వర్సిటీ పోటీలకు ప్రభుత్వ బీఈడీ కళాశాల క్రీడాకారులు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీలకు నెల్లూరు ప్రభుత్వ బీఈడీ కళాశాల క్రీడాకారులు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. ఈ నెల 30 నుంచి చైన్నెలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకు తమ కళాశాల క్రీడాకారుడు కె.యువరాజ్ ఎంపికయ్యారన్నారు. నవంబరు ఒకటో తేదీ నుంచి బెంగళూరు క్రిస్ట్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ పోటీలకు తమ కళాశాల విద్యార్థి పి.చిన్నిబాబు ఎంపికయ్యారని వివరించారు. కళాశాల పీడీ ఎం.రవీంద్రబాబు, సిబ్బందిని అభినందించారు.
సర్పంచ్పై టీడీపీ నేతల దాడి
సోమశిల: అనంతసాగరం మండలంలోని రేవూరు సర్పంచ్పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. సోమవారం మంత్రి ఆనం పర్యటన ఉన్న నేపథ్యంలో ఆదివారం ఉద యం గ్రామ సమీపంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను జేసీబీతో తొలగిస్తున్న సర్పంచ్ ఆత్మకూరు బుజ్జమ్మ భర్త వెంకటేశ్వర్లుపై టీడీపీకి చెందిన పెంచలయ్య దురుసుగా ప్రవర్తించాడు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో చుట్టుపక్కల వారు సర్ది చెప్పి పంపించడంతో సద్దుమణిగింది. అయితే మళ్లీ సర్పంచ్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇరువర్గాల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి కేసు నమోదు చేస్తున్నారు.
ఇళ్ల మధ్య బెల్టు
షాప్ వద్దన్నందుకు దాడి
కోవూరు: ఇళ్ల మధ్యలో బెల్టు షాప్ ఏర్పాటుపై అభ్యంతరం చెప్పాడని దారి కాచి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన ఆదివారం ఇనమడుగు సెంటర్లో జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని వేగూరు వసంతపురంలో శనివారం రాత్రి మద్యం అమ్ముతున్నారన్న విషయంపై స్థానిక మహిళలు వెంకటరమణయ్యతో కలిసి వెళ్లి కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వస్తామని చెప్పడంతో మహిళలు తిరిగి వెళ్లి పోయారు. ఈ విషయం తెలుసుకున్న బెల్టు షాప్ నిర్వాహుకులు నరసింహులు, ఈశ్వర్, నారాయణ మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని మాపైనే పోలీసులకు చెబుతావా అని వెంకటరమణయ్యను ఇనమడుగు సెంటర్లో కరత్రో తలపై కొట్టాడు. గమనించి అటుగా వెళ్తున్న నెల్లూరు గిరి అడ్డుపడడంతో అతనితో దురుసుగా ప్రవర్తించి అతనిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు ఇరుపక్షాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ‘దివాలీ విత్ మై భారత్ ’
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ‘మై భారత్’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నెహ్రూ యువజన కేంద్రం, ఎన్ఎస్ఎస్, కృష్ణచైతన్య డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో సోమవారం నుంచి 30వ తేదీ వరకు ‘దివాలీ విత్మై భారత్’ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా నెహ్రూ యువజన కేంద్రం అధికారి మహేంద్రరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ట్రాఫిక్ నియంత్రణపై నగరంలోని వీఆర్సీ సెంటర్లో అవగాహన కార్యక్రమం, 29వ తేదీన కూరగాయల మార్కెట్ శుభ్రం చేయటం, 30వ తేదీ సర్వజన ఆస్పత్రి ఆవరణ శుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు. యువతలో సేవాభావాన్ని పెంచడం, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులు చేయడమేనని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99635 33440 నంబరులో సంప్రదించాలని కోరారు.
నేడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సమావేశం
నెల్లూరు(సెంట్రల్): ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అమితాబ్శుక్లా, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వల్లూరు సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గూడూరులోని గోగినేనిపురంలో ఉన్న రవి ఇన్సులేటింగ్ కంపెనీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment