కండక్టర్‌పై పోకిరీ దాడి | - | Sakshi
Sakshi News home page

కండక్టర్‌పై పోకిరీ దాడి

Published Mon, Oct 28 2024 12:52 AM | Last Updated on Mon, Oct 28 2024 12:51 AM

కండక్టర్‌పై పోకిరీ దాడి

కండక్టర్‌పై పోకిరీ దాడి

కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో బీఎంటీసీ డ్రైవర్‌, కండక్టర్‌ల తరచూ ఎక్కడో ఒకచోట దాడులు జరుతున్నాయి. శనివారం సాయంత్రం ట్యానరీ రోడ్డులో బీఎంటీసీ బస్‌ వెళ్తుండగా, బైక్‌పై ఇద్దరు యువకులు అడ్డుగా వచ్చారు. బస్సు డ్రైవర్‌ వారిని పక్కకు వెళ్లమని వారించాడు. దీంతో యువకుల్లో ఒకరు డ్రైవర్‌ను దూషించాడు. అడ్డుకోవడానికి వెళ్లిన కండక్టర్‌పై యువకుడు పిడిగుద్దులతో దాడి చేశాడు. స్థానికులు దుండగున్ని అడ్డుకున్నారు. కండక్టర్‌కు ముఖం, నడుం భాగంలో గాయాలయ్యాయి. ఆ సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. స్థానికులు వచ్చి కండక్టర్‌ను ఆస్పత్రికి తరలించారు. కేజీ హళ్ళి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసునమోదు చేశారు. కాగా దుండగులు పరారయ్యారు. అక్కడి సీసీ కెమెరాలలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి.

ఉచిత ప్రయాణానికి

డబ్బులు వసూలు

మైసూరు: కేఎస్‌ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల నుంచి కండక్టర్‌ డబ్బులు తీసుకొని ఉచిత టికెట్‌ ఇచ్చాడు. ఈ సంఘటన చామరాజనగరలో జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని కొందరు ఇలా సొమ్ము చేసుకుంటున్నారు. బేడరపుర నుంచి చామరాజనగరకు వెళ్లే బస్సులో ఈ తంతు జరిగింది. కొంతమంది ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ఇదేమిటని కండక్టర్‌ను ప్రశ్నించగా సమర్థించుకున్నాడు. కొందరు కండక్టర్లు డబ్బులు తీసుకుని ఉచిత టికెట్‌ ఇస్తున్నారంటూ అనేక మంది ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

భార్యపై భర్త వేధింపులు

శివాజీనగర: భార్య, ఆమె మాజీ ప్రియుని ప్రైవేట్‌ వీడియోలను ఇంటర్నెట్‌లో ఉంచుతానని భర్త బెదిరిస్తున్న విచిత్రమైన కేసు బెంగళూరులో నమోదైంది. భర్త ప్రసన్నపై భార్య (25) ఈ మేరకు బ్యాడరహళ్ళి ఠాణాలో ఫిర్యాదు చేసింది. ప్రసన్న ఏ పనీ చేయకుండా క్రికెట్‌ బెట్టింగ్‌, మద్యపానంలో మునిగి తేలేవాడు. ఇంట్లో భార్యతో గొడవపడి కొట్టేవాడు. నిందితుడు తన భార్య మొబైల్‌ను చూస్తుండగా అందులో మాజీ ప్రియునితో కూడిన ప్రైవేటు ఫోటోలు, వీడియోలు కనిపించాయి. వాటిని తన ఫోన్‌కు పంపించుకొన్న నిందితుడు భర్త, నెట్‌లో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని భార్యను వేధించసాగాడు. ఆ వీడియోలను స్నేహితులకు పంపాడు. నిన్ను, నీ ప్రియున్ని చంపేస్తానని భార్యను బెదిరించేవాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

నేడు దర్శన్‌ బెయిలుపై తీర్పు

సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయి బళ్లారి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ బెయిల్‌పై సోమవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దర్శన్‌ మెడికల్‌ రిపోర్టును జైలు అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. దర్శన్‌ వెన్నునొప్పి ఉందని చెబుతున్నారు. ఇటీవలే వైద్యులు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేశారు. ఈ వైద్య నివేదికను జడ్జి పరిశీలిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement