ఒంగోలు టౌన్: స్థానిక రత్నమహల్ సెంటర్లో దళిత యువకుడైన మైలవరపు హరిబాబుపై దాడి చేసి, అతడి బుల్లెట్ను దౌర్జన్యంగా తీసుకెళ్లిన కమ్మపాలేనికి చెందిన గడ్డం ఉమామహేష్ ముఠాను వెంటనే అరెస్టు చేయాలని మాలమహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని మాల మహానాడు కార్యాలయంలో బాధితుడు హరిబాబు, దళిత నాయకులు కసుకుర్తి రాజు, కాకుమాను రవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వాసేపల్లి గ్రామానికి చెందిన మైలవరపు హరిబాబు 2011లో ఒంగోలు నగరంలోని కమ్మపాలేనికి చెందిన గడ్డం ఉమామహేష్ దగ్గర నూటికి 4 రూపాయల వడ్డీకి 70 వేల రుపాయలు అప్పు తీసుకున్నాడు. 2014లో హరిబాబు వద్ద ఉన్న బుల్లెట్ను ఉమామహేష్ తీసుకున్నాడు. కొద్దిరోజుల తరువాత తన బుల్లెట్ గురించి అడిగితే పోయిందని చెప్పాడు. అంతటితో ఆగకుండా తన వద్ద తీసుకున్న వడ్డీ డబ్బు తిరిగివ్వాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దాంతో తన బుల్లెట్ వాహనాన్ని ఇచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకెళ్లమని హరిబాబు తేల్చి చెప్పేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అప్పు రద్దు చేసుకుంటూ ఒప్పందం కుదిరింది. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ తన బాకీ తీర్చాలంటూ హరిబాబు మీద ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపథ్యంలో బుధవారం నగరంలోని రత్నమహల్ వద్ద కనిపించిన హరిబాబుపై ఉమామహేష్ మరికొందరితో కలిసి దాడి చేసి కొట్టారు. అతడి వద్ద ఉన్న మరో బుల్లెట్ను దౌర్జన్యంగా తీసుకొని వెళ్లారు. దీనిపై ఉమామహేష్ ముఠాను అరెస్టు చేయాలని అంజయ్య డిమాండ్ చేశారు.
టీడీపీ అధికారంలో ఉందనే దౌర్జన్యం
మాలమహానాడు అధ్యక్షుడు
దారా అంజయ్య
Comments
Please login to add a commentAdd a comment