హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు తగిన సిబ్బందిని కేటాయిస్తామని కృష్ణాజిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు అన్నారు. బాపులపాడు మండలంలోని వీరవల్లి పోలీస్స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. పోలీస్స్టేషన్ను తనిఖీ చేయటంతో పాటుగా రికార్డులను పరిశీలించారు. వీరవల్లి పోలీస్స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు, విచారణలో ఉన్న కేసుల పురోగతి, హైవేపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. జాతీయ రహదారిపై వీఐపీల రాకపోకలు అధికంగా ఉండటం, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హైవే మొబైల్ పెట్రోలింగ్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎస్పీ గంగాధరరావు చెప్పారు. దాతల సహకారంతో నిర్మించిన హనుమాన్జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. నేరాలను అదుపు చేసేందుకు అవసరమైన కూడళ్లు, ప్రాంతాల్లో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. తొలుత వీరవల్లి పోలీస్స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు ఆయన నివాళి అర్పించారు. హనుమాన్జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ, వీరవల్లి ఎస్ఐ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment