వాల్మీకిపురం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ అన్నారు. గురువారం మండలంలోని చింతపర్తి పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ పరిధిలోని నాయనవారిపల్లిలో నిర్వహిస్తున్న లార్వా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు నిల్వ ఉంచుకున్న డ్రమ్ములు, బకెట్లను పరిశీలించి లార్వాలను గుర్తించారు. ప్రజలకు లార్వా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఫ్రైడే డ్రైడేగా పాటించాలని సూచించారు. అనంతరం చింతపర్తిలో ఉన్న బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను సందర్శించారు. కిటికీలకు రంద్రాలు లేకుండా మెష్ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సనా అయేషా, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, సబ్ యూనిట్ అధికారి ముజీబ్, సూపర్వైజర్ సుధాకర్, హాస్టల్ వార్డెన్ రవీంద్ర, ఎఎన్ఎం హృదయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పశువైద్య కళాశాలలో ప్రవేశాలు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో గురువారం 2024–25 సంవత్సరానికి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. 28వ తేదీ వరకు ప్రవేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా మొత్తం 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించామన్నారు. వీరిలో 15 మంది వీసీఐ కోటా ద్వారా ప్రవేశం పొందారన్నారు. ఈనెల 28న ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తామని, 30వ తేదీ నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
పలువురు సబ్ రిజిస్ట్రార్ల బదిలీ
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కడప జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లను అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు.. జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్గా ఉన్న లక్ష్మిదేవిని తిరుపతి అర్బన్కు బదిలీ చేశారు. సిద్దవటం సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న రాజా చంద్రమౌళిని నంద్యాల జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్గా బదిలీ చేశారు. కడప జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్గా బి.హరికృష్ణ, రూరల్ సబ్ రిజిస్ట్రార్గా ఎస్.నజీర్, సిద్దవటంకు శ్రీనివాసమూర్తి, పులివెందుల చంద్రమోహన్, ముద్దనూరు జీవీ రత్నమ్మ, బద్వేలుకు విద్యాసాగర్రెడ్డి, మైదుకూరుకు దూదేకుల మహబూబ్బాష, జమ్మలమడుగుకు మహమ్మద్ అజీబుల్లా, కమలాపురానికి డి.మహబూబ్బాషా, ప్రొద్దుటూరు జాయింట్–1కు జీఎన్జే రామదాసు, ప్రొద్దుటూరు జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్గా బి.పార్వతిలను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కడప జాయింట్–1, వేంపల్లె సబ్ రిజిస్ట్రార్లుగా ఎవరినీ నియమించకపోవడం గమనార్హం.
హార్సిలీహిల్స్కు అవార్డు
రాయచోటి: హార్సిలీహిల్స్ ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఎంపికై ంది. శుక్రవారం విజయవాడలో పర్యాటక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. హార్సిలీహిల్స్ ఉత్తమ పర్యాటక ఫిలిం షూటింగ్ ప్రదేశంగా ఎంపికై ంది. విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం అవార్డును అందుకోనున్నారు.
నేడు గండికోటకు
ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గండికోటకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ ధనలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కడప నుంచి ఉదయం 9, మధ్యాహ్నం 12.00 గంటలకు స్పెషల్ సర్వీసులను నడుపుతున్నామని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.30 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయన్నారు. అలాగే జమ్మలమడుగు నుంచి గండికోటకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంటకో బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు , వారి తల్లిదండ్రులు, పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment