గుంటూరు వెస్ట్ (క్రీడలు): రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జిమ్నాస్టిక్స్ అండర్– 14, 17 బాలబాలిక చాంపియన్షిప్–2024ను గుంటూరు జిల్లా కై వసం చేసుకుంది. మూడు రోజుల నుంచి స్థానిక బీఆర్ స్టేడియంలో జరుగుతున్న పోటీలు శనివారంతో ముగిశాయి. ద్వితీయ, తృతీయ స్థానాలలో తూర్పు గోదావరి, కడప జిల్లాలు నిలిచాయి. విజేతలకు డీఎస్డీఓ నరసింహారెడ్డి, సక్కు గ్రూప్ అధినేత మాధవి, రాయపాటి మమత తదితరులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ పోటీలకు ఎంతో మంది సహకారం అందించారన్నారు. పోటీల నిర్వహణ భవిష్యత్తుకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో కోచ్ అఫ్రోజ్, డాక్టర్ కంచర్ల రామ్ప్రసాద్, శిరీష, జి.రాజేష్, కార్పొరేటర్ మీరావలి పాల్గొన్నారు.
రుచికరమైన
భోజనం అందించాలి
నగరంపాలెం: రుచికరమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి అన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు తెన్నులపై శనివారం గుంటూరు నగరంలోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంపాలెం పరిధిలోని స్టాల్ బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ ఉన్నత పాఠశాల, మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం ప్రైమరీ, ఉన్నత పాఠశాల, కేవీపీ కాలనీలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, చుట్టుగుంటలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతోనూ మాట్లాడారు. సక్రమంగా ఆహారం, నీరు అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఏవైనా లోపాలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తేవాలని చెప్పారు.
నకిలీ నిందితుడి పట్టివేత
లక్ష్మీపురం: గుంటూరు జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ 4వ అదనపు కోర్డులో నకిలీ నిందితుడు విచారణకు హాజరు కావడంతో సంబంధిత కోర్టు న్యాయమూర్తి పట్టుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత కోర్టు పరిపాలనా అధికారి ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ కేసులో ఏ9 గా ఉన్న జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి శనివారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆయన స్థానంలో సునీల్ అనే వ్యక్తి హాజరు అవుతున్నట్లు గత రెండు రోజుల క్రితమే కోర్టుకు మానవ హక్కుల పోరాట సమితి నుంచి ముందుగా లేఖ వచ్చింది. శనివారం సునీల్ వచ్చాడు. న్యాయమూర్తి అతడిని పట్టుకుని ఐడీ కార్డులను, ఆధార్ కార్డులు, సంతకాలను పరిశీలించారు. అతడితోపాటు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆ మేరకు కోర్టు పరిపాలనాధికారి శివ సుబ్రహ్మణ్యం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సునీల్ని పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు.
హుండీ కానుకల లెక్కింపు
పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో శనివారం హుండీ కానుకల లెక్కింపు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. పెదకాకాని శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు శ్రీఅగస్తేశ్వరస్వామి వారి దేవస్థానం ఈవో ఎన్ఎల్టీ సౌమ్య పర్యవేక్షణాధికారిణిగా విచ్చేశారు. 90 రోజులకుగాను రూ.40,49,823 నగదు ఆదాయం చేకూరింది. 24.700 మిల్లీ గ్రాములు బంగారం, 432 గ్రాములు వెండి , విదేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా లభించినట్లు ఆలయ డీసీ తెలిపారు. అన్నప్రసాద హుండీ ద్వారా రూ.54,658 ఆదాయం చేకూరిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment