బళ్లారి అర్బన్: పని చేసే చోట మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార సభ్యుడు, జిల్లా సీనియర్ న్యాయమూర్తి రాజేష్ ఎన్.హొసమని తెలిపారు. ఇక్కడి వీకేవీవీలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వ మానసిక ఆరోగ్య దినాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఇటీవల పెద్దలతో పాటు పిల్లల్లో కూడా మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు అందరూ స్వేచ్ఛాయుతంగా మాట్లాడుకోవాలన్నారు. జిల్లా మనో రోగ నిపుణులు డాక్టర్ రోహన్ వనగుంది మాట్లాడుతూ మానవులు శరీర ఆరోగ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యతను మానసిక ఆరోగ్యానికి కూడా ఇవ్వాలన్నారు. జీవితంలోనే ఎత్తు పల్లాలు, సాధక, బాధకాలు ఉంటాయన్నారు. వీటి నుంచి కాపాడుకునేందుకు తప్పకుండా అవసరమైనప్పుడు సైకియ్రాటిస్టులను కలిసి సలహాలు తీసుకోవాలన్నారు. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని స్థిమిత పరుచుకోవచ్చన్నారు. దాదాపు 30 శాతం వరకు ప్రజలు మనోవ్యాధితో బాధపడుతున్నారని జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ వీరేంద్రకుమార్ అన్నారు. 15– 25 ఏళ్లకే మనో వ్యాధి ఎక్కువగా కనబడుతోందన్నారు. దీని వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. సహాయం కోసం 14416కు ఫోన్ చేస్తే 24 గంటల పాటు సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో డీహెచ్ఓ డాక్టర్ రమేష్బాబు, రిజిస్ట్రార్ రుద్రేష్, డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ ఇంద్రాణి, ఈశ్వర్ దాసప్పనవర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment