కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ
●పార్టీ ‘ఎన్టీఆర్’ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ●గుగ్గిళ్ల శ్రీను కుటుంబానికి రూ.2 లక్షలు అందజేత
జగ్గయ్యపేట అర్బన్: కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ ఉంటుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఇటీవల జగ్గయ్యపేటలోని నాగమయ్య బజారులో విద్యుత్ స్తంభం విషయంలో టీడీపీ నాయకుల వేధింపులు, దౌర్జన్యాలకు గురైన వైఎస్సార్ సీపీ బీసీ కార్యకర్త గుగ్గిళ్ల శ్రీను ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. బాధిత కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ తరఫున మాజీ సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీన్ని గుగ్గిళ్ల శ్రీను కుటుంబ సభ్యులకు అందజేసేందుకు దేవినేని అవినాష్ ఆదివారం జగ్గయ్యపేట వచ్చారు. పార్టీ జగ్గయ్యపేట సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా)తో కలిసి శ్రీను గృహానికి వెళ్లి అతని భార్య గోవిందమ్మ, తల్లిదండ్రులు నాగమణి, లక్ష్మయ్యకు ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భగా అవినాష్ మాట్లాడుతూ.. భయపడవద్దని, వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులంతా అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
పార్టీకి 40 శాతం ఓటింగ్
వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొందరు పార్టీని విడిచి వెళ్లారని, ఎవరు వెళ్లినా పోరాటాలు ఆగవని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో పార్టీకి 40 శాతం ఓటింగ్ ఉందని, తామంతా 2029లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు విశ్రమించేది లేదన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీకి పోరాటాలు కొత్త కాదని, 2011లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీతోనే ప్రస్తానం మొదలైందని గుర్తుచేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నీసా ఫిరోజ్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్, మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్, ఎంపీపీలు మార్కపూడి గాంధీ, రమాదేవి, పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి బద్దూనాయక్, జిల్లా వక్ఫ్బోర్డు ప్రధాన కార్యదర్శి షేక్ జుబేర్, పార్టీ పేట మండల అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment