ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరిపోతోంది. హద్దుమీరి ప్రవర్తిస్తూ కార్యాలయంలోనే బెదిరింపులకు దిగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. బదిలీలపై జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సంతకాలు చేసిన ఫైలును సైతం పక్కన పెట్టేశారు. గురువారం కూడా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు, అనుచరులు ఏకంగా అధికారుల చాంబర్లో కూర్చుని ఫైలు సిద్ధం చేశారు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పీఏ అయితే.. తాను ఇచ్చిన లిస్ట్ తయారు చేయాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. తాజా పరిణామాలతో జెడ్పీలో బదిలీల పరిస్థితి వివాదాస్పదంగా మారింది.
కొత్త లిస్ట్ తయారు...
జెడ్పీలో ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 392 మందికి స్థాన చలనం కల్పించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బదిలీల వ్యవహారాన్ని నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ బదిలీలపై సంతకాలు చేశారు. 22వ తేదీ బదిలీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే జెడ్పీలో ఉన్నతాధికారి ఒకరు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రాపకం కోసం ఉద్దేశపూర్వకంగా ఆ ఫైలును పక్కనబెట్టినట్టు కొత్త లిస్టు తయారు చేసినట్లు సమాచారం. దీనికోసం నాలుగు రోజులుగా అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు జిల్లా పరిషత్ కార్యాలయంలో హల్చల్ చేస్తున్నారు. తాము చెప్పినవారికి చెప్పినట్టుగా బదిలీలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి అనుచరులు జెడ్పీ కార్యాలయంలో అసభ్య పదజాలంతో దూషిస్తూ సిబ్బందిని బెదిరింపులకు గురిచేసిన ఘటన విధితమే. గురువారం కూడా సదరు వ్యక్తులతో పాటు ఒక మంత్రి పీఏ ఏకంగా అధికారుల చాంబర్లో కూర్చుని బదిలీలకు సంబంధించి కొత్త లిస్ట్ తయారు చేయించినట్లు తెలిసింది. తాము చెప్పినట్టు వింటే భవిష్యత్లో మంచి పోస్టింగ్లు సైతం ఇప్పిస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘స్వామి’ భక్తిని చాటుకునేందుకు మంచి అవకాశం దక్కిందన్న సంతోషంలో బదిలీల ప్రక్రియను సాగదీస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి.
అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అధికారుల జీ హుజూర్ గందరగోళంగా బదిలీల ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment