గుంటూరు వెస్ట్: జిల్లాలోని వయోవృద్ధుల సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో జిల్లా స్థాయి డిజేబిలిటీ, సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ చట్టం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు. జిల్లాలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్స్కు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాల్లో ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులను చేర్చాలని తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలు త్వరగా అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, సీహెచ్ పరమేశ్వరరెడ్డి, యూవీవీ రత్నసాగర్ పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ
Comments
Please login to add a commentAdd a comment