజులు దాటడంతో ఇటీవల ఈఈ ప్రదీప్ ముగ్గురు డీఈల సమక్షంలో అతని గదిలో బీరువా తాళాలు పగులగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ ఇంటి వద్ద ఇంకా చాలా విలువైన రికార్డులు ఉన్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తాం గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్పై ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. రికార్డులను అప్పగించేందుకు శేఖర్ ఫిబ్రవరి 15 వరకు గడువు కోరారు. గడువు ముగిసినా రాకపోవడంతో ముగ్గురు డీఈల సమక్షంలో బీరువా తాళాలను విరుగ్గొట్టి రికార్డులను పరిశీలిస్తున్నాం. త్వరలో ఉద్యోగులందరికీ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. -డి.ఎస్.ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగంలో ఉన్నా లేనట్లే.. సీతంపేటలో జేటీవోగా ఉన్న నేను పదోన్నతిపై శ్రీకాకుళానికి ఏటీవోగా వచ్చాను. ఇక్కడ విధుల్లో చేరి మూడున్నరేళ్లు అయినా సర్వీస్ రిజిస్టర్లో ఎటువంటి ఆ వివరాలు నమోదు చేయలేదు. ఇలా అయితే ఉద్యోగంలో ఉన్నా.. లేకున్నా ఒక్కటే. - కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ టెక్నికల్ అధికారి జాయినింగ్ నుంచి జీతం పెరగలేదు సర్వీస్ రిజిస్టర్లో నా పనితీరు నమోదు చేయకపోవడంతో జిల్లాలో విధుల్లో చేరినప్పటి నుంచి జీతం పెరగలేదు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. -ఎంఎస్ రాకేష్కుమార్, జూనియర్ టెక్నికల్ అధికారి నా ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వలేదు నేడు విధుల్లో చేరినప్పుడు సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖరరావుకు నా ఒరిజినల్ ధ్రువపత్రాలు అందజేశాను. వాటిని ఆయన తిరిగి ఇవ్వకపోవడంతో ఇతర ఉద్యోగావకాశాలు కోల్పోతున్నాను. ఎన్నిసార్లు అడిగినా అదిగో...ఇదిగో.. అంటూ దాటేస్తున్నారు. అధికారులు స్పందించి నా ధ్రువపత్రాలు ఇప్పించాలి. - పి.శంకరరావు, టెక్నికల్ అసిస్టెంట్ -
8 మంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది సస్పెన్షన్
ఆల్కాట్తోట (రాజమండ్రి) : రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కక్షిదారుల డాక్యుమెంట్లు మాయం వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ సహా ఎనిమిదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల ఒకటిన కొత్త సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు స్వీకరించిన విజయ జీవన్బాబు, శ్రీనివాసబాబు గత నెలలో రిజిస్ట్రేషన్కు వచ్చిన కక్షిదారులకు చెందిన 25 డాక్యుమెంట్లు కనిపించడం లేదని గుర్తించారు. ఇటీవల రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ఎం.శ్రీనివాసమూర్తికి, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 17, 18 తేదీల్లో ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ చాముండేశ్వరీదేవి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు మాత్రమే కనిపించకుండా పోయాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా రిజిస్ట్రార్ చాముండేశ్వరితోపాటు జూనియర్ అసిస్టెంట్లు సిహెచ్.శ్రీదేవి, ఎ.రాజేంద్రప్రసాద్, ఎం.కిరణ్మయి, వైవీ ఆనందకుమార్, ఎంవీవీ కృష్ణ, ఆఫీస్ సబార్డినేట్లు కె.ఎస్.మూర్తి, జేకెఎస్ కుమార్లను బాధ్యులను చేస్తూ ఏలూరు రిజిస్ట్రేషన్శాఖ డీఐజీ ఎ.సాయిప్రసాద్కు నివేదిక ఇచ్చారు. దీంతో డీఐజీ వారిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలకలం రేగింది. కాగా తాను ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిరోజులకు రెడ్డి అనే ఉద్యోగి ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టారని, ఈ డాక్యుమెంట్లు ఎలా పోయాయో అంతుపట్టడం లేదని అన్నారు. తనపై కక్షతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని వాపోయారు. కాగా గతంలో సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న వారు దాదాపు పదిమంది ప్రైవేటు వ్యక్తులతో కార్యాలయం పనులు చేయించే వారని, వారు బదిలీ అయ్యాక ప్రైవేటు వ్యక్తులను తొలగించారని సమాచారం. డాక్యుమెంట్లు మాయం కావడంలో ప్రై వేట్ వ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. గతంలోనూ కొన్ని డాక్యుమెంట్లు పోయినా ఇంతవరకు చర్యలు లే వని, ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏమిటని కొందరు అంటున్నారు. -
మహిళ ఉద్యోగిపై కానిస్టేబుళ్ల వీరంగం
ఆర్టీసీ బస్సులో మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించి వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. దేవరపల్లి గ్రామానికి చెందిన గారపాటి అనిత పద్మకుమారి గోపాలపురం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు విజయవాడలో చదువుకుంటున్నాడు. ఆదివారం విజయవాడ వెళ్లిన ఆమె కుమారుడిని చూసి సాయంత్రం తిరిగి ఆర్టీసీ బస్సులో దేవరపల్లి బయల్దేరింది. అదే బస్సులో ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద ఏలూరు పోలీసు హెడ్ క్వాటర్స్లో ఉంటున్న ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు పోలి ప్రభుదాస్, కంకిపాటి రాజు, పంపన సూరిబాబులు విశాఖపట్నం నుంచి ఖైదీలను తీసుకు వచ్చేందుకు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ప్రభుదాస్ పద్మకుమారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమె బ్యాగ్ను తనిఖీ చేయాలంటూ పట్టుబట్టడంతో భయపడిన పద్మకుమారి పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపాలంటూ డ్రైవర్కు చెప్పింది. పోలీస్ స్టేషన్ వద్ద ఎందుకు బస్సు ఆపమన్నావంటూ ప్రభుదాస్ పద్మకుమారి తలకు తన వద్ద ఉన్న గన్ను ఎక్కు పెట్టడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురై మౌనం వహించారు. మిగిలిన కానిస్టేబుళ్లు కూడా ప్రభుదాస్కు వత్తాసు పలికారని అనంతపల్లి పోలీసులకు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు ఆమె పేర్కొన్నారు. సోమవారం అనంతపల్లి పోలీస్ స్టేషన్కు కానిస్టేబుళ్లను తీసుకురాగా, అక్కడకు వచ్చిన పద్మకుమారి కానిస్టేబుళ్లను నిలదీసి ఓ మహిళా ఉద్యోగిపై దాడికి దిగడం ఏమిటని నిలదీయడంతో వారు క్షమాపణ కోరారు. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే కేసు నమోదు చేయాలని బాధితురాలు కోరగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో స్పందించిన పొలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
సీనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
జి.సిగడాం, న్యూస్లైన్ :జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గొర్లె ఉమామహేశ్వరరావు (45) సోమవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. జి.సిగడాంలో విధులు నిర్వహిస్తున్న ఈయన పొందూరులో కార్యాలయ పని నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. పొందూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విషం తాగారు. అక్కడ నుంచి జి.సిగడాం మండల పరిధిలోని వాండ్రంగి సెంటర్ వద్దకు వచ్చి ఉమామహేశ్వరరావు కుప్పకూలిపోయినట్టు స్థానికులు తెలిపారు. బ్యాంకు పనిపై అటుగా వెళ్తున్న జి.సిగడాం ఎంఈవో ఎం.వి.ప్రసాదరావు ఉమామహేశ్వరరావును చూసి.. పరిస్థితిని గమనించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ పది నిమిషాలు చికిత్స పొందుతూ చనిపోయారు. ఉమామహేశ్వరరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఉమామహేశ్వరరావు విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో సమాచారం తెలుసుకున్న జి.సిగడాం పరిషత్ కార్యాలయ సిబ్బంది బాసూరి శంకరరావు, రాజశేఖరం, రమణ, తహశీల్దారు జె దుర్గారవీంద్రనాథ్, డిప్యూటీ తహశీల్దారు డి.రమేష్బాబు, కార్యదర్శులు, వీఆర్వోలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉమామహేశ్వరరావు మృతికి ఎచ్చెర్ల ఎంఎల్ఏ కిమిడి కళావెంకటరావు, మాజీ ఎంఎల్ఏ మీసాల నీలకంఠంనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు టంకాల లక్ష్మి, మాజీ ఎంపీపీ మీసాల లక్ష్మి, స్థానిక సర్పంచ్ వెలది సాయిరాం సంతాపం వ్యక్తం చేశారు. స్వగ్రామంలో విషాదం రాజాం రూరల్: ఉమామహ్వేరరావు ఆత్మహత్యతో ఆయన స్వగ్రామమైన రాజాం మండలంలోని పొనుగుటివలసలో విషాదం నెలకొంది. అంబేద్కర్ కాలనీ సమీపంలో నివసిస్తున్న ఈయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈయన మృతిపై పోలీసులు సమగ్రమైన దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు కోరారు. -
తపాలా: సార్, పొగ తాగవద్దు ప్లీజ్!
మాది గుంటూరు జిల్లా కొత్తసొలస గ్రామం. నేను ఎన్.ఎస్.పి. డిపార్టుమెంటు-నర్సరావుపేటలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాను.నేను సర్వీసులో రికార్డు కీపరుగా మొదట చేసినప్పుడు, రికార్డు రూమ్ గోడ పక్కన వచ్చేవారూ, వెళ్లేవారూ మూత్రం విసర్జించేవారు. గోడమీద పేపరులో ‘మూత్రం వాసనకు మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, దయచేసి ఇక్కడ మూత్రము విసర్జించవ’ద్దని రాసిపెట్టేవాణ్ని. కానీ ఎవ్వరూ వినిపించుకునేవారు కాదు. తప్పుచేసేవారి జోలికి వెళితే వారికి శత్రువు అవుతామని తెలిసి భరించేవాణ్ని. కొన్నాళ్లకు నాకు సీనియరు అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. మా కార్యాలయ ఉన్నతాధికారీ, మా గణాంకాధికారీ ఇరువురూ సిగరెట్టు తాగేవారే! ఏదైనా ఫైలు తీసుకొని గణాంకాధికారి వద్దకు వెళ్లాల్సివస్తే, ఆయన సిగరెట్టు ముట్టించి పొగ పీలుస్తూ వదులుతూ ఉండేవారు. నేను పక్కకు వెళ్లేవాణ్ని. దాంతో ఆయన, ‘ఏమయ్యా! ఫైలు చూస్తుంటే పక్కకు వెళతావేంటి?’ అని మందలించేవారు. తిట్లు పెద్దగా హాని చేయవుగానీ, పొగ పీల్చడం హాని చేస్తుందని తిట్లు భరిస్తూ ఉండేవాణ్ని. వారు ఫైలు చూసి నా చేతికి ఇవ్వగానే, ఉన్నతాధికారి దగ్గరికి వెళ్లేవాణ్ని. వారు ఇటు ఫైలు చూస్తూ, అటు సిగరెట్టు పొగ గుప్గుప్మని వదులుతూ, మరోపక్క పక్కవారితో కబుర్లు చెపుతూ ఉండేవారు. ఆయన దగ్గర నిల్చోలేక, బయటకు వెళ్లలేక, వారికి కోపం వస్తుందేమోనని బాధను అనుభవిస్తూ ఉండేవాణ్ని. మా ఎస్టాబ్లిష్మెంట్ క్లర్కువారు, మా ఇరువురు అధికార్ల కంటే రెండు పెట్టెలు అధికంగా సిగరెట్లు తాగేవారు. మా రూమ్లో ఉండేవారిలో కొంతమంది పొగ అంటే గిట్టనివారు ఉన్నారు. మా సిబ్బంది గుమస్తా వారికి నడవడానికి రెండు కాళ్లు లేవు. నాకు ఒక్క కాలు అవుడు. ఒకరోజు ఆయనతో, ‘సిగరెట్టు తాగవద్దు, మీకు చెప్పే ధైర్యము ఎవరికీ లేదు, అందువల్ల అందరూ మౌనంగా ఉంటూ బాధపడుతున్నారు’ అని చెప్పాను. ‘నేను లేచి బయటకు వెళ్లలేనూ, సిగరెట్టు తాగకుండానూ ఉండలేను’ అని సమాధానం ఇచ్చారు క్లర్కు. దాంతో ఏమీచేయలేక, నా టేబుల్ మీద ఒక అట్టమీద, ‘ధూమపానం ప్రమాదం’ అని రాసి అందరకూ కనబడేటట్లు పెట్టాను. మా కార్యాలయం ఉన్నతాధికారులు దీనిని చూసి నవ్వుకున్నారు. ఇక ఇటీవలి సంగతి. ఒకరోజు ‘బహిరంగ ప్రదేశం’లో ఒక నీడపట్టున కూర్చుని వేచిచూస్తున్నాం. నా వెంట నా ముగ్గురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. ఒక కుర్రవాడు, పదిహేనేళ్లు ఉంటాయేమో, మా పక్కన కూర్చుని సిగరెట్టు ముట్టించాడు. తరువాత ఇద్దరు రైతులు వచ్చారు. పొర చుట్టలు చుట్టుకొని, చుట్టచుట్టకు మోటించి కాల్చుకుంటూ పక్కన కూర్చున్నారు. మా కూతుళ్లు, పూలు, కాయలు కొనటానికి బజారుకు వెళ్లారు. నా దగ్గర కూరగాయల సంచులు, పిల్లల బట్టలు గల సంచులు ఉన్నాయి. ఈ పసిబిడ్డలను దూరంగా తీసుకొని వెళ్లలేకా, ఆ సంచులు మోయలేకా, వాళ్లను ఏమీ చేయలేకా, ఆ ఘాటైన వాసన పీలుస్తూ, నరకాన్ని అనుభవిస్తూ అలాగే కూర్చున్నాను. బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసేవారిని శిక్షించే చట్టం మనకు వచ్చింది గదా! అది ఎక్కడైనా అమలవుతోందా? అలా మథనపడుతుండగానే, మా కూతుళ్లు ఇద్దరు వచ్చారు. అందరం కలిసి ఆటో ఎక్కాం. తీరా ఆటో డ్రైవర్ సిగరెట్టు ముట్టించి, ఆటోను స్టార్ట్ చేశాడు. ‘పొగ భరించలేకపోతున్నాం’ అంటే, ‘ఇది ఆర్టీసీ బస్సు కా’దన్నాడతను. ఇతరులను బాధపెట్టే ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో వేచి చూడాలి. - మద్దూరి రామకోటిరెడ్డి కొత్త సొలస, గుంటూరు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com డిజైన్: కుసుమ -
రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి ఎన్నిక
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రాష్ట్ర నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన జి.రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన అశోక్బాబు ప్యానెల్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్లో జిల్లాకు సంబంధించి 56 మంది ఓటర్లు ఉండగా, 54 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న బాలనారాయణ, ఆలూరు తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్న ఎస్.కె.సత్యనారాయణలు పదవీ విరమణ పొందడంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడుగా అశోక్బాబుతో పాటు ఉపాధ్యక్షుడుగా జి.రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడం పట్ల జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, శ్రీరాములు, నగర అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్న, జయరామకృష్ణారెడ్డి, జిల్లా కోశాధికారి రామకృష్ణారెడ్డి తదితరులు హర్షం ప్రకటించారు.