భూపాలపల్లి: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా నమోదు చేయాలని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకు రాగా ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారాలను టీంల ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అన్ని టీంలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచామన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎఫ్ఎస్టీ,
అకౌంటింగ్ టీం అధికారులు విధుల నిర్వహణపై అవగాహన కార్యక్రమం చేపట్టి, నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించామని తెలిపారు. వ్యయ పరిశీలకుడు ధీరజ్ సింగా మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎంసీఎంసీ ద్వారా చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్) ప్రకటనలకు, కరపత్రాలు, పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి వ్యయాలను నమోదు చేయాలని చెప్పారు. దినపత్రికలలో వచ్చే పెయిడ్ న్యూస్పై ఎంసీఎంసీ కమిటీ ద్వారా ప్రతీరోజు దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు
ధీరజ్ సింగా