నరసరావుపేట: రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం వాల్మీకి కుల సంఘాల నాయకుల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాల్మీకి బోయ కమ్యూనిటీ సభ్యులు కూడా ప్రసంగించారు. డీఆర్వో కె.వినాయకం, వాల్మీకి సంఘ నాయకులు, పలువురు జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఖాయం
పిడుగురాళ్ల: ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని పల్నాడు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిబాబా రాజు అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదన్నారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకాన్ని ఇన్సూరెన్స్ విధానంలోకి మార్పు చేసినా పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి న్యాయం జరగడం లేదన్నారు. 17 సంవత్సరాల సర్వీసును పరిగణనలోకి తీసుకొని కాంట్రాక్ట్లో క్యాడర్ కల్పించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన సిబ్బందికి రూ. 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. పదవీ విరమణ పొందితే రూ. 10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పవర్ లిఫ్టింగ్లో జ్యోతి వర్మకు పతకం
మంగళగిరి: గోవాలో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ మెన్ , ఉమెన్ బెంచ్ ప్రెస్ చాంపియన్షిప్ పోటీల్లో గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టర్ పి. జ్యోతి వర్మ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు గురువారం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, సంధాని తెలిపారు. పవర్ లిఫ్టింగ్లో నేషనల్ స్థాయిలో మాస్టర్ 2ప్లస్ 50 ఇయర్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి పవర్ లిఫ్టర్ జ్యోతి వర్మని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంట వెంకటేశ్వరరావు, కార్యదర్శి సకల సూర్యనారాయణతో పాటు ప్రతినిధులు అభినందించినట్లు తెలిపారు.
నృసింహ స్వామికి రూ. 45.51లక్షల ఆదాయం
మంగళగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామికి రూ.45,51,136 ఆదాయం లభించిందని ఈవో ఏ. రామకోటిరెడ్డి తెలిపారు. స్వామి దిగువ సన్నిధి, ఎగువ సన్నిధిలతో పాటు ఘాట్ రోడ్డుపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించినట్లు పేర్కొన్నారు. ఎగువ సన్నిధిలో రూ. 18,90,274, దిగువ సన్నిధిలో రూ. 25,30,803, వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 85,800తో పాటు అన్నదానానికి రూ. 44,259 సమకూరినట్లు తెలిపారు.గత మూడు నెలల కంటే ప్రస్తుతం రూ. 29,259 అదనంగా వచ్చినట్లు చెప్పారు.
ప్రకాశం బ్యారేజ్ దిగువకు నీరు విడుదల
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 61,072 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కు వచ్చి చేరనున్నదని ,దిగువకు 57,500క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment