శాంతి భద్రతలకు పెద్దపీట
సంఘ విద్రోహ శుక్తులపై నిఘా
● రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: డీజీపీ జితేందర్ ● పోలీసు కమిషనరేట్ సందర్శన
సిద్దిపేటకమాన్: జిల్లాలో శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని డీజీపీ జితేందర్ పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ను డీజీపీ సందర్శించారు. సీపీ అనురాధ డీజీపీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శుక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో పారదర్శక పరిశోధన చేసి చార్జి షీట్ దాఖలు చేయాలన్నారు. డయల్ 100కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్య ను పరిష్కరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తరచూ గ్రామాలు సందర్శించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషన్లను తరచూ సందర్శించి తనిఖీ చేయాలన్నారు. నేరస్తులకు కోర్టులలో శిక్షలు పడినపుడే తిరిగి నేరం చేయడానికి భయపడతారన్నారు.
ప్రజలకు చేరువకావాలి..
మల్టీ జోన్ వన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలలో శాంతి భద్రతల సమస్య రాకుండా అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అదనపు డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తంరెడ్డి, సతీష్, సుమన్కుమార్, యాదగిరి, రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీధర్గౌడ్, కిరణ్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment