ఏజెన్సీని పట్టించుకోవడం లేదనే విమర్శలు..
● భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు డిమాండ్ ● రామాయణ కారిడార్, టూరిజం హబ్ ఏర్పాటుచేయాలి ● భద్రాచలం వరకు రైల్వే లైన్ పొడిగించాలి ● ఎన్నికల వేళ పలు పార్టీలు, సంఘాల నేతల విన్నపం
భద్రాచలం పట్టణ వ్యూ
భద్రాచలం: తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గిరిజనులకు భద్రాచలం కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద ఏజెన్సీ ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతమిది. వివిధ జాతుల ఆదివాసీలు, గిరిజనులు వారి సంస్కృతి, సంప్రదాయాలకు నెలవై ఉన్న కేంద్రంగా విరాజిల్లుతోంది. అయితే అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు అందిస్తున్న స్వయం ఉపాధి, ఇతర పథకాలు కొంతమేర మాత్రమే సత్పలిస్తున్నాయనే అపవాదు ఉంది. ఏజెన్సీలో ఇప్పటికీ విద్య, వైద్యం, తాగునీరు అందని గ్రామాలెన్నో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని పలు పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు అంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘గిరిజనులకు కేంద్రం అందించాల్సిన అభివృద్ధి’ అనే అంశంపై సాక్షి అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించింది.
గిరిజనులకు అనాదిగా అన్యాయం..
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులకు కేంద్ర ప్రభుత్వాలు అనాదిగా అన్యాయం చేస్తూనే ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. పలు గ్రామాలను ఏపీలో విలీనం చేయడం, భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని తరలించడం వంటివి తీరని వ్యథగానే మిగిలాయని అంటున్నారు. కేంద్రంలో త్వరలో కొలువుదీరనున్న ప్రభుత్వం అయినా భద్రాచలంలో విద్య, వైద్యం, రవాణా, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. నాలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న భద్రాచలం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి
నాలుగు రాష్ట్రాల గిరిజనుల వైద్య సేవలకు ఇప్పటికీ భద్రాచలమే దిక్కు. అరకొర వైద్యులు, సిబ్బంది, వసతులతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ప్రభుత్వ వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. ప్రతీ ఆదివాసీ గిరిజనుడికి ఉచిత వైద్యం పటిష్టంగా అందేలా చర్యలు తీసుకోవాలి. – ముర్ల రమేష్,
ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు