కె.కోటపాడు : మండలంలోని ఎ.కోడూరులో కొలువై ఉన్న సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే వేల్పుగా విరాజిల్లుతున్నాడు. ఇక్కడ ఆలయాన్ని 1993లో గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకూ ఏకదంతుడికి నిత్యం విశేష పూజలను నిర్వహిస్తున్నారు. సిద్ధిబుద్ధి సమేత విఘేశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తే కోరికలు ఫలిస్తాయని భక్తుల నమ్మకం. దీంతో వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఇతర పర్వదినాల సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు విజయనగరం జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించు కుంటారు. ఇంత విశిష్టత కలిగిన ఆలయంలో ఈ ఏడాది వినాయక నవరాత్రి వేడుకలను శుక్రవారం నుంచి 15 వరకూ ఘనంగా నిర్వహించేందుకు పద్మశాలీ సేవా సంఘం సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. జిల్లాలో సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వరుని ఆలయం ఎ.కోడూరులో మాత్రమే ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు నవరాత్రి పర్వదినాల్లో ఇక్కడికి వస్తుంటారు. ప్రతి రోజూ ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణతో పాటు భజన కార్యక్రమాలను నిర్వహించనున్నాం.
– పొనగంటి రాంబాబు,
చైర్మన్, ఆలయ అభివృద్ధి కమిటీ,
ఎ.కోడూరు.
Comments
Please login to add a commentAdd a comment