కాసులు కురిపిస్తున్న ఉచిత ఇసుక పథకం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలోని రీచ్లు ఇసుక మాఫియా అక్రమాలకు అడ్డాగా మారాయి. పచ్చతోడేళ్లు స్వైర విహారం చేస్తూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక తవ్వి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నాయి. తెలంగాణతోపాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో సైతం ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. దీనిని అవకాశంగా తీసుకున్న తెలుగు తమ్ముళ్లు కీసర, మోగులూరు, మునేరు, గానుగపాడు నుంచి తెలంగాణలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు, విజయ వాడ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక పథకాన్ని వరంగా మార్చుకున్నారు. ఇసుక నుంచి కాసుల వర్షం కురిపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి స్టాకు యార్డుల్లో ఉన్న ఇసుకను టీడీపీ నేతలు మింగేశారు. టెండర్లు పిలిచి అప్పగించిన ఇసుక రీచ్లలో సైతం చేతి వాటం ప్రదర్శించారు. రీచ్ల నుంచి స్టాక్ యార్డుకు ఇసుకను తరలించి టన్ను రూ.232 చొప్పున వినియోగదారులకు అందించాల్సి ఉంది. అయితే ఇసుక మాఫియా అందుకు విరుద్ధంగా చర్యలు చేపట్టింది. పెద్ద పెద్ద లారీలను నేరుగా రీచ్లలోకి పంపించి జేసీబీల సాయంతో నింపుకొని విజయవాడ, హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ఉచిత ఇసుక మాట దేవుడెరుగు టన్నుకు రూ.1500 నుంచి రూ.1750 వరకు చెల్లించాల్సి వస్తోంది.
పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకునిపాలెం, శనగపాడు గ్రామాల్లోని మున్నేరు నుంచి తెలుగు తమ్ముళ్లు ట్రాక్టర్లలతో భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పగలు ఆయా గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, మామిడి తోటల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో డంప్ చేసిన ఇసుకను లారీల్లో లోడుచేసి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తు న్నారు. ఇసుక దందాలో జగ్గయ్యపేట టీడీపీ ప్రజాప్రతినిధి హస్తం ఉండటంతోనే పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. తిరువూరు మండలంలోని గానుగ పాడు వాగులో ఉచిత ఇసుక పేరుతో తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరువూరు నుంచి తెలంగాణ వైపు ట్రాక్టర్లు పరుగు పెడుతున్నాయి. ఇసుక వ్యవహా రంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లు పైకి కలరింగ్ ఇస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇసుక దందా జోరుగా సాగుతోంది. చోటా మోటా నాయకులు కూడా ట్రాక్టర్లు, లారీలు కొనుగోలు చేసి ఇసుక మాఫియా అవతారం ఎత్తుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారం మొత్తం స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు.
యథేచ్ఛగా అక్రమ రవాణా
మున్నేరు, గానుగపాడువాగులో..
తెలంగాణకు యథేచ్ఛగా
ఇసుక అక్రమ రవాణా
రాత్రి సమయాల్లో భారీగా తరలింపు
ఓ టీడీపీ ఎంపీ అనుచరుల పేరుతో దోపిడీ పర్వం
కీసర, మోగులూరు, మునేరువాగు
నుంచి ఇసుక తరలింపు
ఇసుక అక్రమ రవాణాను
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment