తంబళ్లపల్లె: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో వారంలోగా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ కేసుల గురించి అరా తీశారు. ఆరోగ్యశ్రీ కేసులు తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. విధి నిర్వహణపై మెడికల్ ఆఫీసర్ వెంకటరామయ్యను అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా ఆస్పత్రికి ఎలాంటి కేసులు వస్తాయి, ప్రీడియాట్రిక్ కేసులు ఎన్ని? ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి? కొరత ఏమైనా ఉందా? సెంట్రల్ డిస్పెన్సరీకి మందుల ఇండెంట్ ఎప్పుడు పెడతారు? రాత్రి వేళ ఎంత మంది వైద్యులు,సిబ్బంది విధుల్లో ఉంటారు..తదితర అంశాలపై ఆరా తీశారు. మందుల రికార్డులు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు రోజు అప్డేట్ చేయాలని మెడికల్ ఆఫీసర్, సిబ్బందిని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్,ఆపరేషన్ థియేటర్, ఇన్పేషంట్ల వార్డులు, బెడ్లు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సీహెచ్సీలో నెలకు 20–30 ప్రసవాలు జరుగుతుంటే ఇక్కడ 7 మాత్రమే జరగడం ఏమిటని ప్రశ్నించారు. ప్రసవాల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనంలో ఆపరేషన్ థియేటర్ పనుల గురించి మెడికల్ ఆఫీసర్ కలెక్టర్కు తెలపగా అది ఏర్పాటయ్యేలోపు వారం రోజుల్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు త్వరలో నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అర్థోపెడిక్, ఈఎన్టీ వైద్యులు లేరని తమ దృష్తికి వచ్చిందని ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. ఇక్కడ పని చేసే డెంటల్ డాక్టర్ డిప్యుటేషన్పై వెళ్లారని దీనిని రద్దు చేసి ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి గతంలో ఉన్న గేటు వద్ద దారి సమస్య ఉందని ఆస్పత్రి స్థలాన్ని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ హరిప్రసాద్ను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్, ఎంఈఓ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
● ప్రసవాల సంఖ్య పెంచాలి
● జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
Comments
Please login to add a commentAdd a comment