సంక్షేమ పథకాల అమలులో సర్కార్ విఫలం
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రజా సంక్షేమ పథకాల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. చెప్యాల, అల్వాల, లింగుపల్లి, కాసులాబాద్, లక్ష్మీనగర్, అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో బుధవారం ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా పేరుతో సీఎం రేవంత్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ప్రజాగ్రహానికి గురి కాకతప్పదన్నారు. సాగు నీటికోసం మల్లన్న సాగర్ కాలువ నిర్మాణాలను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రైతులు సాగు నీటికి ఇబ్బందులు సడుతున్నారన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు సమకూర్చలేదన్నారు. వర్షాలు కురుస్తున్నందునా ధాన్యాన్ని కాపాడుకోవడానికి అధికారులు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి, అక్బర్పేట–భూంపల్లి మండల తహసీల్దార్ చంద్రశేఖర్, మిరుదొడ్డి డిప్యూటీ తహసీల్దార్ వీరేష్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఐకేపీ ఏపీఎం డాకయ్య, మండల వ్యవసాయ అధికారి సత్యాన్వేష్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment