అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విజేత కౌత్సవ్
విజయవాడస్పోర్ట్స్:బీఎన్కేయూ మొదటి అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విభాగం విజేతగా పశ్చిమబెంగాల్ క్రీడాకారుడు కౌత్సవ్ కండు నిలిచాడు. విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఆరు రోజులుగా జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. రూ.15 లక్షల నగదు బహుమతితో క్లాసికల్, బ్లిడ్జ్, ర్యాపిడ్ రౌండ్లలో నిర్వహించిన ఈ పోటీలకు మూడు దేశాల నుంచి వందలాది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. క్లాసికల్, బ్లిడ్జ్ విభాగం పోటీలు ఈ నెల 26న ముగియగా, ర్యాపిడ్ రౌండ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ర్యాపిడ్ రౌండ్కు ప్రాతినిధ్యం వహించిన 601 మంది క్రీడాకారులకు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ఓపెన్ విభాగంలో అత్యధికంగా 8/9 పాయింట్లను సాధించిన అంతర్జాతీయ మాస్టర్ కౌత్సవ్ కండు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతిని అందుకోగా, రెండో స్థానంలో నిలిచిన అంతర్జాతీయ మాస్టర్ కుశాగ్రమోహన్ (తెలంగాణ) రూ.20 వేల నగదు, మూడో స్థానం సాధించిన గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.వెంకటేష్ (తమిళనాడు) రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment