పోలీసుల అదుపులో గంజాయి విక్రయదారులు
మైలవరం: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వై.ప్రసాదరావు తెలిపారు. బైకులు దొంగతనం చేసి, ఆంధ్రా–ఒడిశా బోర్డర్ ఏజెన్సీ లో వాటిని ఇచ్చి గంజాయిని తెచ్చి అమ్ముకుంటున్న వ్యక్తులను అరెస్టు చేసినట్టు చెప్పారు. తమకు అందిన సమాచారం మేరకు మైలవరం సీఐ దాడి చంద్ర శేఖర్, ఎస్ఐ కె.సుధాకర్ తమ సిబ్బందితో కలసి గురువారం స్థానిక తిరువూరు రోడ్డులోని ఒక వెంచర్లో ఉన్న పాడైపోయిన రేకుల షెడ్డులో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద 1.3 కిలోలు గంజాయి, 8 దొంగిలించిన బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టు బడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారు. నిందితులను విచారించగా వారు, మరికొందరితో కలసి ఎన్టీఆర్ జిల్లా, కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలలో బైకులు దొంగిలించి ఆ బైక్లను ఏజెన్సీ ప్రాంతాల్లో కిముడు శంకర్ అనే వ్యక్తికి ఇచ్చి అతని వద్దనే గంజాయి కొని అర్బన్ ప్రాంతాలకు తీసుకువచ్చి చిన్నచిన్న పొట్లాలుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ కిలో రూ.4వేలు ఉండగా దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రూ.20వేల నుంచి రూ.30వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment