పరిహారం పంపిణీలో జాప్యం వద్దు
శివాజీనగర: వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు పరిహారం పంపిణీలో జాప్యం చేయవద్దని సీఎం సిద్దరామయ్య సూచించారు. శనివారం ఆయన తన కార్యాలయం కృష్ణా నుంచి అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయతీ ప్రధాన కార్యనిర్వహణాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల భారీ వర్షాలకు జరిగిన నష్టంపై 3–4 రోజుల్లో సమీక్ష పూర్తికానున్నదని, ఒక వారంలోపు నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. వర్షాలకు మృతి చెందినవారికి, కూలిన ఇళ్లకు 48 గంటల్లో పరిహారం అందజేయాలని ఆదేశించారు. రైతులకు పంటల బీమా పరిహారాన్ని త్వరగా పంపిణీ చేయాలని సూచించారు. ధ్వంసమైన రోడ్లు, వంతెనలను పునరుద్ధరించాలని ఆదేశించారు. జిల్లాధికారుల పీడీ ఖాతాల్లో రూ.551.25 కోట్లు, తహసీల్దార్ ఖాతాల్లో రూ.117.71 కోట్లు ఉందని, ఆ మొత్తాన్ని పరిహారం పంపిణీకి వినియోగించుకోవాలన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. ఇళ్లను కోల్పోయిన వారు తిరిగి ఇళ్లను నిర్మించుకునేందుకు సహకారం అందించాలన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలన్నారు. వర్ష పీడిత ప్రాంతాల్లో కలెక్టర్లు పర్యటించి బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. మంత్రులు చెలువరాయస్వామి, కృష్ణభైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, సంతోష్లాడ్, భైరతి సురేశ్, చీఫ్ విప్ అశోక్ పట్టణ్, చీఫ్ సెక్రటరీ శాలిని రజనీశ్ తదితరులు పాల్గొన్నారు.
పీడీ ఖాతాల్లో ఉన్న నిధులు వినియోగించండి
కలెక్టర్లకు సీఎం ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment