ప్రతి ఇంటా ప్రగతి..అదే పీ–4 పాలసీ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా ప్రగతి..అదే పీ–4 పాలసీ లక్ష్యం

Published Fri, Feb 7 2025 1:33 AM | Last Updated on Fri, Feb 7 2025 1:33 AM

ప్రతి ఇంటా ప్రగతి..అదే పీ–4 పాలసీ లక్ష్యం

ప్రతి ఇంటా ప్రగతి..అదే పీ–4 పాలసీ లక్ష్యం

నరసరావుపేట: ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పీ–4 పాలసీని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి పీ–4 ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అన్నీ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న ఉగాదిన ప్రారంభించ తలపెట్టిన పీ–4 పాలసీ అమలుపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా జిల్లా జనాభాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అత్యంత ప్రాధాన్యతతో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఎన్జీవోలు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు వివిధ రంగాల నిపుణులను భాగస్వామ్యం, వారి నైపుణ్యం, వనరులు, మార్గదర్శకత్వాన్ని పంచుకోవడం ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. జీరో పావర్టీ, పి–4, నియోజకవర్గ విజన్‌ ప్లాన్‌ను ఒక సమష్టి శక్తిగా అమలు చేయాలన్నారు. అందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో ప్రభుత్వం పీ–4 విధానంపై అందరి ఆలోచనలు, అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. ప్రతి ఒక్కరి అవసరాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరూ అంతర్భాగంగా చొరవ చూపాలన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి పబ్లిక్‌ కన్సల్టేషన్‌ కోసం రూపొందించిన ప్రశ్నపత్రం సర్వేను ప్రణాళికా విభాగం సిద్ధం చేస్తుందన్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి ఏడు నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వేలో జిల్లా పౌరులను భాగస్వామ్యం చేసే లక్ష్యంగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. స్వర్ణ ఆంధ్ర విజన్‌ 2047ను సక్రమంగా అమలు చేయడానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సమష్టిగా కృషి చేస్తూ రానున్న ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే, డీఆర్వో ఎ.మురళి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ పి అరుణ్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement