చేబ్రోలు: పురుగుల మందు తాగి ఇరువురు గుర్తుతెలియని వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో మహిళ మృతి చెందగా.. మరో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారులోని పెట్రోలు బంకు సమీప పొలంలోని వేప చెట్టు కింద గుర్తు తెలియని వ్యక్తి, మహిళ శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగారు. మహిళ అక్కడికక్కడే మరణించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. పొలానికి వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. వారొచ్చి ఆ వ్యక్తిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చేబ్రోలు ఎస్ఐ డి. వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరి వివరాలు తెలిస్తే 86888 31384 కు ఫోను చేయాలని తెలిపారు. వీరిద్దరు నారాకోడూరు లేక పరిసర గ్రామాలకు చెందిన దంపతులు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మహిళ మృతి.. అపస్మారక స్థితిలో మరో వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment