గత నెల 22న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆమోదముద్రతో వచ్చిన రిలీవ్ ఆర్డర్లను మండల అధికారులు అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ పార్టీ ముఖ్య నేత, ఆయన పీఏ ఆమోదం ఉంటేనే విధుల్లోకి తీసుకుంటామని వారు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఎంపీడీవో కార్యాలయం చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు సచివాలయాల ఉద్యోగులు.
చీరాల టౌన్: చీరాల నియోజకవర్గంలోని చీరాల మండలంలో 22, వేటపాలెం మండలంలో 18 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో వెల్ఫేర్ అసిస్టెంట్లు 15, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు 15, డిజిటల్ అసిస్టెంట్లు 15 మందికి గత నెల 22న జిల్లా కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు అందించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో గ్రామ సచివాలయాల ఉద్యోగులను రిలీవ్ ఆర్డర్లు, జాయినింగ్ ఆర్డర్లతో ఈ నెల 4వ తేదీ నుంచి మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు తిరుగుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ ఆర్డర్ వచ్చిన 15 రోజుల్లోగా విధుల్లో చేరాలి. అదే ప్రమోషన్ వచ్చిన ఉద్యోగి అయితే 30 రోజుల్లోగా విధుల్లో చేరి తన సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలి. చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో మాత్రం బదిలీ అయిన 45 మంది సచివాలయాల ఉద్యోగులకు ఆర్డర్ వచ్చి నెల సమీపిస్తున్నా విధుల్లో చేర్చుకోలేదు. పరిపాలన విషయాలు, ఉద్యోగుల బదిలీలు వంటి పనుల్లో ఆయన పీఏ తీరుపై పలువురు ఉద్యోగులు, మండల అధికారులు, కూటమిలోని నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. మండల పరిషత్ అధికారులు కూడా మోకాలొడ్డుతూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. మండల స్థాయి అధికారికి జిల్లా కలెక్టర్ బదిలీల ఉత్తర్వుల కంటే ముఖ్య నేత రిఫరెన్స్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి అనుమతి ముఖ్యమైంది.
నాలుగు రోజుల్లో చేర్చుకుంటాం
సచివాలయాల ఉద్యోగుల బదిలీలు, జాయినింగ్ల విషయంలో కొంత కాలయాపన జరిగిన మాట వాస్తవమే. కొన్ని అవాంతరాలు ఇప్పుడే సర్దుకుంటున్నాయి. నాలుగు రోజుల్లో బదిలీ అయిన ఉద్యోగులందర్నీ విధుల్లోకి చేర్చుకుంటాం.
–శివసుబ్రమణ్యం, ఎంపీడీవో, చీరాల
Comments
Please login to add a commentAdd a comment