వందేళ్ల తమ తల్లి పుట్టిన రోజు వేడుకను వారసులు ఘనంగా నిర్వహించారు. అందరి కుటుంబాల సభ్యులందరూ కలిసిన ఆ సమయంలో ఎంతో ఆనందంగా గడిపారు. ఈ అరుదైన కార్యక్రమం గుంటూరులో శుక్రవారం జరిగింది. ముప్పాళ్ల అరుంధతీదేవి శత జన్మదినోత్సవాన్ని బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితిలో కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరానికి చెందిన దొంతరాజు శ్రీరాములు, మీనాక్షమ్మ దంపతుల కుమారుడైన మనోహరరావు సతీమణి అరుంధతీదేవి. కుమారులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను సత్కరించుకుని, పాదాభివందనం చేశారు. వేడుకలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది కవిపురపు పట్టాభిరాముడు మాట్లాడుతూ.. విద్యావంతురాలైన అరుంధతీదేవి పెద్ద బాలశిక్ష కంఠస్థం చేయడంతోపాటు రామాయణ, భారత, భాగవతం వంటి పురాణ గ్రంథాలను వల్లె వేశారని అన్నారు. గాంధీ పిలుపు మేరకు స్వరాజ్య సంగ్రామంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి సమరయోధులతో కలిసి పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో అరుంధతీదేవి వారసులు గోపాలకృష్ణమూర్తి, రామారావు, శివప్రసాద్, ప్రభాకరరావు, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, కవిపురపు రుక్మిణీదేవి, ఆంజనేయులు, చింతపల్లి శకుంతల, శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. – గుంటూరు ఎడ్యుకేషన్
Comments
Please login to add a commentAdd a comment