పశుగణనను కచ్చితత్వంతో చేపట్టాలి
● నేటి నుంచి 21వ పశుగణన ప్రారంభం
● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శుక్రవారం నుంచి 21వ జాతీయ పశు గణన ప్రారంభం కానుందని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. కచ్చితత్వంతో గణాంకాలు నమోదు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. విజయవాడలోని జేసీ క్యాంపు కార్యాలయంలో పశు గణన వాల్పోస్టర్లు, నియమావళి పుస్తకాలను ఆవిష్కరించారు. పశు గణన ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ట్రావెలింగ్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు నెలల పాటు 20 మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పశుగణన జరుగుతుందన్నారు. ఇందుకు 241 మంది పశుగణనకర్తలు, 47 మంది పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గణనకర్తను కేటాయించామని, జిల్లాలోని 7,02,900 కుటుంబాలను సర్వేచేసి గేదెలు, ఆవులు, కోళ్లు, గొర్రెలు, మేకలు ఇలా 16 రకాల పశువులు, జీవాల సంఖ్యను లెక్కించి, యాప్లో నమోదు చేయనున్నట్లు వివరించారు. పశు గణన ఆధారంగా నిధులతో పాటు వ్యాధినిరోధక టీకాలు, నట్టల వ్యాధి నివారణ మందులు వంటివి సరఫరా అవు తాయన్నారు. ఈ నేపథ్యంలో పాడిరైతులు గణనకర్తలకు కచ్చితమైన వివరాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ డీఆర్వోగా లక్ష్మీనరసింహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డెప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం.లక్ష్మీనరసింహం నియమితులయ్యారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్లో పనిచేస్తున్న లక్ష్మీనరసింహం బదిలీపై ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోగా పోస్టింగ్ పొందారు. ఇక్కడ పనిచేస్తున్న డీఆర్వో వి.శ్రీనివాస రావును సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment