చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఏవో అనూరాధ
బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో పూర్వీకులు నివాసముండేవారు. చాలా ఏళ్ల క్రితం కుటుంబం విచ్ఛిన్నం కాగా ఊరొదిలి వెళ్లపోయి ఆరునెలల క్రితం మళ్లీ ఊర్లోకి వచ్చిన పేరు లావేటి బ్రహ్మాజీరావు అనాథలా కొన్ని నెలలుగా రామమందిరం గడపలో పడుకుంటున్నాడు. సరిగా మాటలు కూడా రావు. అయితే స్థానిక వాలంటీర్ తామాడ ఆనందరావు బ్రహ్మాజీరావును గుర్తించి స్థానికులతో మాట్లాడి ఆధార్ కార్డు చేయించి పెన్షన్కు అప్లై చేశాడు. వెంటనే అతనికి రైస్ కార్డు, పెన్షన్కూడా మంజూరైంది. ఈ క్రమంలో బ్రహ్మాజీ రావుకు మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు చేతుల మీదుగా మంగళవారం పెన్షన్ డబ్బు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతోనే మానవత్వం, సంక్షేమం ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కనిపించకుండా కుటుంబం విచ్ఛిన్నమైన తరువాత గ్రామంలోకి వచ్చి రామమందిరంపై పడుకుంటున్న వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వలంటీర్ ఆనంద్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.
ఆర్బీకేలో చోరీ
దత్తిరాజేరు: మండలంలోని వి.కృష్ణాపురం ఆర్బీకేలో గుర్తు తెలియని వ్యక్తులు టీవీని చోరీ చేసినట్లు ఏవో అనూరాధ మంగళవారం తెలిపారు. ఆర్బీకే తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టి టీవీతో పాటు కంప్యూటర్ పరికరాలను ఎత్తుకెళ్లడంతో పెదమానాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
1700 సారా ప్యాకెట్లు స్వాధీనం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మండలం అడ్డూరు వలస గ్రామ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 1700 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ ఉపేంద్ర తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన స్థానిక ఎస్ఈబీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం నుంచి సారా రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించి అడారు గ్రామానికి చెందిన మండంగి శ్రీరాములు సారా ప్యాకెట్లు రవాణా చేస్తున్నట్లు గుర్తించి ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం పార్వతీపురం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. దాడుల్లో ఎస్సై రమణ, సిబ్బంది పాల్గొన్నారన్నారు.
29 మద్యం సీసాల స్వాధీనం
లక్కవరపుకోట: మండలంలోని లచ్ఛంపేట గ్రామం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 29 మద్యం సీసాలను ఏఎస్సై గోవిందరావు ఆద్వర్యంలో పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామం సమీపంలో గల మద్యం దుకాణం నుంచి వేపాడ మండలంలోని కుంపల్లి గ్రామానికి చెందిన డెక్క నాయుడు మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై గోవిందరావు తెలిపారు.
2.5 లీటర్ల సారా..
కొత్తవలస: మండలంలోని తమ్మన్నమెరక గ్రామం సమీపంలో సారా అమ్ముతుండగా సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర 2.5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కొత్తవలస న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
పాచిపెంట: భార్య మందలించిందని పురుగు మందు తాగిన వ్యక్తి విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు, మండల కేంద్రానికి చెందిన దాసరి అప్పన్న(52) రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో ఈనెల 7వ తేదీన భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగేశాడు. వెంటనే కుటుంబసభ్యులు విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment