కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలని బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్క్లబ్లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘భూ సమస్యలు, భూ చట్టాలల అమలు, ప్రభుత్వ పాత్ర ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆవుల శేఖర్ మాట్లాడుతూ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం సెంటు భూమి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాలుగా ఇళ్ల స్థలాలు ఇస్తాం. డబ్బులు ఇస్తాం. పేదలను పెద్దవాళ్లుగా చేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. భూములు పంచితేనే పేదవాడికి ఆత్మ గౌరవం ఉంటుందన్నారు. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని సక్రమంగా కొనసాగించాలని అన్నారు. పేదల సాగులో ఉన్న భూములకు అన్ని రెవెన్యూ హక్కులు కల్పించాలన్నారు. భూ బదలాయింపు నిషేధిత చట్టం సెక్షన్ 22 ఏ సవరించకూడదన్నారు. అటవీ హక్కుల సంరక్షణ చట్టం ద్వారా గిరిజనులకు హక్కులు కల్పించాలని, రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 13 లక్షల ఎకరాలు తిరిగి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యమేలుతున్న భూమాఫియాను అరికట్టాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసైన్ మెంట్ భూముల బదలాయింపు నిషేధిత చట్టానికి సవరణలు రద్దు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ పేదలకు భూ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలన్నీ కూడా చెత్త బుట్టలోకి వెళ్లాయన్నారు. భూముల సమస్య మీద రాబోయే కాలంలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి పేదలకు భూములు దక్కించే విధంగా ఈ చేసిన చట్టాలను అమలు జరిపించుకునే విధంగా తమ పోరాటం ఉంటుందన్నారు. సమావేశంలో రైతు, రైతు కూలీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కేశవరెడ్డి, ఉప్పెన నరసింహారావు, కొండా వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment