‘తమ్ముళ్ల’కు కిక్కేకిక్కు! | - | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’కు కిక్కేకిక్కు!

Published Tue, Feb 11 2025 1:03 AM | Last Updated on Tue, Feb 11 2025 1:03 AM

‘తమ్మ

‘తమ్ముళ్ల’కు కిక్కేకిక్కు!

కర్నూలు: మద్యం సిండికేట్‌లో తెలుగు తమ్ముళ్లు( టీడీపీ నాయకులు, కార్యకర్తలు) కీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండో విడత వీరికే ఎక్కువగా మద్యం దుకాణాలు దక్కాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గీత ఉప కులాలకు కేటాయించిన 21 మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ఎంపిక కర్నూలులో జిల్లాపరిషత్‌ సమావేశ భవనంలో నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య, ఎకై ్సజ్‌ నోడల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి, సూపరింటెండెంట్‌ సుధీర్‌ బాబు, నంద్యాలలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, డీఆర్వో రామ్‌నాయక్‌, ఈఎస్‌ రవికుమార్‌ల ఆధ్వర్యంలో లక్కీడిప్‌ (లాటరీ ప్రక్రియ) జరిగింది. 21 మద్యం దుకాణాలకు 234 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్‌ నిర్వహించి లైసెన్స్‌దారులను ఎంపిక చేశారు. ఎకై ్సజ్‌ పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గీ త కులాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన 2024–25 సంవత్సరానికి మద్యం దుకాణాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో లక్కీడిప్‌ ద్వారా లైసెన్స్‌ దారులను ఎంపిక చేసి ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు.

రెండు దుకాణాలు మహిళలకు...

ఉమ్మడి జిల్లాలో గీత ఉప కులాలకు కేటాయించిన 21 దుకాణాలకు గాను 11 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా ఇద్దరికి లక్కీడిప్‌లో దుకాణాలు దక్కాయి. నంద్యాల జిల్లాలో కొత్తపల్లి దుకాణం అగశాల పల్లవి, కర్నూలు జిల్లాలో కోసిగి దుకాణం ఈడిగ సుజాత దక్కించుకున్నారు. జనరల్‌ కేటగిరీ కింద గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన మద్యం టెండర్లలో కూడా కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గాను 56 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా 10 మందికి లక్కీడిప్‌లో దుకాణాలు దక్కాయి.

ప్రభుత్వానికి భారీగా ఆదాయం...

ఎక్సైజ్‌ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దరఖాస్తుల ద్వారా రూ.4.68 కోట్లు మొదటి విడత లైసెన్స్‌ రుసుం కింద రూ.87.66 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. రెండు జిల్లాల్లోనూ 21 మద్యం దుకాణాలకు గెజిట్‌ నంబర్‌ ప్రకారం క్రమ సంఖ్య ఆధారంగా స్టీల్‌ బాక్సులో ప్లాస్టిక్‌ కాయిన్లు వేసి లక్కీడిప్‌ తీశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ మధ్యాహ్నానికి ముగిసింది. మొదట మున్సిపల్‌ పట్టణ ప్రాంతాలు, ఆ తర్వాత సర్కిళ్ల వారీగా మండల కేంద్రాల్లోని దుకాణాలకు లాటరీ నిర్వహించారు. ఎంపికై న మొదటి వ్యక్తి వెంటనే లైసెన్స్‌ ఫీజు చెల్లించి దుకాణాన్ని దక్కించుకున్నారు. దుకాణాల కేటాయింపుపై ఎవరికీ అపోహ లేకుండా వీడియో, కెమెరాలతో చిత్రీకరించారు.

ప్రైవేటు మాఫియాగా మారిన వారికి మరిన్ని మద్యం దుకాణాలు

రెండో విడత కేటాయింపులో చక్రం తిప్పిన టీడీపీ నాయకులు

ఆదాయం కోసం దుకాణాలను పెంచిన కూటమి ప్రభుత్వం

2014–19 పరిస్థితులు పునరావృతం

2014–19 మధ్యకాలంలో టీడీపీ మద్యం పాలసీ పేరుతో భారీగా వ్యాపారం చేసింది. వారు నిర్ణయించిన ధరకే మందుబాబులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. చెప్పాలంటే మద్యం వ్యాపారం ఓ మాఫియాలా జరిగేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు మాఫియాకు తావు లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. కొంతమందికి ఉపాధి కల్పించింది. వారి ద్వారా నిర్దేశిత సమయాల్లో విక్రయాలు జరిపించింది. మద్యం ఏరులై ప్రవహించకూడదని పరిమిత షాపులు పెట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో 175 మద్యం దుకాణాలు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయమే లక్ష్యంగా మొదటి విడత 204, రెండవ విడత గీత ఉప కులాల పేరుతో మరో 21 దుకాణాలు కలిపి మొత్తం 225 దుకాణాలకు అనుమతులు జారీ చేసి జిల్లాలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
‘తమ్ముళ్ల’కు కిక్కేకిక్కు! 1
1/1

‘తమ్ముళ్ల’కు కిక్కేకిక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement