● నేడు ‘పీఎం కిసాన్’ రూ.2 వేలు విడుదల ● ‘అన్నదాత సుఖీభవ’పై తేల్చని రాష్ట్ర సర్కారు
కొరిటెపాడు(గుంటూరు): పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక్కో రైతుకు రూ.2 వేల వంతున విడుదల చేయనుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రెండవ విడతగా (మొత్తంగా 18వ విడత) సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. గుంటూరు జిల్లాలో అర్హత కలిగిన 86,674 మంది రైతుల ఖాతాల్లోకి రూ.17.34 కోట్ల పెట్టుబడి సాయం నేరుగా జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతగా గత జూన్ 18వ తేదీన 85,400 మందికి రూ.17.08 కోట్లు ఇచ్చారన్నారు.
బాబూ.. రైతులు గుర్తున్నారా..?
అన్నదాతకు సాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని గొప్పగా చెబుతూ ‘సూపర్ సిక్స్’తో ఎన్నికల ముందు అదరగొట్టారు. తీరా అధికారం చేపట్టగానే దాని ఊసే ఎత్తడం లేదు. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ పథకం పేరు మార్చి రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. రూ.20 వేలు ఎప్పటి నుంచి ఇస్తారు..? ఎన్ని విడతలుగా అందిస్తారు? పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఇస్తారా? రూ.6 వేలు పోను మిగతా రూ.14 వేలు అందిస్తారా? అనేది కూడా స్పష్టం చేయడం లేదు. ఇలా అన్నదాతలను మోసం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరిని రైతులు, రైతు సంఘాల నాయకులు, విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
అన్నదాతలకు వైఎస్ జగన్ చేయూత
సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో సైతం రైతులకు అండగా ఉన్నారు. అన్నదాతల కష్టనష్టాల్లో తోడుగా నిలబడ్డారు. ఏటా క్రమం తప్పకుండా జూన్, అక్టోబర్, జనవరి నెలల్లో ప్రతి రైతుకు పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 చొప్పున జమ చేశారు. కౌలు రైతులు, దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కేంద్రంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందించారు. ఐదేళ్ల కాలంలో ఒక్కో రైతు ఖాతాలో రూ.67,500 మేర జమ చేశారు. ఏటా సగటున 1.20 లక్షల మంది రైతులకు సుమారు రూ.830 కోట్లు అందించి భరోసా కల్పించారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment