దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లను ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీ హోమం, లక్ష కుంకుమార్చన వంటి ఆర్జిత సేవలతో పాటు ఆదివారం లోక సంరక్షణార్ధం, సర్వ మానవాళి శ్రేయస్సు, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన సూర్యోపాసన సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈవో కెఎస్.రామరావు క్యూలైన్లను పర్యవేక్షించి ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా రద్దీని అంచనా వేస్తూ తగు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ మళ్లీ పెరిగింది.
ఇష్టానుసారం కార్ల పార్కింగ్.....
ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ప్రోటోకాల్ కార్యాలయం వరకు కార్లు, ఇతర వాహనాలు ఇష్టానుసారంగా నిలపడంపై దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అదే సమయంలో ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ మొదలు, ప్రొటోకాల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున కార్లు నిలిపి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment