Tehelka
-
దానవ మానవుల పాతాళ్ లోక్
ఆకాశ హర్మ్యాలలో ఉంటారు కొందరు. నేల మీద ఉంటారు కొందరు. నేలకు దిగువన పాతాళలోకంలో వసిస్తారు కొందరు. పాతాళం అంటే చీకటి. నలుపు. చెడు. హింస. ప్రాణాలకు తెగించి చేసే బతుకు సమరం. కాని పాతాళంలోని బతుకులు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేల మీద ఉన్నవారు, ఐశ్వర్యపు అంచుల్లో బతికేవారు... వీరు తయారు చేసిన వ్యవస్థేనా దీనికి కారణం. ‘అమెజాన్ ఒరిజినల్స్’లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ చూడ్డానికి పైకి ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది. నిజానికి ఇది మూసి ఉంచిన భారతీయ సమాజం. తెలిసీ చీకటిలో ఉంచేసే గుగుర్పాటు సమాజం. ఢిల్లీలో యుమునా నది అందరికీ తెలుసు. కాని ‘యమునా పార్’ (యమునకు ఆవల) ఒక ప్రపంచం ఉంది. అది దిగువ స్థాయి ప్రజల ప్రపంచం. స్లమ్స్ ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండే ప్రపంచం. ఆ యమునా పార్లో ‘ఔటర్ యమునా పార్’ పోలీస్ స్టేషనే మన కథాస్థలం. అందులో పని చేసే ఒక సాదాసీదా సర్కిల్ ఇన్స్పెక్టరే మన కథా నాయకుడు. అతని పేరు హాతీరామ్ చౌదరీ. కథ ఏమిటి? ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత న్యూస్ చానల్ హెడ్ మీద హత్యాయత్నం జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. హత్య చేయడానికి పక్క ఊర్ల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు యమునా పార్ లాడ్జ్లో దిగి ఉన్నారు. ఆ లాడ్జ్ నుంచి బయట పడి హత్యకు బయలుదేరుతుండగా ఒక్క ఉదుటున వెంబడించి అరెస్ట్ చేస్తారు. జరిగిన హత్యాయత్నం ప్రఖ్యాత జర్నలిస్ట్ మీద. అతనికి ఏదైనా అయి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఈ చానల్హెడ్ను చంపడానికి ప్లాన్ చేసిందెవరు? అందుకు సిద్ధమైన ఈ నలుగురు ఎవరు? కేసు హాతీరామ్ చౌదరికి అప్పచెప్పబడుతుంది. అతనికి తోడుగా ఒక కుర్ర ఎస్.ఐని ఇస్తారు. వీరిద్దరూ అంత పెద్ద కేసును సాల్వ్ చేయాలి. చేయగలరా? చేయకూడదనే కొందరి ప్లాన్. అందుకే హాతీరామ్కు అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్ ఏం చేయాలి? ఒక్క అవకాశం హాతీరామ్ ఒక సగటు మధ్యతరగతి వాడు. జీవితంలో ఏమీ సాధించలేదు. ఇంట్లో భార్య అతడి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది. హైస్కూలుకు వచ్చిన కొడుకు తన తండ్రి ఒక హీరోలా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఒక పోలీస్ వ్యాన్ వేసుకొని, చిరుబొజ్జ పెంచుకుని చిల్లర తగాదాలు, మొగుడూ పెళ్లాల పంచాయితీలు తీరుస్తూ వచ్చిన హాతీరామ్కు ఇది తన జీవితంలో దొరికిన అత్యంత ముఖ్యమైన అవకాశం అనుకుంటాడు. దీనిని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎలా? నలుగురు నిందితులు దొరికారు కాబట్టి వీరి నుంచే ఆధారాలు దొరకాలి. వారిని ఇంటరాగేట్ చేయడం మొదలుపెడతాడు. వారిలో ఒకడిది మధ్యప్రదేశ్లోని చిత్రకూట్. ఇంకొకడిది పంజాబ్. ఒకడిది మీరట్. ఒకరిది ఢిల్లీ. ఈ నలుగురినీ కలిపింది ఎవరు? హాతీరామ్ తీగలాగుతూ వెళతాడు. మెల్లగా డొంక కదులుతుంది. కథ చివరకు తాను కేసు సాల్వ్ చేసి తీరుతాడు. అంతా మంచే ఉండదు.. ప్రతిదీ చెడే కాదు ఒక హత్యాయత్నం, దాన్ని ప్లాన్ చేసినవారిని పట్టుకోవడం ఇదే కథైతే ఈ సిరీస్ ఇంతమందిని ఆకట్టుకునేది కాదు. కాని ఇది జీవితాలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సమాజ భ్రష్టత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడిపండులా కనిపించే వ్యవస్థ కడుపులో ఎంత కుళ్లు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఆర్థిక అంతరాలు, స్వార్థం... ఇవన్నీ మనిషిని ఎలా మారుస్తాయి ఈ సిరీస్ చెబుతుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు, అవడానికి మూలం ఏమిటి ఇది చెబుతుంది. కొందరి పట్ల ఈ దేశంలో ఉన్న వివక్షను, ఛీత్కారాన్ని, అవమానాన్ని చాలా శక్తిమంతంగా చూపిస్తుంది. పోలీసుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మేడల్లో ఉండేవారిలో కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మంచి చెడు అనేది మనుషుల్లో ఉంటూ మారుతూ ఉండే లక్షణంగా ఈ సిరీస్లో కనిపించి ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కథ గడిచే కొద్దీ ప్రతి పాత్ర మీద ప్రేక్షకుడి అంచనా మారిపోతూ ఉంటుంది. ప్రతి పాత్రను నలుపు తెలుపుల్లో విడగొట్టలేమని తెలుస్తుంది. తరుణ్ తేజ్పాల్ పుస్తకంతో ‘తహెల్కాడాట్కామ్’తో తరుణ్ తేజ్పాల్ సంచలనం సృష్టించడం అందరికీ తెలుసు. జర్నలిస్టుగా అతను రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ పుస్తకం ఈ సిరీస్ తీయడానికి ఇన్స్పిరేషన్. పాతాళ్లోక్లో చానెల్ హెడ్ చాలా పేరున్నవాడు. పాలకుల మీద చాలా స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఒక సంభాషణలో అతను లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాడని చెబుతారు. కాని అతను కూడా తన ఉనికి కోసం పతనమవడం ఈ సిరీస్ లో మనం చూస్తాం. మీడియా ఎలాంటి తప్పుడు పనులకు తెగబడుతుందో, తన టి.ఆర్.పిల కోసం ఎవరినైనా ఎలా బలి చేయడానికి సిద్ధపడుతుందో ఇందులో చూపిస్తారు. ఈ ప్రొఫెషన్లో ఉండే వ్యక్తుల భార్యలు ఎలాంటి వొత్తిడికి గురవుతారో, ఎంత యాంగ్జయిటీ ఫీలవుతుంటారో ఇందులో చానెల్ హెడ్ భార్య పాత్ర ద్వారా చూపిస్తారు. ఇందులో డి.సి.పి చెప్పే డైలాగ్ ఒకటి ఉంది– ‘చూడటానికి ఈ వ్యవస్థ ఒక చెత్త కుప్పలా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే ఒక మిషన్ అని అర్థమవుతుంది. ఈ మిషన్లో ప్రతి నట్టూ బోల్టు తాము ఏం చేయాలో తెలుసుకొని పని చేస్తుంటాయి. అలా తెలుసుకోని వాటి స్థానంలో కొత్త నట్లూ బోల్టులు వస్తుంటాయి. వ్యవస్థ మాత్రం అలానే నడుస్తుంటుంది’ అని అంటాడతడు. రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్ద మనుషులు వీరు ఆడే ఆటలకు పాతాళలోకంలోని సగటు మనుషులు శలభాల్లా నాశనం కావడమే ‘పాతాళ్లోక్’ మూల కథాంశం. ఉత్కంఠ రేపే కథనం దాదాపు 40 నిమిషాలు ఉండే ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ నడిచే కొద్దీ తర్వాత ఏం జరుగుతుందా అని కుతూహలం పెరుగుతుంది. కథనం ముందు వెనుకలుగా, పారలల్గా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్లో వాస్తవిక ప్రవర్తనతో తీయడం వల్ల ప్రేక్షకుడు తాను ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా భావిస్తాడు. ఇందులో ముఖ్యపాత్ర ధారి, హాతీరామ్గా వేసిన నటుడు జైదీప్ అహ్లావత్ ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్లో నటించాడు. ఈ సిరీస్ అతనికి చాలా పేరు తెచ్చింది. సిరీస్లో చేసిన వారందరూ పాత్రలు కారేమో అసలు మనుషులే నటిస్తున్నారేమో అనిపించేలా చేశారు. గతంలో నెట్ఫ్లిక్స్లో ‘సేక్రెడ్ గేమ్స్’ క్రైమ్ థ్రిల్లర్గా చాలా పెద్ద హిట్ అయ్యింది. అమేజాన్లో ‘పాతాళ్ లోక్’ అంతకన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతోంది. రచయిత సుదీప్ శర్మ రెండేళ్లు కష్టపడి రాసిన ఈ సిరీస్ను హిందీ అర్థమయ్యేవారు తప్పక చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్టైటిల్స్ ఫాలో అవుతూ చూడాలనుకునేవారూ చూడొచ్చు. పాతాళ్ లోక్ (అమెజాన్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్) ఎపిసోడ్ల సంఖ్య: 9 మొత్తం నిడివి: 6 గం.30 నిమిషాలు రచన: సుదీప్ శర్మ దర్శకత్వం: అవినాష్– ప్రొసిత్ రాయ్ నిర్మాత: అనుష్కా శర్మ – సాక్షి ఫ్యామిలీ -
రాయని డైరీ
‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’.. షెల్ఫ్ లోంచి ఎప్పుడు నా చేతిలోకి వచ్చిందో తెలీదు. అది నా పుస్తకమే. పదేళ్ల క్రిందట రాసింది! ఊరికే చూస్తూ కూర్చున్నాను, పేజీలు తిప్పకుండా. అట్ట మీద ఆరోగ్యవంతమైన స్త్రీ నగ్నదేహం. లోపల స్త్రీ గురించి ఏం ఉండదు. అంతా మగాళ్ల ఏడుపు. ఆ ఏడుపుకి ఘనీభవ రూపమే.. అట్ట మీద ఉన్న స్త్రీ దేహం. లోపల ఏం రాశానో నాకు తెలుసు కాబట్టి, లోపల ఏం రాసి ఉందో తెలుసుకునే ఉత్సాహం నాకు లేదు. పైన స్త్రీ దేహంలోనే.. ఏళ్లుగా చూస్తూ ఉన్నా, తెలియంది ఇంకా ఏదో ఉన్నట్లనిపిస్తుంటుంది. ఆ ఉందనుకున్నది స్త్రీలో లేనిది కావచ్చు. ‘ఉందీ’ అని పురుషుడు అనుకోవడంలో ఉన్నదీ కావచ్చు. ఏది నిజం? ఏది అబద్ధం? స్త్రీ దేహంలో ఈ రెండూ ఒకటేనా? ‘‘తరుణ్.. మొత్తం తొమ్మిది చార్జిషీట్లు మన మీద వేయబోతున్నారు’’ అన్నాడు ప్రమోద్ కుమార్ దూబే.. ఆయాసపడుతూ వచ్చి. నా లాయర్ అతడు. ముఖం చిన్నబోయి ఉంది. ‘ఇట్స్ ఓకే’ అన్నాను. సో.. తొమ్మిది చార్జిషీట్లు, తొమ్మిది విచారణలు, తొమ్మిది శిక్షలు! ‘‘పదేళ్లకు తగ్గకుండా మనకు శిక్ష పడే అవకాశం ఉంది తరుణ్’’ అన్నాడు దూబే. నవ్వాను. ‘‘మిస్టర్ దూబే, మీరలా మాటిమాటికీ ‘మన మీద’, ‘మనకు’.. అంటూ మిమ్మల్ని నాతో కలుపుకోకండి. నేను నిందితుడిని. మీరు నా లాయర్’’ అన్నాను. ‘‘కానీ తరుణ్.. అన్యాయం అనిపిస్తోంది. ఒక మగవాడి మీద ఇన్ని కేసులు! రాంగ్ఫుల్ కన్స్ట్రెయింట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఫోర్స్, సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్, హెరాస్మెంట్, అస్సాల్ట్ అండ్ రేప్.. లిఫ్ట్లో ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి ఉన్న పద్నాలుగు సెకన్లలోనే ఇవన్నీ ఎలా జరిగిపోతాయో నాకైతే అర్థం కావడం లేదు. మగవాడికి వ్యతిరేకంగా ఇండియన్ పీనల్ కోడ్లో ఇన్ని సెక్షన్లు ఉన్నాయా అనిపిస్తోంది’’ అన్నాడు దూబే. ‘‘మగవాడికి వ్యతిరేకంగా కాదు మిస్టర్ దూబే.. స్త్రీ దేహానికి అనుకూలంగా.. ’’ అని పెద్దగా నవ్వాను. భయంగా చూశాడు దూబే. ఒక మగవాడిలో కనిపించే భయం అది! ‘‘పెద్దగా నవ్వితే నవ్వారు. చిన్నగా మాట్లాడండి తరుణ్’’ అని చెప్పి, వెళ్లిపోయాడు. ‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’ ఇంకా నా చేతుల్లోనే ఉంది. అట్టమీది బొమ్మను చూస్తుంటే నా మీద కేసు పెట్టిన నా జూనియర్ మోస్ట్ గుర్తుకొచ్చింది. ఐ లవ్ హర్! తన దేహానికి ఏదో అయిందని, అవబోయిందనీ తను కేసు పెట్టలేదు. ఒక ఎంప్లాయర్గా నాపై తను ఉంచిన నమ్మకానికి దెబ్బ తగిలిందని కేసు పెట్టింది. గ్రేట్ గర్ల్. మాధవ్ శింగరాజు -
వివాదంలో తెహల్కా!
-
జైలు నుంచే తేజ్పాల్ మహిళతో ఫోన్ మంతనాలు
పనాజీ: లైంగిక ఆరోపణల కేసులో జైలు పాలైన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్.. జైలు నుంచే ప్రతి రోజూ ఓ మహిళా వ్యాపర భాగస్వామితో ఫోన్లో సంభాషించేవారని విచారణలో తేలింది. జైలు అధికారులు ఈ నివేదికన మర్గావో జిల్లా, సెషన్స్ కోర్టుకు బుధవారం సమర్పించారు. తేజ్పాల్ జైలు గది నుంచి సిమ్ను సీజ్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఈ సిమ్ పనాజీకి చెందిన ఓ మహిళ పేరుతో తీసుకున్నారు. తేజ్పాల్ ఢిల్లీకి చెందిన షీలా లుంకడ్ అనే మహిళతో మాట్లాడినట్టు జైలు అధికారులు తెలిపారు. షీలాతో పాటు ఢిల్లీకే చెందిన మంజరితో సంభాషించేవారని, ఆయన సిమ్లో ఇతర ఫోన్ నెంబర్లు ఉన్నట్టు చెప్పారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తేజ్పాల్, ఆయన భార్య గీతన బత్రా, షీలా, రాజీవ్ లుకండ్ భాగస్వాములు. జైల్లోకి ఫోన్ను ఎలా అనుమతించారే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ
పనాజి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటీషన్ పై మంగళవారం బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 18 వ తేదీన వాదనలు విన్న కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని అందించాలని కోర్టు క్రైంబ్రాంచ్ ను కోరింది. బెయిల్ పిటీషన్ పై తేజ్ పాల్ ను నేడు కోర్టులో హాజరు పరుచనునున్నారు. అంతకుముందు తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలులుగా తేజ్ పాల్ జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.అతనిపై లైంగిక వేధింపుల చట్టం క్రింద 354, 354-ఏ సెక్షన్లు, దురద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేసినందకు 341 ,342 సెక్షన్లు, అత్యాచార అభియోగాల క్రింద 376,376(2)(ఎఫ్), 376(2)(కె) సెక్షన్ల ను గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేశారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు
పానాజీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జుడీషియల్ రిమాండ్ ని 14 రోజుల పాటు పొడిగిస్తూ స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నవంబర్ లో గోవాలోని రిసార్డులో జరిగిన కాన్పరెన్స్ సందర్భంగా సహ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై తేజ్ పాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలలుగా ఆయన పోలీసు, జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం బాంబే హైకోర్టును తేజ్ పాల్ ఆశ్రయించారు. ప్రస్తుతం వాస్కో కు 35 కిలో మీటర్ల దూరంలోని సదా సబ్ జైలులో ఉన్నారు. -
లైంగిక వేధింపుల వార్త షాకిచ్చింది: అమీర్ ఖాన్
మహిళా జర్నలిస్ట్ పై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త షాక్ కు గురి చేసింది అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఓ మహిళ జర్నలిస్ట్ తో తేజ్ పాల్ అలా ప్రవర్థించడం నమ్మలేకపోయాను అని అన్నారు. ఈ కేసులో తరుణ్ తేజ్ పాల్ ప్రవర్తన తనను నిరుత్సాహపరిచిందని అన్నాడు. ఈ ఘటన అత్యంత విషాదకరమైంది అని అమీర్ అన్నారు. ఈ ఘటనలో మహిళా జర్నలిస్టుకు మనమంతా బాసటగా నిలువాలని అమీర్ సూచించారు. ఇలాంటి పరిస్తితిని ఎదుర్కొనడం ఏ మహిళకైనా చాలా కష్టమైన పనియే అని అన్నారు. భౌతిక, లైంగిక వేధింపులు, అత్యాచార సంఘటనలు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఊహించలేనివని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. పోలీసులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారులు తమ విధులను పకడ్భందీగా నిర్వహించాలని అమీర్ సూచించారు. అత్యాచారం అనేది ఓ హింసాత్మక సంఘటన అని అమీర్ వ్యాఖ్యానించారు. సత్యమేవ జయతే రెండవ భాగంలో కొన్ని కీలక సమస్యలను, సీరియస్ సమస్యలను ప్రస్తావించాలనుకుంటున్నానని అమీర్ తెలిపారు. -
తేజ్పాల్ పోలీస్ కస్టడీ పొడగింపు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగించారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తేజ్పాల్కు తొలుత ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన న్యాయస్థానం తాజాగా ఈ నెల 10 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేజ్పాల్ను శనివారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు ఆయనకు ఇటీవల లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. పలువురు సాక్షులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
లైంగిక దాడి కేసులో షోమా చౌదరి స్టేట్మెంట్ రికార్డు
తెహల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి స్టేట్మెంట్ను గోవా కోర్టు శనివారం రికార్డు చేసింది. సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడి కేసులో షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరయ్యేందుకు షోమా చౌదరి శుక్రవారం రాత్రే ఢిల్లీ నుంచి గోవా చేరుకున్నారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కస్టడీ ముగియటంతో తరుణ్ తేజ్పాల్ను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా మరో వారం పాటు తేజ్పాల్ కస్టడీ పొడిగించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరనున్నారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను అరెస్టు చేయడం తెలిసిందే. -
తరుణ్ తేజ్పాల్కు లైంగిక సామర్థ్య పరీక్ష
లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు లైంగిక సామర్థ్య పరీక్షను నిర్వహించేందుకు సోమవారం గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించడం తప్పనిసరని పోలీసులు తెలిపారు. ఓ మహిళా జర్నలిస్టును లైంగిక వేధించాడనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం కోర్టులో హాజరు పరచగా ఆయనను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. విచారణలో భాగంగా 50 ఏళ్ల తేజ్పాల్ను పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. -
తరుణ్ తేజ్పాల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ
లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపారు. గోవా పోలీసులు ఆదివారం తేజ్పాల్ను ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచారు. కేసుకు సంబంధించి విచారించేందుకు తేజ్పాల్ను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపాలని అంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కాగా తేజ్పాల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు సహకరిస్తున్నారని, పోలీస్ కస్టడీ అవసరం లేదని అతని తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి శామా జోషీ ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల కేసులో తేజ్పాల్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అప్పుల ఊబిలో తెహల్కా
సంచలన కథనాలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రికకు అదే రీతిలో కష్టాలు వెంటాడుతున్నాయి. లైంగిక వేధింపులకు కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ జైలుపాలు కాగా, యాజమాన్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తెహల్కా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. తమ ఆస్తుల విలువ కంటే ఆస్తిఅప్పుల చిట్టా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెహల్కా హోల్డింగ్ కంపెనీ ఆడిటింగ్ నివేదికలో పేర్కొంది. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ తేజ్పాల్పై ఆరోపణలు రాగానే తెహల్కా యాజమాన్యం ఇతర కంపెనీల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. పన్నులు చెల్లించలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరిపే అవకాశముంది. కాగా ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో తెహల్కా పబ్లికేషన్ గ్రూప్ నడుస్తోంది. ఈ కంపెనీ దాదాపు 13 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు సమాచారం. గతేడాది చివరకు అనంత్ మీడియాలో తరుణ్ తేజ్పాల్, అతని సోదరి నీనా తేజ్పాల్, సతీష్ మెహతా, ప్రవీణ్ కుమార్ డైరెక్టర్లుగా ఉన్నారు. -
తెహల్కా ఎండీ సోమా చౌదరి రాజీనామా
-
'తేజ్ పాల్, తెహల్కాతో సంబంధాలు లేవు'
తరుణ్ తేజ్ పాల్ తో ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. తెహల్కా మ్యాగజైన్ లో తనకు వాటాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణల్ని సిబాల్ ఖండించారు. తేజ్ పాల్ తల్లి సిబాల్ చెల్లెలు అనే సందేశాలు సోషల్ మీడియా వెబ్ సైట్ లో విహారం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తనపై దుష్ఫ్రచారం మానుకోవాలని సిబాల్ విజ్క్షప్తి చేశారు. రాజకీయంగా తనపై దాడి చేసుకోవచ్చు. కాని తన కుటుంబాన్ని తేజ్ పాల్ వ్యవహారంలోకి లాగకూడదు. తేజ్ పాల్ తల్లి తనకు చెల్లెలు కాదు అని సిబాల్ అన్నారు. తెహల్కా వ్యవస్థాకులు, వాటాదారుడైన ఓ కేంద్ర మంత్రి తరుణ్ తేజ్ పాల్ ను రక్షిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీలపై తాను విమర్శిస్తున్నందునే తనపై దుష్ర్షచారాన్ని చేస్తున్నాయి అని ఆయన అన్నారు. తనకు తేజ్ పాల్ కు మధ్య ఉన్న సంబంధాలను బహిరంగపర్చాలని సిబాల్ సవాల్ విసిరారు. అంతేకాక కోట్లాది రూపాయల మైనింగ్ కుంభకోణానికి కారణమైన రెడ్డి బ్రదర్స్ ( గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర రెడ్డి)లను సుష్మా స్వరాజ్ కాపాడుతోంది అని సిబాల్ ఆరోపించారు. -
తరుణ్ తేజ్పాల్కు సమన్లు
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. తేజ్పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చని గోవా సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే సమన్లు జారీ కావడం విశేషం. రేపు తేజ్పాల్ ను అరెస్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. ఈ నెల మొదట్లో గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్లో మహిళా జర్నలిస్టును తేజ్పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తేజ్ పాల్ కేసులో 'గాడ్ ఫాదర్ 2'ను ప్రశ్నించనున్న పోలీసులు!
సహచర ఉద్యోగిపై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల పాల్పడ్డారని నమోదైన కేసు హాలీవుడ్ అగ్రనటుడు రాబర్ట్ డి నీరో మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో రాబర్డ్ డి నీరోకు ఎలాంటి ప్రమేయం లేకున్నా మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా రాబర్డ్ ను గోవా డీఐజీ ఓపి మిశ్రా ప్రశ్నించే అవకాశం ఉంది. తేజ్ పాల్ పై నమోదైన ఈ కేసులో 'గాడ్ ఫాదర్ 2' సాక్ష్యం కీలకంగా మారడంతో రాబర్ట్ ను విచారిస్తున్నామని మిశ్రా మీడియాకు తెలిపారు. వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరీ ఫిర్యాదు మేరకే రాబర్డ్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రాబర్డ్ డీ నిరోతో సమావేశమవ్వాలనే కారణంతో సహచర ఉద్యోగిని పిలిచి... లిఫ్ట్ లో లైంగికంగా వేధించినట్టు షోమా ఫిర్యాదు తెలిపింది. గోవాలో నవంబర్ 8, 9 తేదిల్లో తెహల్కా నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాబర్డ్ డి నీరో ప్రధాన వక్తగా వ్యవహరించారు. -
ఢిల్లీ కోర్టులో తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్ లో తెహల్కా గ్రూప్ నిర్వహించిన థింక్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తేజ్ పాల్ పై సహ ఉద్యోగి కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనపై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం తేజ్ పాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. -
వీఐపీలు వేధి స్తే అది నేరం కాదా?
-
తేజ్ పాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం!
పణజి/న్యూఢిల్లీ: సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గోవా పోలీసులు తేజ్పాల్పై సుమోటోగా అత్యాచార కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 376 (2) (అధికార హోదాను అడ్డంపెట్టుకొని ఓ మహిళను అధీనంలోకి తెచ్చుకొని అత్యాచారం చేయడం), 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం) కింద తేజ్పాల్పై కేసు నమోదు చేసిన గోవా క్రైం బ్రాంచి పోలీసులు ఆయన్ను ప్రశ్నించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఢిల్లీ పంపనున్నారు. ఆపై ఆయన్ను అరెస్టు చేసే అంశాన్ని కూడా తోసిపుచ్చడంలేదు. ఇటువంటి హైప్రొఫైల్ నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు కోరినా తెహెల్కా యాజమాన్యం ఇంకా స్పందించలేదని విమర్శించారు. ఈ కేసుకు సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా గోవా ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్ తెలిపారు. మరోవైపు ఈ కేసులో పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని తేజ్పాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు చెబుతున్న గోవాలోని హోటల్లో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించి వాటిని విడుదల చేయాలన్నారు. పోలీసులను ఆశ్రయించం: షోమా లైంగిక దాడి ఉదంతాన్ని అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఇప్పటికే విమర్శలపాలైన తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురి శుక్రవారం కూడా అదే ధోరణిలో స్పందించారు. ఈ వ్యవహారంలో తమకు తాముగా పోలీసులను ఆశ్రయించబోమని...దీనిపై బాధితురాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మీడియాకు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ తాను నిలదీయడం వల్లే తేజ్పాల్ బాధితురాలికి క్షమాపణ చెప్పడంతోపాటు ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నారని గుర్తుచేశారు. ఈ ఘటనపై అంతర్గత విచారణకు తేజ్పాల్కు స్నేహితురాలైన ప్రముఖ ప్రచురణకర్త ఊర్వశి బుటాలియా నేతృత్వంలో కమిటీ వేయడంపై ప్రశ్నించగా మీడియా ముందుగానే తీర్పు ఇచ్చేస్తోందని మండిపడ్డారు. -
ద్వంద్వ ప్రమాణాలు
చెప్పే మాటలకూ, చేసే చేష్టలకూ పొంతన లేనప్పుడు ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నవారినైనా సమాజం సహించదు. తీర్పరి స్థానంలో ఉన్నవారు తుంటరులని తేలితే ఊరుకోదు. కనుకనే తెహెల్కా పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ ప్రజలముందు దోషిగా నిలబడవలసివచ్చింది. ఒకప్పుడు రాజకీయ నాయకుల అవినీతిని, వారిలో కొందరి హంతకస్వభావాన్ని ‘స్టింగ్ ఆపరేషన్’లద్వారా బయటపెట్టి పెనుసంచలనం కలిగించిన పాత్రికేయుడు తరుణ్ తేజ్పాల్. ప్రగతిశీల భావాలున్న వ్యక్తిగా పేరున్నవాడు. కానీ, నైతిక విలువలకు సంబంధించి తనకు వేరే ప్రమాణాలున్నాయని తన ప్రవర్తనతో ఆయన నిరూపించాడు. పక్షం రోజుల క్రితం తెహెల్కా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన ‘థింక్ఫెస్ట్’ సమయంలో తనపై ఆయన లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ పత్రికలో పనిచేసే మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఈ విషయమై ఆ యువతి పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి ఫిర్యాదుచేశాక తన ప్రవర్తన ‘దురదృష్టకరమైనద’ని, అందుకు ప్రాయశ్చిత్తంగా ఆరునెలలపాటు పత్రికలో తనకున్న పదవినుంచి తప్పుకుంటున్నానని తరుణ్ ప్రకటించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. బహుశా ఆమె ధైర్యంగా ముందుకు రానట్టయితే ఆ ‘పశ్చాత్తాప’ ప్రకటనతో, ఆ బేషరతు క్షమాపణతో అంతా ముగిసి పోయేదేమో! ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నిత్యం కొనసాగే వేధింపుల జాబితాలో చేరిపోయేదేమో! కానీ, ఆమె అందరిలాంటి యువతి కాదు...జరిగిన ఘటనను కేవలం ‘పరిస్థితులను సరిగా బేరీజు వేసుకోలేని స్థితి’లో ఉన్న వ్యక్తి వల్ల సంభవించిన దురదృష్టకర ఘటనగా ఆమె భావించలేదు. సదస్సు సందర్భంగా బసచేసిన హోటల్లో తనను లిఫ్ట్లోకి నెట్టడమేకాక... ప్రతిఘటించినందుకు లిఫ్టును మధ్యలోనే కాసేపు నిలిచిపోయేలా చేశారని, మరుసటిరోజునా ఈ తంతు కొనసాగిందని ఆమె చెప్పారు. తరుణ్ తేజ్పాల్ క్షమాపణతో తాను సంతృప్తిచెందానన్న షోమా చౌధురి వాదనను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన వ్యక్తి ఆ పదవిలో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని మహిళా న్యాయవాది ఒకరు తెహెల్కా ఘటనకు కొద్ది రోజులముందే వెల్లడించారు. ఆయనవద్ద తనకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని అటుతర్వాత మరో మహిళా న్యాయవాది చెప్పారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమనదగ్గ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి పదవిలో ఉంటూ ఆయన ప్రవర్తించిన తీరుపై చర్చ జరుగుతున్నప్పుడే తేజ్పాల్ వ్యవహారం వెల్లడైంది. వీరిలో ఒకరు న్యాయమూర్తి స్థానంలో ఉండగా, రెండోవారు అలాంటి పనినే మీడియా ద్వారా చేస్తున్న వ్యక్తి. స్త్రీ-పురుష సమానత్వం విషయంలో భారత్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని ఈమధ్యే ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నివేదిక వెల్లడించింది. సమానత్వం విషయంలో అఫ్ఘానిస్థాన్ మినహా మన సమీప దేశాలన్నిటితో పోల్చినా మనం చాలా వెనకబడి ఉన్నామని ఆ నివేదిక హెచ్చరించింది. విద్య, ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఇక్కడ ఎంతగానో వెనకబడి ఉన్నారని నివేదిక చెబుతోంది. జాబితాలో మన స్థానం 132 కాగా... శ్రీలంక నుంచి పాకిస్థాన్ వరకూ ఇంతకన్నా మెరుగైన స్థానాల్లో ఉండి మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్లకు అమ్మ కడుపులో ఉన్నప్పటినుంచి మొదలయ్యే వివక్ష ఎదిగేకొద్దీ రకరకాల రూపాల్లో తారసపడుతోంది. నిత్యం వెల్లడవుతున్న అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలు ఈ వివక్ష వికృతరూపం తీసుకుంటున్న వైనాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి అటు న్యాయవ్యవస్థ, ఇటు మీడియా చేయాల్సింది ఎంతో ఉంది. ఆ పని సాగుతున్నది కూడా. కానీ, అందులో భాగంగా ఉండేవారే ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఏమిటన్న ఆందోళన కలుగుతుంది. నిరుడు డిసెంబర్లో నిర్భయ ఉదంతం జరిగాక దేశవ్యాప్తంగా సాగిన ఆందోళనలు, అనంతరం అమల్లోకి వచ్చిన నిర్భయ చట్టం మహిళల్లో ఎంతగానో చైతన్యాన్ని కలిగించాయి. కనుకనే మొన్న మహిళా న్యాయవాదులైనా, ఇప్పుడు మహిళా జర్నలిస్టు అయినా ధైర్యాన్ని ప్రదర్శించగలిగారు. అయితే, షోమా చౌధురి స్పందనే పేలవంగా ఉంది. ఆమె సుప్రసిద్ధ పాత్రికేయురాలు. స్వయంగా స్త్రీవాద భావాలు కలిగిన వ్యక్తి. కానీ, ఈ ఘటనను సంస్థ అంతర్గత వ్యవహారంగా చూపడానికి ఆమె మొదట చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేర పూరిత చర్యల్లో బాధితురాలు క్షమించినంత మాత్రాన జరిగిన నేరం సమసి పోదన్న ప్రాథమిక అంశాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోలేదు. గత వారం రోజులుగా బీజేపీ ఈ తరహా వాదననే వినిపించింది. గుజరాత్లో ఒక యువతిపై చట్టవిరుద్ధంగా పోలీసు బలగాలతో నిఘా పెట్టి, వెన్నాడారని వెల్లడైనప్పుడు ఆమె తండ్రే అలా చేయమన్నాడని చెప్పి చేతులు దులుపుకునేందుకు చూసింది. ఇప్పుడు బీజేపీ వాదనకూ, షోమా చెప్పినదానికీ తేడా ఏముంది? మహిళను గౌరవిస్తున్నామని, ఆరాధిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా వారిని న్యూనత పరచడం, వారి శక్తిసామర్ధ్యాలను తక్కువచేసి చూడటమనే అధమ సంస్కృతి సమాజంలోని అన్ని పొరల్లోనూ అలుముకుంది. కనబడే వివక్షనూ, హింసనూ ఎదుర్కోవడం ఒక ఎత్తయితే, ప్రచ్ఛన్నంగా అల్లుకుపోయిన ఇలాంటి ధోరణులను రూపుమాపడం మరో ఎత్తు. ఇందుకు కృషి చేయాల్సినవారే ఆ ధోరణులకు బానిసలు కావడం, రక్షకులే రాకాసుల్లా మారడం మన దేశంలో నెలకొన్న దురదృష్టకరమైన స్థితి. తెహెల్కా ఘటన తర్వాతనైనా అందరూ మేల్కొనాలి. పనిచేసే స్థలాల్లో మహిళలను మనుషులుగా గుర్తించే సంస్కృతిని, వారు ఆత్మగౌరవంతో మసిలే పరిస్థితులను కల్పించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
పోలీసులకు పూర్తిగా సహకరిస్తా: తేజ్పాల్
తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెహల్కా మేగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చెప్పారు. వాస్తవాలను పోలీసులకు తెలియజేస్తానని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి నివేదిక పంపాల్సిందిగా కేంద్ర హోం శాఖ గోవా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని శుక్రవారం ఆదేశించింది. కేసును సుమెటోగా స్వీకరించాలని సూచించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ...ఈరోజు ఉదయం బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. గోవా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించి వివరాలు సేకరించారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. -
తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
న్యూఢిల్లీ : సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే 'తెహల్కా' మేగజీన్ మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే ఏకంగా ఆ పత్రిక వ్యవస్థాపకుడు, ఎడిటర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం తన పదవికి ఆరు నెలల పాటు రాజీనామా చేశారు. గోవాలో ఆ పత్రిక నిర్వహించిన 'థింక్' ఫెస్టివల్ కార్యక్రమంలో తరుణ్ తేజ్పాల్ ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తెహల్కాను 2000లో ప్రారంభించిన తరుణ్ తేజ్పాల్ అంతకు ముందు అనేక ప్రముఖ పత్రికల్లో పనిచేశారు. అనతి కాలంలోనే అనేక సంచలన కథనాలను వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా మహిళా జర్నలిస్టుకు ఇతర మహిళలు నుంచి మద్దతు లభిస్తుంది. దీనిపై కిరణ్ బేడీ స్పందిస్తు లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని... అయితే చట్టం బాధితురాలికి అండగా ఉంటుందన్నారు. మరో మహిళ హక్కుల నేత కవిత కృష్ణన్ మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరు నెలల పాటు పదవికి దూరంగా ఉండటం చాలా చిన్న విషయమని అన్నారు. మరోవైపు తరుణ్ తేజ్పాల్ లైంగిక వేధింపుల వ్యవహారంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వివరాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.