అయినవిల్లికి పోటెత్తిన భక్తజనం
అయినవిల్లి: వినాయకా భజేహం అంటూ ఆ స్వామివారిని భక్తజనం కొలిచి తరించింది.. ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో కిక్కిరిసింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ ఉచిత దర్శనాలు కల్పించడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. తెల్లవారు జామున 4 గంటల నుంచి ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పంచామృతాభిషేకాలు, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, లక్ష గరిక పూజ, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం స్వామికి పంచ హారతులు ఇచ్చారు. రాత్రి ఏర్పాటైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయం వద్ద విద్యుత్ దీపాల అలంకరణ ఆకట్టుకుంది. పుష్పాలంకరణతో ఆలయ ప్రాంగణం కనువిందు చేసింది. స్వామివారిని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, మంత్రి వాసంశెట్టి సుభాష్ తదితరులు దర్శించుకున్నారు. చవితి మహోత్సవాల సందర్భంగా ఆలయానికి శని, ఆదివారాల్లో రూ.7,64,312 ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి అన్న ప్రసాదాన్ని 16 వేల మంది స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment