చోడవరం రూరల్/కె.కోటపాడు: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ కార్మికులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్షణ్ డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికులతో కలసి శుక్రవారం ఆయన చోడవరం, కె.కోటపాడు సీహెచ్సీల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్ల జీవితాలతో కాంట్రాక్టర్లు ఆడుకుంటున్నారని దుమ్మెత్తి పోశారు. వేతనం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఐదు నెలలుగా దశలవారీగా ఉద్యమాలు, శాంతియుత పద్ధతిలో నిరసనలు చేస్తున్నప్పటికీ సంబంధిత జిల్లా స్థాయి అధికార యంత్రాంగం దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టార్జితం పీఎఫ్ సొమ్మును సైతం కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 15వ తేదీలోగా వారికి బకాయి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో ప్రకారం జీతాలు పెంచాలన్నారు. 2021 జూన్ నుంచి రావలసిన వేతనానికి తగిన పీఎఫ్ లెక్కలు వెల్లడించి, తక్షణం జమ చేయాలని, ఈఎస్ఐ కార్డులు ఇవ్వకుండానే ప్రతి నెలా వేతనంలో కోత పెడుతున్న మొత్తానికి అణాపైసలతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15లోగా సమస్యలు పరిష్కారం కాకుంటే మరుసటి రోజు నుంచి విధులు బహిష్కరిస్తామని కార్మికులు హెచ్చరించారు. పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది అరుణ, దేముడమ్మ, సత్యవతి, ఈశ్వరమ్మ, నాగేశ్వరరావు, అప్పలరాజు, శ్రీను, రామారావు, మంగ, నూకరత్నం, కోటిబాబు, నూకరాజు, కుమారి పాల్గొన్నారు.
చోడవరం, కె.కోటపాడులో
పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది నిరసన
Comments
Please login to add a commentAdd a comment