తాళ్లూరు (దర్శి): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 3750 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని 3200 మంది రైతులు ఈ పంటలు నష్ట పోయారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. వర్షానికి దెబ్బతిన్న మండలంలోని రామభద్రాపురంలో మొక్క జొన్న, మాధవరం, శివరాంపురంలలో గుమ్మడి తోటలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేశామన్నారు. 561 హెక్టార్లలో 784 మంది రైతులకు చెందిన మిరప వంటి ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. అన్నీ వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రకృతి కన్నెర్ర చేయడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. జిల్లాలో సజ్జ, మొక్కజొన్న, పొగాకు పంటలు వేసిన రైతులు నష్టపోయినట్లు గుర్తించామని తెలిపారు. కొన్ని చోట్ల కంకి మీదే తడిసి మొక్కలు వచ్చాయని చెప్పారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. కౌలు రైతులకు సీఎం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వారికి న్యాయం చేస్తారని చెప్పారు. బ్యాంకులతో మాట్లాడి రైతులకు సహకారం అందేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులందరినీ ఆదుకుంటాం కలెక్టర్ తమీమ్ అన్సారియా, మంత్రి స్వామి
Comments
Please login to add a commentAdd a comment