ముగిసిన అంతర్ జిల్లాల సైక్లింగ్ టోర్నీ
విజయవాడరూరల్: విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన 68వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల అండర్–14, 17, 19 బాలురు, బాలికల సైక్లింగ్ టోర్నీలో విజయనగరం జిల్లా ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది. మూడు విభాగాల్లో ఆ జిల్లా సైక్లిస్ట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 34 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ సాధించారు. 31 పాయింట్లతో గుంటూరు జిల్లా జట్టు రెండో స్థానంలో, ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు 21 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ యూనిట్ పర్యవేక్షణలో రెండు రోజులపాటు నున్న జెడ్పీ హైస్కూల్ 16వ నంబరు జాతీయ రహదారిపై సైక్లింగ్ పోటీలను నిర్వహించింది. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 300 మంది సైక్లిస్ట్లు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయా విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్)నేషనల్స్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగిన సైక్లింగ్ టోర్నీ ముగింపు కార్యక్రమం జెడ్పీ హైస్కూల్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ గేమ్స్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సైక్లింగ్ కోచ్ వి.కనకారావు, ఓవరాల్ చాంపియన్షిప్ ట్రోఫీలను అందజేశారు. వ్యక్తిగత అంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి రిటైర్డ్ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు (ఖాజీపేట) వేణుగోపాలరావు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు నరెడ్ల సత్యనారాయణరెడ్డి, శివశేషిరెడ్డి మెడల్స్ను ప్రదానం చేశారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి కె.సుగుణరావు, టి.శ్రీలత, టి.విజయవర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment