జనగామ రూరల్: ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేయడం, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు అసంతృప్తిలో ఉన్నారని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టే ఖర్చులన్నీ పెడుతూనే ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలకే ఆర్థిక పరిస్థితి ఆటంకం అవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. పది నెలలు గడిచినా ఉద్యోగ ఉపాధ్యాయుల ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. ధరల సూచీకి అనుగుణంగా ప్రతీ ఆరు నెలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించబడుతుంది. గత ప్రభుత్వం మూడు వాయిదాల డీఏ బకాయి పడితే ఈ ప్రభుత్వం వచ్చాక మరో రెండు కలవగా మొత్తం ఐదు వాయిదాల డీఏలు బకాయి పడిందన్నారు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు వాయిదాల డీఏ అయినా ఇస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో కేవలం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేయటం ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే మూడు డీఏలు ప్రకటించాలని, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న సాధారణ భవిష్య నిధి, సంపాదిత సెలవు, వైద్య ఖర్చులు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
టీపీటీఎఫ్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment