దుర్గమ్మ సేవలో పద్మశ్రీ యెల్లా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మృదంగ విద్వాంసుడు పద్మశ్రీ యెల్లా వెంకటేశ్వరరావు గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన యెల్లా వెంకటేశ్వరరావుకు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
తనిఖీలతో నిలిచిన
ఇసుక తవ్వకాలు
పెనుగంచిప్రోలు: మండలంలోని శనగపాడు గ్రామంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్లో తవ్వకాలకు బ్రేక్ పడింది. మంగళవారం రాత్రి మైనింగ్ అధికారులు రీచ్ను తనిఖీ చేశారు. ఆ సమయంలో మండలానికి చెందిన ట్రాక్టర్లు కాకుండా ఇతర మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక రవాణాకు రావడాన్ని గుర్తించారు. దీంతో తదు పరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇసుక రవాణా నిలిపి వేయాలని అధికారులు ఆదేశించారు. పెనుగంచిప్రోలు మండల ప్రజలు మాత్రమే ఇసుక తోలుకోవాలన్నారు. రాత్రి సమయంలో ఇసుక బయటకు తరలి వెళ్లకుండా చూడాలని రీచ్ను పర్యవేక్షిస్తున్న అధికారులను ఆదేశించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే స్థానికులను ఇసుక తోలుకోవాలని ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో ఇసుక తరలిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రీచ్లో ఇసుక తోలకాలను నిలిపి వేశామని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇసుక రవాణా జరగదని వీఆర్వో పి.శ్రీను తెలిపారు. గ్రామంలో నిర్మా ణాలకు అవసరమైన వారు ఇసుక తోలుకోవచ్చని సూచించారు.
ఏపీపీఎస్సీ చైర్పర్సన్
అనురాధను కలిసిన సీపీ
విజయవాడస్పోర్ట్స్: ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా నియమితులైన అనురాధను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సూర్యారావుపేటలోని హెచ్వోడీ భవనంలో ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆమె చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను సీపీ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు.
అంతర్జాతీయ చెస్
టోర్నీలో నీలాష్ ముందంజ
విజయవాడస్పోర్ట్స్: భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ (బీఎన్కేయూ) మొదటి అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ పోటీల్లో పశ్చిమబెంగాల్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ నీలాష్ సాహా ముందంజలో కొనసాగుతున్నారు. విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 22వ తేదీన ఈ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం గురువారం ఆరో రౌండ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పొట్లూరి భాస్కరరావు, బ్రిటీష్ కౌన్సిల్ ఇన్విజిలేటర్ ఫర్ ఐఈఎల్టీ దుగ్గిరాల హరిత మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. 5/5 పాయింట్లతో ఆరో రౌండ్లోకి ప్రవేశించిన నీలాష్ సాహా అంతర్జాతీయ మాస్టర్ శ్రీహరితో పోటీ పడ్డారు. వారి మధ్య నాలుగు గంటల పాటు ఆట అత్యంత రసవత్తరంగా కొనసా గింది. తుదకు నీలాష్సాహా 6/6 పాయింట్లతో గెలిచారు. ఆరో రౌండ్ ముగిసే నాటికి తమిళనాడుకు చెందిన గ్రాండ్మాస్టర్ వెంకటేష్ ఎం. ఆర్, అంతర్జాతీయ మాస్టర్ శర్వనన్కృష్ణన్, పశ్చిమబెంగాల్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ కౌత్సవ్ కుండు 5.5/6 పాయింట్లతో కొనసాగుతున్నట్లు టోర్నీ కన్వీనర్ షేక్ ఖాసీం, డైరెక్టర్ విత్తనాల కుమార్, చీఫ్ ఆర్బిటర్ వసంత్, ఆర్బిటర్ అమ్మినేని ఉదయకుమార్నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment