పట్నంబజారు: కోర్టు కానిస్టేబుళ్ల వ్యవహార శైలిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కాణి’స్టేబుళ్లు..! అనే కథనంపై అధికారులు స్పందించినట్లు సమాచారం. దీనిపై విచారణ చేపట్టాలని ఒక ప్రత్యేక విభాగ అధికారులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాన్ని ఐదేళ్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్న అంశంలో బాధితుడి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోర్టు కానిస్టేబుల్ మాత్రం కొంతమంది అధికారుల ద్వారా బయటపడేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఆ బైకును స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడి అధికారి, కోర్టు కానిస్టేబుల్ ఎవరనే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. కోర్టులో ఏ కోర్టు అధికారికి గిఫ్ట్గా వాహనాన్ని ఇచ్చారనే కోణంలో కూపీ లాగుతున్నారు. ఇదే కానిస్టేబుల్ గతంలో ఒక దాడిలో పట్టుకున్న నాటు కోళ్లను కూడా విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితుడికి అప్పజెప్పాల్సిన వాహనాన్ని పోలీసులే ఇలా వాడుకున్న పరిస్థితుల్లో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాటి కానిస్టేబుల్నే రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ విషయంపైనా ప్రత్యేక విభాగం అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ అంశాల్లో కోర్టులో పనిచేసే కొంత మందికి భాగస్వామ్యం ఉండటంతో వారి పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లా కోర్టులో అందరు కానిస్టేబుళ్లు సిండికేట్గా ప్రతి నిర్ణయం తీసుకుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆరోపణలపై ఎలా వ్యవహరించాలనే సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఏళ్ల తరబడి వారు కోర్టును పట్టుకుని వేలాడుతున్నారు. బదిలీ సమయంలో స్టేషన్లు మారినా తిరిగి కోర్టు విధులకే రావడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా శాఖను ప్రక్షాళన చేస్తున్న ఎస్పీ సతీష్కుమార్.. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
ఎస్పీ ఆదేశాలతో రహస్యంగా వివరాల సేకరణ
ఇప్పటికే ‘సిండికేట్’ సమాలోచనలు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment