బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి

Published Tue, May 7 2024 6:20 PM

బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి

ఎమ్మెల్యే రాజాసింగ్‌

జహీరాబాద్‌: ప్రధాని మోదీతోనే దేశభద్రత, అభివృద్ధి సాధ్యమని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. సోమవారం రాత్రి జహీరాబాద్‌ పట్టణంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల మతాలకతీతంగా అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి మోది పాలన సాగిస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముస్లింలు, మైనార్టీలు సైతం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలందరికీ ఇండ్లు కట్టిస్తుందన్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వంలోని ఓ మంత్రి భారత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారన్నారు. కాంగ్రెస్‌ వస్తే తమ ఆటలు సాగుతాయనేది వారి ఉద్దేశమన్నారు. కాంగ్రెస్‌తో వారికి అంత సంబంధాలున్నాయనేది అర్థం అవుతోందన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులు పుల్వామాలో సైనికులపై ఘాతుకానికి పాల్పడగా, మోదీ పాకిస్తాన్‌ ఉగ్ర స్థావరాలపై సర్జికల్‌స్ట్రైక్‌తో సమాధానం చెప్పారన్నారు. ఉగ్రవాదులు భారత్‌ వైపు చూడాలంటేనే వణికిపోతున్నారన్నారు. రాముడి పేరుతో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించడం తగదన్నారు. దమ్ముంటే కాశీవిశ్వనాథుడి, మధుర శ్రీకృష్ణుడి ఫోటోలు పెట్టుకుని రాజకీయం చేయమని సవాల్‌ విసిరారు. బీబీ పాటిల్‌ మాట్లాడుతూ రెండు పర్యాయాలు తనను గెలిపించినందుకు కృతజ్ఞుడినని, మరోమారు గెలిపించి అభివృద్ధి చేసే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ క్రమంలో రాజాసింగ్‌పై కాషాయం శ్రేణులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు జి.భాస్కర్‌తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎం.జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement