చంద్రబాబు పాపం..
మద్దిపాడు: ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించే విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకోవడం పలువురి పాలిట శాపంగా మారుతోంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి వలంటీర్ల విధులను అడ్డుకుని చంద్రబాబు చేసిన పాపానికి మరో ప్రాణం పోయింది. మద్దిపాడు మండలంలోని బసవన్నపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గుంతోటి రామయ్య ఈ నెల 6వ తేదీ పెన్షన్ తీసుకోవడానికి మద్దిపాడు బ్యాంకుకు కుమారుని సాయంతో మోటార్ బైక్పై ఎండలో వెళ్లాడు. అక్కడ క్యూలో నిలబడి పెన్షన్ తీసుకుని మధ్యాహ్నం మండుటెండలో కాలినడకన ఇంటికి చేరాడు. బసవన్నపాలెం హైస్కూల్ వద్దకు వెళ్లే సమయానికి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఒంగోలు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీనిపై స్థానిక నాయకులు స్పందిస్తూ ఈ పాపం ఎవరిది చంద్రబాబూ అంటూ ప్రశ్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మంత్రి మేరుగు నాగార్జున బుధవారం ఉదయం బసవన్నపాలెం చేరుకుని రామయ్య మృతికి సంతాపం తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జి భవాని ప్రసాద్ను మృతుని ఇంటికి పంపి మట్టి ఖర్చుల నిమిత్తం కొంత డబ్బును తన తరఫున మంత్రి అందించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు గుంతోటి రవీంద్రనాథ్, తదితరులు వెళ్లి సంతాపం తెలిపారు.
పెన్షన్ కోసం ఎండలో బ్యాంకుకు వెళ్లి వ్యక్తి మృతి
వలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ అందించడాన్ని అడ్డుకున్న
చంద్రబాబు