గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ ప్రసంగం
హవేళిఘణాపూర్(మెదక్): గులాబీ దళపతి బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెల్కం బోర్డు నుంచి రాందాస్ చౌరస్తా వరకు దారి పొడవునా వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు నీరాజనం పలికారు. ర్యాలీగా వచ్చిన ఆయన రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన తీరు కార్యకర్తల్లో జోష్ నింపింది. గతంలో ఆయనకు మెదక్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం 15 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేశానని.. చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోని హల్దివాగు, ఏడుపాయల వన దుర్గామాత, ప్రత్యేక మెదక్ జిల్లా ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలు నిశబ్ధంగా విన్నారు. ఆయన ప్రసంగించిన 16 నిమిషాల్లో ఎనిమిది నిమిషాల పాటు మెదక్ జిల్లా గురించే మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టంకడితే మనం అనుకున్న అభివృద్ధి చేయొచ్చన్నారు.