రూ. 6.56 కోట్లు హుష్కాకి
బనశంకరి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఇబ్బడిముబ్బడిగా లాభం వస్తుందని పారిశ్రామికవేత్తను నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ.6.56 కోట్లు దోచేశారు. బెంగళూరు శాంతినగర నివాసి మోహిత్ గోయల్ బాధితుడు. వివరాలు.. గత నెల 8వ తేదీన గుర్తుతెలియని నెంబరు నుంచి మోహిత్గోయల్ వాట్సాప్కు స్టాక్మార్కెట్లో పెట్టుబడి ప్రకటన వచ్చింది. తరువాత ఆయనను మోసగాళ్లు తమ వాట్సాప్ గ్రూప్లో చేర్చుకున్నారు. అందులో నిత్యం స్టాక్మార్కెట్ గురించి పోస్టులు వచ్చేవి. కొందరు తమకు ఎంత మొత్తంలో లాభం వచ్చిందీ చిలవలు పలవలుగా చెప్పేవారు.
తరువాత బాధితునికి ఓ లింక్ను పంపించి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అకౌంట్ తెరిచి నగదు పెట్టుబడి పెట్టాలని సూచించారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేసి పెట్టుపెడ్డి పెట్టసాగాడు. పలు బ్యాంకు అకౌంట్ల నుంచి ఒకటిన్నర నెలలో రూ.6.56 కోట్లు పెట్టుబడి పెట్టాడు. బాగా లాభం వచ్చినట్లు యాప్లో కనిపించేది. డబ్బు విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీనిపై విచారించడానికి ఫోన్ చేయగా సమాధానం లభించకపోవడంతో ఇది సైబర్ వంచన అని గుర్తించి కేంద్ర విభాగ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏయే బ్యాంకు అకౌంట్లకు పారిశ్రామికవేత్త నగదు బదిలీ చేశాడు అనేదానిపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఆయా బ్యాంకులకు సమాచారం పంపించి అకౌంట్లను పరిశీలిస్తున్నారు. ఇది అంతర్జాతీయ సైబర్ వంచన కాగా స్థానికులు, విదేశీయుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు.
పారిశ్రామికవేత్తకు
సైబర్ మోసగాళ్ల శఠగోపం
పోలీసుల దర్యాప్తు
Comments
Please login to add a commentAdd a comment