రెంజల్(బోధన్): ఉదయం త్వరగా నిద్రలేవాలని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన గాజ సాయిలు, గాజ లావణ్య(36) భార్యాభర్తలు. ప్రతి రోజూ ఉదయం లావణ్య ఆలస్యంగా నిద్రలేస్తుండడంతో భర్త మందలించేవాడు. మంగళవారం కూడా లావణ్య ఆలస్యంగా నిద్రలేవడంతో సాయిలు మందలించాడు. దీంతో క్షణాకావేశంలో లావణ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి త్లలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తల్లి విడిచివెళ్లిపోయిందని యువకుడు..
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): తండ్రి మృతి చెందగా, తల్లి తనను విడిచివెళ్లిపోయిందని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మల్లయ్యపల్లి గ్రామపరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భిక్కనూర్ గ్రామానికి చెందిన బేస్త కృష్ణ (20) గొర్రెలు మేపేందుకు మంగళవారం ఉదయం మల్లయ్యపల్లి శివారుకు వెళ్లాడు. అయితే, కృష్ణ తండ్రి గతంలో మృతి చెందగా, తల్లి సైతం అతడిని వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జీవితంపై విరక్తితో ఉన్న కృష్ణ మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దనాన్న బీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.